పోలీస్ వారి హెచ్చరిక (Police vaari Heccharika) సినిమాలోని సామాజిక చైతన్య గీతాన్ని ఎర్ర అక్షరాల రచయిత, తెలుగు రచయితల సంఘం అధ్యక్షుడు పరుచూరి గోపాల కృష్ణ ఆవిష్కరించారు. అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వం లో రూపొందిన ఈ చిత్రాన్ని తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్థన్ నిర్మించారు. ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ “చాలా రోజుల తరువాత వెండితెర పైన మళ్ళీ ఇటువంటి అభ్యుదయ గీతాన్ని చూస్తున్నాను. ఈ పాటలో ఉన్న గమ్మత్తు వైవిధ్యం ఏమిటంటే ఇది ఏ పార్టీనో ఏ సిద్ధాంతాన్నో ప్రచారం చేసే పాట కాదు.
ఈ సినిమా కథ ప్రస్తావిస్తున్న ఒకానొక ఘోరాన్ని నిగ్గదీసి ప్రశ్నించే పాట”అని అన్నారు. చిత్ర దర్శకుడు బాబ్జీ మాట్లాడుతూ… తెలుగు సినీ పరిశ్రమలో భుజం మీద ఎర్ర శాలువాను కప్పుకొని తిరుగుతున్న అభ్యుదయ అక్షరం పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopalakrishna) చేతుల మీదుగా ఈ ప్రశ్నించే పాట ఆవిష్కరించ బడడం తమ యూనిట్ మొత్తానికి సంతోషాన్ని కలిగించిందని పేర్కొన్నారు. చిత్ర నిర్మాత బెల్లి జనార్థన్ మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే పక్కా కమర్షియల్ సినిమాగా తాము ఈ చిత్రాన్ని రూపొందించామని తెలియజేశారు.