Saturday, April 20, 2024

నకిలీ విత్తనాలను విక్రయిస్తున్న నిందితుడు అరెస్టు

- Advertisement -
- Advertisement -
  • పట్టుబడ్డ పత్తి విత్తనాల విలువ రూ.40 లక్షలు

శంషాబాద్: ప్రభుత్వం నిషేధించిన పత్తి విత్తనాలను విక్రయిస్తూ వ్యవసాయదారులను మోసం చేసి సొమ్ము చేసుకుంటున్న నకిలీ విత్తనాల ముఠా సభ్యుల్లో ఒకరైన నిందితున్ని సైబరాబాద్ ఎస్‌ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద 1.5 టన్నుల బిజి- హెచ్‌టి పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.

కేసుకు సంబంధించిన వివరాలను శంషాబాద్ డిసిపి నారాయణరెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా, భీమవరం, గ్రామానికి చెందిన తోటకూర రంగారావు (30) కర్నూలు జిల్లా, గోకులపాడు మండలం, క్రిష్ణగిరి గ్రామానికి వచ్చాడు. అయితే అక్కడ 15 ఎకరాల పొలం కొని మరో పదిహేను ఎకరాల పొలం లీజుకు తీసుకుని అందులో బిజి -హెచ్‌టి పత్తి పండించి పండిన పత్తిని కర్ణాటక రాష్ట్రం, ధర్మగిరి గ్రామంలోని జిన్నింగ్ మిషన్ కు తీసుకెళ్లి పత్తిని వేరు చేయించి విత్తనాలను తిరిగి తీసుకొస్తాడు. తీసుకువచ్చిన పత్తి విత్తనాలను వివిధ రకాల కెమికల్స్ మిక్సింగ్ చేసి పత్తి విత్తనాలుగా తయారుచేసి కొంతమంది రైతులకు ఎరవేసి కిలో రూ.2 వేల చొప్పున విక్రయిస్తాడు. ఈ పత్తి విత్తనాలను వేసిన పొలంలో తిరిగి వేరే పంట పండించిన పండదు పైగా క్యాన్సర్ వ్యాధి సోకుతుందని ఈ విత్తనాలను ప్రభుత్వం నిషేధించింది.

అయితే నిందితుడు తోటకూర రంగారావు గతంలో ఇదే తరహాలో అదిలాబాద్, భీమిలి, తాండూరు లలో వ్యవసాయదారులకు పత్తి విత్తనాలు విక్రయించి పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లి బెయిల్ పై వచ్చిన దాఖలాలు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. అయితే బొలెరో వాహనంలో 1.5 టన్నుల బిటి హెచ్‌టి పత్తి విత్తనాలను లోడ్ చేసుకుని వాటిని షాద్ నగర్, ఆమనగల్, తలకొండపల్లి, కేశంపేట్, కడ్తాల్ పరిసర ప్రాంతాల్లో విక్రయించేందుకు బయలుదేరాడు.

అయితే సమాచారం అందుకున్న సైబరాబాద్ ఎస్‌ఓటి పోలీసులు షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాయికల్ గేట్ సమీపంలో బొలెరో వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా నకిలీ పత్తి విత్తనాల బండారం బట్టభయలైంది. దీంతో పత్తి విత్తనాల లోడుతో ఉన్న బొలెరో వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించి నిందితుడు తోటకూర రంగారావు పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. పట్టుబడ్డ పత్తి విత్తనాల విలువ దాదాపు రూ.40 లక్షల వరకు ఉంటుందని డిసిపి నారాయణరెడ్డి తెలిపారు. నకిలీ పత్తి విత్తనాల గుట్టు రట్టు చేసి నిందితున్ని కటకటాల్లోకి పంపారు. కేసులో చాకచక్యం వ్యవహరించిన ఎస్‌ఓటి డిసిపి రషీద్, అడిషనల్ డీసీపీ నారాయణ గౌడ్, ఎసిపి కుశాల్కర్, సిఐ సత్యనారాయణలను డిసిపి నారాయణరెడ్డి అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News