హైదరాబాద్: ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు బౌలింగ్ బలహీనత బయటపడింది. తొలి టెస్టులో బుమ్రా ఐదు వికెట్లు తీసి పర్వాలేదనిపించాడు. రెండో ఇన్నింగ్స్లో బుమ్రా వికెట్లు తీయకపోవడం గమనార్హం. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ తొలి టెస్టులో ఎక్కువ పరుగులు ఇవ్వడంతో భారత్కు నష్టం చేసింది. బుమ్రాకు మిగితా బౌలర్ల నుంచి మద్దతు దొరికితేనే టీమిండియా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ మ్యాచ్లో ఎక్కువగా క్యాచ్లు వదిలియడంతో ఓటమికి ఒక కారణం చెప్పవచ్చు. ఈ సందర్భంగా టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ స్పందించారు. టీమిండియా బౌలర్లు బౌలింగ్పై మరింత వర్కౌట్ చేయాలని సూచించారు.
ప్రసిద్ధ కృష్ణ, శార్థూల్ ఠాకూర్ రెండో ఇన్నింగ్స్లో చెరో రెండు వికెట్లు తీసినప్పటికి అప్పటికే మ్యాచ్ మన చేతుల్లో నుంచి ఇంగ్లాండ్ చేతుల్లోకి వెళ్లిపోయిందని చురకలంటించారు. కొత్త బంతితో వికెట్లు తీయడంతో బుమ్రాకు మద్దతు ఇవ్వాలని సూచించారు. జస్ప్రీత్ బుమ్రాతో మిగితా బౌలర్లు మాట్లాడి అతడి నుంచి నేర్చుకోవాలని సలహాలు ఇచ్చారు. బౌలింగ్ ఎలా చేయాలనేది ప్లాన్ వేసుకోవడంతో పాటు అమలు చేయాలనేది ముఖ్యమన్నారు. భారత బౌలింగ్ను మరింత బలంగా తయారు చేయడానికి బిసిసిఐ వివిధ మార్గాలను వెతుక్కోవాలని షమీ తెలిపారు. బుమ్రా పని భారం పడడంతో రెండో టెస్టుకు విశ్రాంతి ఇచ్చి మూడో టెస్టులో ఆడించాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తున్నట్టు సమాచారం.