Thursday, June 26, 2025

మత్తు.. పొంచి ఉన్న మహావిపత్తు

- Advertisement -
- Advertisement -

ఈ ప్రపంచంలో మత్తుకు మించిన మహా విపత్తు మరేది ఉండదు.. ప్రమాదవశాత్తు జరిగే ప్రమాదాల వల్ల నష్టం అనుకోకుండా జరుగుతుంది. ప్రమాదం సంభవించిన సమయంలో గాయాలపాలవడమో..అకస్మాత్తుగా మృత్యువాత పడేలా చేయడమో చేస్తుంది. కానీ మత్తు అనే మహమ్మారి మానవ శరీరాన్ని అచేతనంగా మార్చేస్తుంది. ఒక్కసారి అలవాటైతే విపత్తుకు మించిన వినాశనం వైపు నడిపిస్తోంది. మానసికంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా మనిషిని మరింత కుంగదీస్తుంది. కర్రకు పట్టిన చెద పురుగులా నిలువెత్తు మానవ మెదడును కరగదీస్తుంది. భూకంపానికి మించిన అలజడులను సృష్టిస్తుంది. ఫలితంగా మనిషి తనకు తెలియకుండానే రోగిగా మారడంతో పాటు కుటుంబం అంతా తీవ్రమైన అంధకారంలోకి వెళ్లే పరిస్థితి దాపురిస్తుంది. అటువంటి మత్తును నివారించడానికి ప్రతీ ఏటా జూన్ 26న అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం నిర్వహిస్తారు. ప్రజలు మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారంటే ఆ సమాజం తిరోగమనంలో పయనిస్తోందని అర్థం.

అలాంటి చోట సామాజిక, మానసిక, శారీరక అనారోగ్యాలు తలెత్తుతాయి. అందుకే దేశభవిష్యత్తును కుంగదీసే మాదకద్రవ్యాలను పకడ్బందీగా (Drugs strictly controlled) అరికట్టాలి. యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడటం సమాజానికి చాలా నష్టం కలిగిస్తుంది. మాదకద్రవ్యాల వినియోగం రోజురోజుకు అధికమవుతున్నాయి. దేశవ్యాప్తంగా నిత్యం ఏదో ఒక చోట పెద్దయెత్తున మత్తుపదార్థాలు పట్టుబడటం పరిపాటిగా మారింది. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. ఒకప్పుడు పట్టణాలు, నగరాలకే పరిమితమైన మత్తుపదార్థాల జాడ్యం ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు సైతం పాకింది. మత్తు పదార్థాలు రకరకాల రూపంలో కళాశాలలు, పాఠశాలల విద్యార్థులకు చేరుతున్నాయి. ధూమపానం, మద్యపానంతో సరదాగా మొదలయ్యే అలవాటు క్రమంగా మాదకద్రవ్యాల దాకా విస్తరిస్తోంది.

మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టంపై ప్రజల్లో అవగాహన పెంచాలని 1987లో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ తీర్మానించింది. ఈ క్రమంలో ఏటా జూన్ 26ను మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం ఒక నినాదంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మత్తు పదార్థాలకు అలవాటు పడినవారి జాతీయ చికిత్సా కేంద్రం అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ఆధ్వర్యంలో పని చేస్తోంది. అది దేశీయంగా ఒక సర్వే నిర్వహించింది. దాని ప్రకారం భారత్‌లో 10 నుంచి 75 ఏళ్ల వయసు వారిలో కోట్ల మందికి పైగా గంజాయిని వివిధ రూపాల్లో వినియోగిస్తున్నారు. మాదకద్రవ్య నిరోధక సంస్థ (ఎన్‌సిబి) లెక్కల ప్రకారం ఇండియాలో దాదాపు పది కోట్ల మందికి పైగా మాదకద్రవ్యాలకు అలవాటుపడ్డారు. లక్షల మంది ముక్కు ద్వారా పీల్చే రసాయనాలు వాడుతున్నారు.

సిరంజీల ద్వారా మత్తు పదార్థాలు తీసుకునేవాళ్లు గతంలో ఈశాన్య రాష్ట్రాల్లోనే అధికంగా ఉండగా, ప్రస్తుతం ఆ జాడ్యం దేశంలోని అన్ని ప్రాంతాలకు, గ్రామీణానికి వ్యాపిస్తోంది. దేశీయంగా ప్రభుత్వాలు మద్యాన్ని ఆదాయ మార్గంగా చూస్తుండటంతో దాని వినియోగం అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతోంది. మద్యానికి బానిసలై ఎంతోమంది తీవ్ర అనారోగ్యాల బారినపడుతున్నారు. మద్యం, డ్రగ్స్ మత్తులో తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్నారు. దాదాపు 30 శాతానికి పైగా ప్రజలు మత్తు పదార్థాలు లేనిదే తమ దైనందిన చర్యలు చేయలేకపోతున్నారని పలు పరిశీలనలు చెబుతున్నాయి. దీన్నే మత్తు పదార్థానికి బానిసగా మారడం అంటారు. వెంటనే వీరికి చికిత్స అవసరం.

ఒక సర్వే ప్రకారం దేశీయంగా ప్రతీ ఆరుగురిలో ఒకరు మద్యానికి బానిస అవుతున్నారు. ప్రస్తుతం పాన్ షాపులు, కిరాణా దుకాణాల్లోనూ మాదకద్రవ్యాలు యథేచ్ఛగా అమ్మే దుస్థితి నెలకొంది. గంజాయి మెదడు పై తీవ్ర ప్రభావం చూపి శ్రద్ధ ఏకాగ్రత జ్ఞాపకశక్తిని దెబ్బతీస్తుంది. చురుకుదనం సన్నగిల్లుతుంది. గంజాయి సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవిస్తాయి. కార్మికులు పని చేస్తున్న చోట ప్రమాదాల బారినపడవచ్చు. గంజాయి, మత్తు పదార్థాలను సేవించిన తరవాత వ్యక్తుల ప్రవర్తన వింతగా ఉంటుంది. తమను తాము గాయపరచుకోవడంతోపాటు ఇతరులపై దాడులు, హత్యలు, దొంగతనాల వంటి నేరాలకు ఒడిగట్టే ప్రమాదం ఉంది. మత్తుపదార్థాల మహా విధ్వంసాన్ని నిరోధించాలంటే ప్రభుత్వాలు పటిష్ట చర్యలు తీసుకోవాలి. వాటి రవాణాను సమర్థంగా నిరోధించాలి. తయారీదారులు, రవాణా చేస్తున్న వారికి కఠిన శిక్షలు పడేలా చట్టాలను పదునుతేల్చాలి. ధూమపానం, మద్యపానం, మాదకద్రవ్యాల వల్ల తలెత్తే నష్టాలపై సామాజిక, ప్రసార మాధ్యమాలు, పత్రికల్లో విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.

ప్రసార మాధ్యమాలు, ఒటిటిలు వంటి వాటిలో ఆల్కహాల్, గుట్కా, సిగరెట్, జర్దా తదితరాలకు సంబంధించిన ప్రకటనలను పూర్తిగా నిషేధించాలి. మత్తుపదార్థాలకు బానిసలైన వారిని మానసిక వైద్యుల వద్దకు తీసుకెళ్లాలి. నిపుణులైన వైద్యులు సరైన చికిత్స అందిస్తే ఆ విపత్తు నుంచి బయటపడే అవకాశం ఉంది. మత్తును అరికట్టడానికి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కంకణబద్ధం కావాలి.యుక్త వయసు పిల్లల్లో విపరీతమైన ఉత్సాహం ఉంటుంది. పలు రకాల సాహసాలు చేయాలని వారి మనసు ఆరాటపడుతుంటుంది. అది వారిని మత్తు పదార్థాల వైపు నడిపించే ప్రమాదం ఉంది. మొదట సరదాగా, సాహసంగా ప్రారంభమై, ఆ తరవాత అది వ్యసనంలా మారుతుంది. చివరకు జీవితాన్ని నాశనం చేస్తుంది. మాదకద్రవ్యాల వల్ల హుషారుగా, ఉత్తేజంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అది కొద్దిసేపే ఉంటుంది.

మళ్ళీ మళ్ళీ మత్తు పదార్థాలు తీసుకోవాలని అనిపిస్తు. ఇలా క్రమంగా ఒక వ్యక్తి వాటికి బానిస అయిపోతాడు. దానివల్ల ఆరోగ్య, ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. కుటుంబాలు అల్లకల్లోలమవుతాయి. మానసిక సమస్యలు, నిరాశ, ఆందోళన, చిన్నతనంలో ఎదురైన చేదు అనుభవాలు, చెడు స్నేహాలు, ఇంట్లో తల్లిదండ్రుల మధ్య గొడవలు, వారి విడాకులు తదితర అంశాలు యువత, పిల్లలు మత్తుపదార్థాలకు బానిసలు కావడానికి కారణం కావచ్చు. అందువల్ల తల్లిదండ్రులు, ఇంట్లో పెద్దలు, పిల్లలను నిత్యం గమనిస్తూ ఉండాలి. మత్తు అనే మహా విపత్తును పూర్తిగా నిర్మూలించడానికి ప్రభుత్వం సైతం పకడ్బందీగా చర్యలు చేపట్టాలి. అలాగే నిత్యం పాఠశాల స్థాయి నుంచే అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.

  • సంపత్ గడ్డం
    78933 03516
  • ( నేడు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం)
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News