న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో అన్నమలైకి బాధ్యతలు అప్పగిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. తమిళనాడు బిజెపి నాయకుడు కె. అన్నామలై రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారని, అదే సమయంలో ఆయనకు జాతీయ స్థాయిలో బాధ్యతలు అప్పగిస్తామని అన్నారు. అన్నామలై నాయకత్వంపై అమిత్ షా ప్రశంసలు కురిపించారు. తమిళనాడులో బిజెపి పార్టీని విస్తరించడంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విధానాలను అట్టడుగు స్థాయి వర్గాల ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో ఆయన చేసిన కృషి చేశారని మెచ్చుకున్నారు. అన్నామలై సంస్థాగత నైపుణ్యాలను పార్టీ జాతీయ స్థాయిలో ఉపయోగించుకుంటుందని పేర్కొన్నారు. తమిళనాడు బిజెపి అధ్యక్షుడిగా అన్నామలై ప్రశంసనీయమైన విజయాలు సాధించారని.. జాతీయ స్థాయిలో అన్నామలై నైపుణ్యాలను బిజెపి ఉపయోగించుకుంటుందని ఆయన చెప్పారు.
కాగా, 2026లో తమిళనాడు రాష్ట్రంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్డియే) కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని ఇటీవల అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల తర్వాత బిజెపి, ఎఐఎడిఎంకెలతో కూడిన ఎన్డియే కూటమి ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.