టెహ్రాన్: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం జరుగుతుండటంతో ఇరాన్ లో ఉన్న భారతీయ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలను షేర్ చేస్తున్నారు. దీంతో స్పందించిన భారత విదేశాంగ శాఖ.. ఇరాన్ నగరాల్లో చిక్కుకున్న తమ విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం దాదాపు 10,000 మంది భారతీయులు ఇరాన్లో ఉన్నారు. ఇరాన్ లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న క్రమంలో తమ పౌరులను సురక్షితంగా తరలించాలని భారత్ చేసిన విజ్ఞప్తికి టెహ్రాన్ సోమవారం స్పందించింది. భారత దౌత్యవేత్తలు, పౌరులను సురక్షితంగా తరలించడంలో పూర్తి సహకారాన్ని అందిస్తామని టెహ్రాన్ తెలిపింది. ఇజ్రాయెల్ తో కొనసాగుతున్న ఘర్షణ కారణంగా ఇరాన్ వైమానిక ప్రాంతం మూసివేయబడినప్పటికీ భారత్ అభ్యర్థనను దృష్టిలో ఉంచుకుని.. విదేశీ విద్యార్థులు, పౌరులను తరలించేందుకు అజర్బైజాన్, తుర్క్మెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లతో ఉన్న అన్ని భూ సరిహద్దులు ప్రస్తుతం తెరిచి ఉంచామని, భారతీయ పౌరులను సురక్షితంగా తరలించవచ్చని టెహ్రాన్ తెలిపింది.
ఇరాన్లోని కొంతమంది భారతీయ విద్యార్థులను దేశంలోని సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. “టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం విద్యార్థుల భద్రతా పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తోంది. రాయబార కార్యాలయం సహకారంతో విద్యార్థులను ఇరాన్లోని సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. ఇతర సాధ్యమయ్యే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారు” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.