కొలంబో: బంగ్లాదేశ్ క్రికెటర్ నజ్ముల్ హొస్సేన్ శాంటో (Najmul Hossain Shanto) కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే వన్డే, టి-20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న అతను తాజాగా టెస్ట్ కెప్టెన్సీ నుంచి కూడా వైదొలిగాడు. శ్రీలంకతో కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్లో బంగ్లాదేశ్ ఓటమి తర్వాత శాంటో ఈ నిర్ణయం తీసుకున్నాడు. బంగ్లా క్రికెట్ బోర్డుతో విబేధాల కారణంగా అతను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టి-20 కెప్టెన్సీ నుంచి తానే తప్పుకున్న శాంటో, వన్డే కెప్టెన్గా కొనసాగాలని భావించాడు. కానీ, బంగ్లా బోర్డు అతనికి షాక్ ఇచ్చింది. వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించింది. అతన స్థానంలో ఆల్ రౌండర్ మెహదీ హసన్ని కెప్టెన్గా నియమించింది.
అయితే టెస్ట్ కెప్టెన్సీని జట్టు శ్రేయస్సు కోసమే పదిలేశానని అని శాంటో (Najmul Hossain Shanto) తెలిపాడు. ‘‘కొన్ని సంవత్సరాలుగా బంగ్లాదేశ్ క్రికెట్ డ్రెస్సింగ్ రూంలో భాగంగా ఉన్నాను. ముగ్గురు కెప్టెన్లు ఉండటం సరికాదు. కానీ, బోర్డు ఏం ఆలోచిస్తుందో నాకు తెలియదు. ఏదేమైనప్పటికీ.. వారి నిర్ణయానికే నేను మద్దతు ఇస్తాను’’ అని మ్యాచ్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో శాంటో అన్నాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ టి-20 కెప్టెన్గా లిట్టన్ దాస్, వన్డే కెప్టెన్గా మెహదీ హసన్ ఉన్నారు. ఇప్పుడు శాంటో తప్పుకోవడంతో అతని స్థానంలో టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనే విషయలో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.