మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః కాంగ్రెస్ కోసం నిరంతరం కష్టపడుతున్న వారికి తప్పని సరిగా పట్టం కడతామని, అయితే వివిధ కారణాలతో మన పార్టీలో చేరే కొత్త నాయకులకు తక్కువ మోతాదులో పదవులు ఇస్తామని ఏఐసిసి నాయకురాలు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్ భరోసా ఇచ్చారు. మంగళవారం గాంధీ భవన్లో మీనాక్షి నటరాజన్ సమక్షంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ (పిఏసి) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. స్థానిక సంస్థలకు జరగబోయే ఎన్నికలకు వ్యూహారచన, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడం, నామినేటెడ్ పదవులు తదితర అంశాలపై సుదీర్ఘంగా ఈ సమావేశంలో చర్చించారు.
అయితే కొంత మంది నాయకులు తమ ప్రసంగాల్లో పార్టీ కోసం నిరంతరం కష్టపడిన వారికి కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన కొత్త వారికి గుర్తింపునిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పార్టీకి నష్టం వాటల్లుతున్నదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కొంత మంది నాయకులు తమకు గుర్తింపు రావడం లేదని, ఇతర పార్టీల్లోకి వెళ్లారని, మరి కొంత మంది రాజకీయాలకు దూరమయ్యారని ఆరోపించారు. ఇతర పార్టీల నుంచి మన పార్టీలోకి వచ్చే వారికి స్వాగతిస్తామని, అయితే వెంటనే వారిని అందలం ఎక్కించకుండా, కొన్ని సంవత్సరాలైనా పార్టీ పటిష్టత కోసం కష్టపడేలా చేయాలని వారు అభిప్రాయపడ్డారు. అందుకు మీనాక్షి నటరాజన్ స్పందిస్తూ మీ ఆవేదనను అర్థం చేసుకున్నానని చెప్పారు.
ఇప్పటి వరకు ఏమి జరిగిందో మరచి పోవాలని, ఇప్పటి నుంచి తాను అలా పొరపాటు జరగకుండా చూస్తానని అభయం ఇచ్చారు. పార్టీ పటిష్టత కోసం పని చేసే వారికి తప్పకుండా న్యాయం జరుగుతుందని అన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకులకు ఇరవై శాతం పదవులు ఇచ్చి గుర్తింపునిద్దామని ఆమె హామీ ఇవ్వడంతో అందరూ కరతాళధ్వనులు చేశారని తెలిసింది. కాంగ్రెస్పై నమ్మకంతో ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని తగు విధంగా గౌరవించుకుందామని ఆమె తెలిపారు. మీకు ఏ సమస్య ఉన్నా తనను సంప్రదించాలని ఆమె పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. పార్టీ కార్యాలయమైన గాంధీ భవన్లో ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం వల్ల మంచి ఫలితం వస్తున్నదని పలువురు నాయకులు తెలిపారు.