Monday, June 16, 2025

బోగస్ కార్డులపై నజర్

- Advertisement -
- Advertisement -

నకిలీ రేషన్‌కార్డుల ఏరివేతకు ప్రభుత్వం చర్యలు డీలర్ల వారీగా
అనర్హుల గుర్తింపు జిల్లాలవారీగా కొనసాగుతున్న విచారణ
ఇప్పటికే 6వేల కార్డులు అనర్హమైనవిగా తేల్చిన అధికారులు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో అ నుమానాస్పద రేషన్‌కార్డులపై తెలంగాణ ప్ర భుత్వం దృష్టి సారించింది. కార్డులు, లబ్ధిదారుల సంఖ్య మేరకు డీలర్లకు ప్రతి నెలా రేషన్ బియ్యం పంపిస్తున్నప్పటికీ చాలా మంది వాటిని తీసుకోవడం లేదు. దీంతో పౌర సరఫరాల శాఖ గడిచిన ఆరు నెలల నుంచి బి య్యం తీసుకోని వారి లెక్కలు తీయగా ఏకం గా 1,62,773 రేషన్ కార్డులు తేలాయి. చేపట్టిన విచారణలో 6 వేలకు పైగా రేషన్‌కార్డులు అనర్హమైనవిగా ఆ శాఖ అధికారులు గుర్తించా రు. తెలంగాణలో ప్రస్తుతం కొత్త రేషన్ కా ర్డులు మంజూరు అవుతున్నాయి. చాలా ఏళ్ల తర్వాత ప్రభుత్వం రేషన్‌కార్డులు మంజూరు చేస్తుండటంతో దీనిపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా కొత్త రేషన్ కా ర్డుల మంజూరు వేళ కేంద్రం ఊహించని షాక్ ఇచ్చింది. రేషన్ కార్డుల జారీ ప్రక్రియలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారని తెలిపింది.

నకిలీ ఆధార్ కార్డులు పెట్టి రేషన్ కార్డులు పొందుతున్నారని కొన్ని చోట్ల మైనర్లకు కూడా కార్డులు మంజూరు చేశారని వెల్లడించింది. అక్రమ రేషన్‌కార్డుల గుట్టు రట్టు చేయడమే కాక వీటి జారీపై అనుమానాస్పదంగా ఉన్న కార్డుల వివరాలను రాష్ట్రానికి పంపింది. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీలో అక్రమాలు చోటుచేసుకున్నాయని కేంద్ర ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేసింది. కామారెడ్డి జిల్లాలో ఇలాంటివి సుమారు 1700 నకిలీ కార్డులు ఉన్నట్లు గుర్తించారు. మైనర్ల పేరిట కార్డులు జారీ చేయడం, నకిలీ ఆధార్ కార్డులు సమర్పించడం వంటి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.

అధికారులు విచారణ చేపట్టి, కార్డుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. సన్నబియ్యం పంపిణీ ప్రారంభమైన తర్వాత చాలామంది రేషన్ తీసుకోవడం లేదని గుర్తించారు. అనుమానాస్పద రేషన్‌కార్డులు 5 వేల పైచిలుకు ఉన్న జిల్లాలు ప్రధానంగా నల్గొండ, నిజామాబాద్, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి ఈ జాబితాలో ఉన్నాయి. అనర్హమైనవిగా తేలిన 6 వేల కార్డుల్లోనూ అత్యధికంగా సూర్యాపేట, రంగారెడ్డి జిల్లాల్లోనే ఉన్నాయి.

మొదలైన అనర్హుల గుర్తింపు ప్రక్రియ

రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం బోగస్ కార్డులు, అనర్హులపై ఫోకస్ పెట్టింది. జిల్లా అధికారులు రేషన్ డీలర్ల వారీగా జాబితాలో అనర్హుల గుర్తింపు ప్రక్రియ మొదలెట్టారు. అలాంటి వారి పేర్లు తొలగించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇన్ని రోజులు దొడ్డు బియ్యం పంపిణీ చేస్తుండటంతో కొంతమంది లబ్ధిదారులు బియ్యం తీసుకెళ్లడానికి ఇష్టపడేవారు కాదు. ప్రతి పథకానికి రేషన్‌కార్డును ప్రామాణికంగా తీసుకుంటుండటంతో తమ పేరుపై కార్డు ఉంటే చాలని భావించారు. ఇప్పుడు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నా కొందరు తీసుకెళ్లడం లేదని ప్రభుత్వం గుర్తించింది.
గత ఆరు నెలలుగా రేషన్ బియ్యం తీసుకోని వారి జాబితా తయారు చేయాలని ఆదేశించడంతో జిల్లా రెవెన్యూ, పౌర సరఫరాల అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేపట్టారు.

పెళ్లి చేసుకొని వెళ్లిన వారు, మరణించిన వారు, స్థానికంగా లేని వారిని గుర్తించి, ఏరివేత చేపడుతున్నారు. ప్రస్తుతం మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలని ఆదేశించడంతో బియ్యం పక్కదారి పట్టుకూడదనే ఉద్దేశంతో రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ అధికారులు సంయుక్తంగా చర్యలు చేపట్టారు. క్షేత్రస్థాయిలో సర్వే చేస్తూ లబ్ధిదారులు రేషన్‌కార్డులో ఉన్న చిరునామాలో ఉంటున్నారా అందులో ఎవరైనా మృతి చెందారా? వలస వెళ్లారా? అంటూ ఆరా తీస్తున్నారు. మరి కొందరికి రెండు చోట్ల పేర్లు ఉండటంతో అలాంటి వారి పేర్లు ఒకచోట తొలగిస్తున్నారు. వాటిని పరిగణనలోకి తీసుకుని మూడు మాసాలకు సరిపడా కోటాను విడుదల చేస్తున్నారు.

క్షేత్రస్థాయిలో విచారణ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అనేక పథకాలకు రేషన్ కార్డు ప్రామాణికం కావడంతో భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. అదే సమయంలో ఇప్పటికే ఉన్న లబ్ధిదారుల్లో అనేక మంది అనర్హులున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మే నెల మొదటివారం నాటికి 90.71 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో లబ్ధిదారుల సంఖ్య 2.93 కోట్లుగా ఉంది. వీరి కోసం ప్రతి నెలా 1.90 లక్షల టన్నుల సన్న బియ్యాన్ని ప్రభుత్వం డీలర్లకు పంపిస్తోంది.

ఉచితంగా సన్నబియ్యం పంపిణీ మొదలయ్యాక వాటిని తీసుకోవడానికి ప్రజలు బారులు తీరుతున్నా, లక్ష 60 వేల మంది మాత్రం ముందుకు రావడం లేదు. దీంతో పౌర సరఫరాల శాఖ వారి జాబితా తీసి ఆయా మండలాల్లో తహసీల్దార్లతో క్షేత్రస్థాయిలో పూర్తి విచారణ చేయిస్తోంది. లబ్ధిదారులు చిరునామాలో ఉంటున్నారా? లేదా మరణించారా? అనే వివరాలను తెలుసుకుంటున్నారు. మరోవైపు వందేళ్ల వయసు పైబడి చనిపోయిన వారు రేషన్ లబ్ధిదారుల జాబితాలో భారీ సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. మరికొందరి పేర్లు రెండేసి కార్డుల్లో ఉన్నట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో తేలిన వివరాలను పౌర సరఫరాల శాఖ ప్రధాన కార్యాలయానికి అధికారులు పంపిస్తున్నారు.

సూర్యాపేటలో 100 శాతం విచారణ

రేషన్‌కార్డుల విచారణలో భాగంగా సూర్యాపేట జిల్లా మొదటి స్థానంలో ఉంది. కామారెడ్డిలో 83.33 శాతం, సిరిసిల్లలో 68.06 శాతం, కరీంనగర్లో 63.49 శాతం పూర్తయ్యింది. 12 జిల్లాల్లో మాత్రం ఇంకా ఈ ప్రక్రియ మొదలే కాలేదు. వరంగల్, హనుమకొండ, ఆదిలాబాద్, భూపాలపల్లి, గద్వాల, మహబూబాబాద్, నల్గొండ, నిర్మల్, పెద్దపల్లి, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి ఈ జాబితాలో ఉన్నాయి. అలాగే ఇప్పటివరకు కామారెడ్డిలో 726, సిద్దిపేట 519, ఖమ్మం 371, సిరిసిల్లలో 360, కరీంనగర్ 330, యాదాద్రి 176, మెదక్లో 106 రేషన్ కార్డులు అనర్హమైనవిగా తేలాయి. రాష్ట్రవ్యాప్తంగా విచారణ పూర్తయిన తర్వాత అనర్హుల కార్డులను తొలగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. క్షేత్రస్థాయి పరిశీలనలో రేషన్ కార్డుల్లో అనర్హులు భారీగానే ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటివరకు 11.13 శాతం కార్డులపై విచారణను పూర్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News