Wednesday, April 24, 2024

2050లో కూడా బిజెపికి ఛాన్స్‌లేదు: కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీలో బుధవారం జరిగిన విశ్వాస పరీక్షలో అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వపు ఆప్ ప్రభుత్వం నెగ్గింది. అసెంబ్లీలో తమ బలం చాటుకోవడానికి కేజ్రీవాల్ ఈ బలపరీక్ష తీర్మానానికి దిగారు. ఈ విశ్వాస పరీక్షలో నెగ్గిన తరువాత అసెంబ్లీలో కేజ్రీవాల్ మాట్లాడుతూ పాపం బిజెపి తమ ప్రభుత్వంపై అవిశ్వాస ఓటును తీసుకురావాలని చూసిందని, అయితే ఇందుకు సరైన రీతిలో ఎమ్మెల్యేల బలాన్ని సంతరించుకోలేకపోయిందని కేజ్రీవాల్ చెప్పారు. అవిశ్వాస ఓటుకు వారికి 14 మంది ఎమ్మెల్యేల అవసరం అని, అయితే కేవలం ఎనిమిది మంది ఎమ్మెల్యేల బలం ఉందని తెలిపారు.

తమకు బిజెపి నుంచి పలు రకాల బెదిరింపులు వెలువడుతున్నాయని, ఆప్ నేతలను అరెస్టు చేయడం, జైళ్లకు పంపించడం జరుగుతోందని కేజ్రీవాల్ తెలిపారు. అయితే ఈ క్రమంలో ఆప్ ఎమ్మెల్యేలను కూడా వారు బెదిరించినా , పలు రకాల గాలాలకు దిగినా అవి పనిచేయలేదని చెప్పారు. సభలో తమకు మొత్తం 62 మంది సభ్యులు ఉన్నారని, వీరిలో సిసోడియా, సత్యేంద్ర జైన్ ఇప్పుడు లేరని, సభలో ఉండే 56 మంది ఎమ్మెల్యేలను సిబిఐ, ఇడిల ద్వారా బెదిరించినా బిజెపికి ఫలితం దక్కలేదని కేజ్రీవాల్ తెలిపారు. తమకు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉందన్నారు. లోపాలు ఉంటే చెపితే సరిదిద్దుకుంటామన్నారు. ఇక 2025లోనే కాదు 2050 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బిజెపి గెలవజాలదని, ఆప్‌దే ఇప్పుడు అప్పుడూ విజయం అని తేల్చిచెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News