Sunday, June 15, 2025

కాళేశ్వరం పూర్తిగా పనికిరాని ప్రాజెక్టు:కూనమనేని సాంబశివరావు

- Advertisement -
- Advertisement -

కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యే సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ హరీశ్‌రావు హంగు, ఆర్భాటాలతో జనబలంతో హాజరు కావడం వెనుక ఆంతర్యం ఏమిటని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కొత్తగూడెం ఎంఎల్‌ఎ కూనమనేని సాంబశివరావు ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం ఎడ్ల గురువారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించి ఎడ్ల గురువారెడ్డి భవనంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..కాళేశ్వరం డిజైన్ తానే చేశానని చెప్పుకున్న కెసిఆర్ ఇప్పుడు తనకేమీ తెలియదు అనడం ఆశ్చర్యంగా ఉందని నిజానిజాలు ఏమిటో కమిషన్ తేలుస్తుందని అన్నారు. కాళేశ్వరం పూర్తిగా పనికిరాని ప్రాజెక్టు అని, సంవత్సరానికి రూ.22 నుండి 23 వేల కోట్ల భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడుతోందని అన్నారు.

సమానత్వ పాలన, విద్య, వైద్యం అందించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. దేశంలో ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిందని ప్రధాని మోడీ చెప్పడంలో వాస్తవిక ఆధారాలు లేవని అన్నారు. దేశంలో 10 శాతం మంది చేతిలోనే సంపద ఉందని, ధన రాజకీయాలతోనే వ్యవస్థ కొనసాగుతోందని అన్నారు. ప్రజలకు కమ్యూనిస్టుల అవసరం ఉందని, ధన రాజకీయాలలో పార్టీ వైఫల్యం చెందినప్పటికీ పోరాటాల పరంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ చైతన్యం తీసుకువచ్చి సమరశీల పోరాటాలు నిర్వహించేలా చూస్తున్నామని అన్నారు. కమ్యూనిస్టులను, మావోయిస్టులను అణచివేయడానికి చూస్తున్న ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని అన్నారు. మావోయిస్టులపై కొనసాగుతున్న దమనకాండను ప్రభుత్వం మానుకోవాలని అన్నారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దురదృష్టకరమని, దీనిపై తగిన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానాలు చేసి ఇప్పుడు కృంగిపోతోందని, చేసిన వాగ్దానాలను నెరవేర్చే దిశగా ప్రజల అవసరాలను తీర్చే దిశగా పరిపాలన కొనసాగించాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలలో పారదర్శకంగా కొనసాగాలని, పార్టీ పథకాలుగా కొనసాగకూడదని అన్నారు. కమ్యూనిస్టు పార్టీ సిపిఐ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఖమ్మంలో డిసెంబర్ 26వ తేదీన 5 లక్షల మందితో భారీ సభ నిర్వహించనున్నామని తెలిపారు. మండల జిల్లా మహాసభలను నిర్వహించి రాష్ట్ర మహాసభలతో భవిష్యత్ కార్యాచరణ పోరాట ప్రణాళికను రూపొందించుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, నాయకులు లక్ష్మణ్, శంకర్, బన్సీలాల్, ఆరిఫ్, సత్యనారాయణ, మల్లేశం, చంద్రం, ప్రసన్నకుమార్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News