Friday, August 1, 2025

అంతరిక్ష రంగంలో అప్రతిహతంగా భారత్

- Advertisement -
- Advertisement -

అంతరిక్ష రంగంలో అప్రతిహతంగా భారత్ దూసుకెళుతోంది. గత రెండు దశాబ్దాలుగా ఈ రంగంలో భారత్ అద్భుత విజయాలతో ప్రపంచ దేశాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇస్రో శాస్త్రవేత్తలు తక్కువ ఖర్చుతో చంద్రయాన్ సిరీస్ ప్రయోగాలు విజయవంతం చేసి అంతరిక్ష చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. భారతదేశం, అమెరికా సంయుక్తంగా నిసార్ అనే ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ ఉపగ్రహం భూమిపై సంభవించే ప్రకృతి వైపరీత్యాలను మరింత ఖచ్చితంగా అంచనా వేయడంలో సహాయపడుతుంది. అలాగే భూమిపై నిఘా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రయోగాన్ని బుధవారం శ్రీహరికోట నుండి చేపట్టనున్నారు. ఈ మిషన్ ద్వారా రెండు దేశాల మధ్య అంతరిక్ష సహకారం మరింత పెరుగుతుంది. విపత్తు నిర్వహణ, వ్యవసాయ రంగాలలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటాయని భావిస్తున్నారు.

ఇటీవల యాక్సియం-4 మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన ఇస్రో- నాసా ఇప్పుడు మరో బృహత్తర ప్రయోగానికి సిద్ధమయ్యాయి. భూమిపైన సంభవించే ప్రకృతి వైఫరీత్యాలను మరింత కచ్చితంగా అంచనా వేసేందుకు, భూమిపై పక్కా నిఘాను ఉంచే నిసార్ ఉపగ్రహ ప్రయోగాన్ని చేపట్టేందుకు సిద్ధం అయ్యాయి. ఈ ప్రయోగాన్ని శ్రీహరికోట నుంచే ప్రయోగించనున్నారు. ఈ ప్రయోగంతో భారత్- అమెరికా అంతరిక్ష సహకారం మరింత పెరగడమే కాకుండా విపత్తుల నిర్వహణ, వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. నిసార్ అంటే నాసా ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్ అని అర్థం. ప్రస్తుతం భూమిపై జరుగుతున్న మార్పులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి నాసా -ఇస్రోలు ఈ నిసార్ ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధం అవుతున్నాయి.

ఈ చారిత్రాత్మక మిషన్.. భూఉపరితలం, మంచు పర్వతాలపై జరుగుతున్న చిన్నచిన్న మార్పులను గతంలో ఎన్నడూ లేనివిధంగా పూర్తి వివరాలతో నమోదు చేయనుంది. వ్యవసాయం, ప్రకృతి వైపరీత్యాల పర్యవేక్షణ, సముద్రపు మంచు, హిమానీనదాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి హై రిజల్యూషన్ ఫోటోలను షేర్ చేస్తుంది. అంతరిక్ష పరిశోధనల్లో శక్తిమంతమైనవిగా పేరున్న రెండు దేశాలు కలిసి ప్రయోగం చేపడితే అదే నిసార్. భారత్, అమెరికా కలిసి చేపట్టిన నిసార్ ఉపగ్రహం ప్రయోగం గురించి ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అత్యాధునిక టెక్నాలజీ వినియోగిస్తున్న ఈ శాటిలైట్ ప్రయోజనాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ప్రకృతి విపత్తుల నిర్వహణ, భూవాతావరణంలో మార్పుల అధ్యయనం, సముద్రాల అధ్యయనంలో ఊహించని మార్పులు చోటుచేసుకోనున్నాయి. రక్షణ వ్యవహారాల్లోనూ ఈ ఉపగ్రహం కీలకం కానుంది. అలాగని ఈ ప్రాజెక్టు లాంచ్ ప్యాడ్ పైకి ఎక్కడం అంత తేలికేం కాలేదు. దీని వెనుక నాసా, ఇస్రో శాస్త్రవేత్తల పదేళ్ల కృషి ఉంది. సుమారు రూ. 12,500 కోట్ల ఖర్చుతో ఈ మిషన్‌ను చేపట్టారు.

ఈ ఉపగ్రహాన్ని జులై 30న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జిఎస్‌ఎల్‌వి ఎఫ్-16 రాకెట్ ద్వారా సాయంత్రం 5. 40 గంటలకు ప్రయోగించేందుకు ముహూర్తం నిర్ణయించారు. ఈ రాకెట్ నిసార్ ఉపగ్రహాన్ని భూమికి 743 కి.మీ ఎత్తులో, 98.40 డిగ్రీల కోణంలో భూకక్ష్యలో ప్రవేశపెడుతుంది. నిసార్ శాటిలైట్‌లో ఎస్‌ఎఆర్ అనే కొత్త టెక్నాలజీని వాడుతున్నారు. ఇందులో రెండు రకాల రాడార్లు ఉన్నాయి. ఇవి దట్టమైన అడవుల్లో కూడా సమాచారాన్ని సేకరించగలవు. భూపొరల్లో కదలికలు, భూమిపై తేమశాతాన్ని కూడా కచ్చితంగా అంచనా వేయగలుగుతుందంటే నిసార్ శాటిలైట్ ఎంత కీలకమైనదో అర్థం చేసుకోవచ్చు. భూమిని పరిశీలించే వాటిలో ఇప్పటివరకు ఈ ప్రయోగం చాలా ఖరీదైనది. 2,392 కిలోల బరువు ఉన్న నిసార్ ఒక ప్రత్యేకమైన భూ పరిశీలన శాటిలైట్.ఇందులో నాసా ఎల్ బ్యాండ్, ఇస్రో ఎస్ -బ్యాండ్ ఉన్నాయి. డ్యూయల్ -ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపర్చర్ రాడార్‌తో భూమిని పరిశీలించే మొట్టమొదటి ఉపగ్రహం ఇదే. ఈ నిసార్ శాటిలైట్ భూగోళ మొత్తాన్ని స్కాన్ చేయనుంది. 12 రోజుల వ్యవధిలోనే పగలు, రాత్రి డేటాతో పాటు వాతావరణ సమాచారాన్ని కూడా అందించనుంది.

నిసార్‌లోని రాడార్లు రోజుకు సుమారు 80 టి బి (టెరాబైట్లు) డేటాను ఉత్పత్తి చేస్తాయి. అంటే సుమారు 150.. 512 జిబి హార్డ్ డ్రైవ్‌లను నింపేంత డేటాను అందిస్తుంది. నిసార్ అందించే డేటాను ఎప్పటికప్పుడు ప్రాసెస్ చేసి స్టోర్ చేసి, క్లౌడ్ ద్వారా అందరికీ అందుబాటులో ఉండేలా చేయనున్నారు. నాసా ఇస్రోల మధ్య మొదటి ఉమ్మడి ఉపగ్రహ మిషన్‌గా ఈ నిసార్ నిలవనుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వాషింగ్టన్‌లో భేటీ అయిన నరేంద్ర మోడీ -డొనాల్డ్ ట్రంప్‌లు ఈ మిషన్‌ను భారత్ -అమెరికా పౌర అంతరిక్ష సహకారానికి కీలకమైన సంవత్సరంగా అభివర్ణించారు. నిసార్‌లో భారత్, అమెరికా సమాన భాగస్వామ్యం ఉంది. ఈ ప్రయోగానికి కావాల్సిన రాడార్ సిస్టమ్‌లు, కమ్యూనికేషన్ టెక్నాలజీ, సైంటిఫిక్ డివైజ్‌లను నాసా అందించింది. స్పేస్ క్రాఫ్ట్, లాంచింగ్ వెహికల్, ఆపరేషనల్ సపోర్ట్‌ను ఇస్రో అందిస్తోంది. నాసా తరఫున జెపిఎల్ సంస్థ ఈ ప్రాజెక్ట్‌కు పనిచేస్తుండగా బెంగళూరులోని యుఆర్ రావు ఉపగ్రహ కేంద్రం, అహ్మదాబాద్‌లోని ఇస్రో స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ ఇస్రో వైపు పనిచేస్తున్నాయి. ఈ నిసార్ ప్రయోగంతో అంతరిక్ష రంగంలో భారత్, అమెరికా మధ్య పెరుగుతున్న సహకారంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించనుంది. చంద్రయాన్-1, ఇటీవల యాక్సియమ్ మిషన్ 4 వంటి సక్సెస్‌ఫుల్ మిషన్ల తర్వాత.. నిసార్ కూడా ఈ జాబితాలో చేరుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇస్కా రాజేష్ బాబు
93973 99298

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News