అమరావతి: ప్రయాణికుడిపై మహిళా కండక్టర్ దాడి చేసిన సంఘటన కృష్ణా జిల్లా తొట్లవల్లూరు మండలంలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా గ్రూపుల్లో వైరల్గా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఉయ్యూరు వెళ్తున్న బస్సును అంబేడ్కర్ బొమ్మ సెంటర్ వద్ద మల్లిఖార్జునరావు అనే వ్యక్తి ఎక్కాడు. టికెట్ కోసం మహిళా కండక్టర్ 200 రూపాయలు ఇచ్చాడు. తన దగ్గర చిల్లర లేదని మల్లిఖార్జునతో గొడవకు దిగింది. ఇద్దరు మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరడంతో మహిళా కండక్టర్ రెచ్చిపోయింది.
ప్రయాణికుడు బస్సులో నుంచి కిందకు దించి గల్లా పట్టుకొని దుర్భాషలాడింది. అక్కడ ఉన్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. గతంలో సదరు మహిళా కండక్టర్ ప్రయాణికులతో గొడవలు చేసేదని ప్రయాణికులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు కాలేదని పోలీసులు వెల్లడించారు. ఉయ్యూరు ఆర్టిసి డిఎం పెద్దిరాజును మీడియా వివరణ కోరగా ఈ ఘటనను పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వివరణ ఇచ్చారు. ప్రయాణికుడిపై దాడి చేయడం తప్పని ఖండించారు.