రాయదుర్గంలో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్,
మీడియేషన్ సెంటర్ (ఐఎఎంసి)కు 3.5
ఎకరాలు కేటాయించిన బిఆర్ఎస్ ప్రభుత్వం
ప్రైవేట్ సంస్థకు భూకేటాయింపు చెల్లదని
హైకోర్టులో పిటిషన్ పిటిషనర్లతో
ఏకీభవించిన ఉన్నత న్యాయస్థానం
సంస్థ కార్యాలయం కోసం తాత్కాలికంగా
భవనాన్ని కేటాయిస్తూ జారీ చేసిన జిఒను
కొట్టివేసిన హైకోర్టు
మన తెలంగాణ/హైదరాబాద్ : అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్ కు (ఐఎఎంసి) గతబిఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన భూములను రద్దు చేస్తూ హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పు చెప్పింది. గత ప్రభుత్వ హయాంలో రాయదుర్గంలో అప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్ ఐఎఎంసి కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా సదరు సంస్థలకు శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో ని సర్వే నెంబర్ 83/1 లో 3.5 ఎకరాలకు పైగా భూమిని కేటాయిస్తున్న ట్టు ప్రకటించారు. ఆ తర్వాత దీనికి సంబంధించిన జిఓను జారీ చేసింది. అయితే ఒక ప్రైవేట్ సంస్థ అయిన ఐఎఎంసికి నిబంధనలకు విరుద్దంగా భూ కేటాయింపు చేశారని న్యాయవాదులు కె. రఘునాథ్ రావు, వెంకటరామ్ రెడ్డి ఆ జిఓను సవాల్ చేస్తూ వేర్వేరుగా రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలుహైకోర్టులో దాఖలు చేసారు. ఈ వ్యాజ్యాలను జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ కె. సుజనలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. ఈ పిటిషన్ల విచారణ సందర్భంగా న్యాయవాది రఘునాథ్ రావు తన వాదనలు వినిపిస్తూ, నిబంధనలకు విరుద్దంగా ప్రైవేటు సంస్థలకు భూ కేటాయింపు చేశారని కోర్టుకు తెలిపారు.
ఐటి కారిడార్లో రూ. 350 కోట్ల విలువ చేసే భూమిని సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్దంగా కేటాయించారని వాదించారు. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ తన వాదనలు వినిపిస్తూ అంతర్జాతీయ న్యాయ సంస్థల మధ్య వివాదాల పరష్కారానికి ఐఎఎంసి దోహదపడుతుందని తెలిపారు. వివాదాలు కేవలం న్యాయస్థానాల్లోనే కాకుండా బయట సైతం పరిష్కరించుకోవచ్చని న్యాయస్థానాలు చెపుతున్నాయని, ఐఎఎంసి వల్ల వివాదాలు పరిష్కారమయితే కోర్టులపై కూడా భారం తగ్గుతుందని చెప్పారు. ఈ వ్యాజ్యం పై జనవరిలో ఇరువైపులా వాదనలు ముగియడంతో హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఈ నేపథ్యంలో పిటిషనర్ల వాదనతో ఏకీభవించిన ధర్మాసనం ఐఎఎంసికి కేటాయిస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేస్తూ సంచలన తీర్పు చెప్పింది. అలాగే ఆ సంస్థకు ప్రభుత్వం తాత్కాలికంగా భవనాన్ని కేటాయిస్తూ జారీ చేసిన జీవోను కూడా హైకోర్టు రద్దు చేయడం గమనార్హం.