Thursday, May 2, 2024

లోక్ సభ ఎన్నికల ప్రచారానికి కదిలిన మజ్లీస్ దండు!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల ప్రచారానికి మజ్లీస్ పార్టీ శుక్రవారం నుంచి పూనుకుంది. హైదరాబాద్ సీటుకు ఏడు నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో ప్రచారానికి మజ్లీస్ పార్టీ నడుము బిగించింది. హైదరాబాద్ లోక్ సభ సీటు కోసం పాదయాత్ర(పైదల్ దౌరా)ను మజ్లీస్ నాయకులు చేపట్టబోతున్నారు. హైదరాబాద్ ఎంపీ సీటుకు ఆల్ ఇండియా మజ్లీస్-ఈ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ పోటీ పడుతున్నారు. హైదరాబాద్ లో 40 ఏళ్లుగా మజ్లీస్ తిరుగులేని పార్టీగా ఉంది.

మజ్లీస్ పార్టీ 1984 నుంచి హైదరాబాద్ సీటు గెలుస్తూ వస్తోంది. 2019లో అసదుద్దీన్ ఓవైసీ 5లక్షలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిగా ఎవరినీ ఇంత వరకు ప్రకటించనందున అసదుద్దీన్ ఇంకా సునాయాసంగా గెలిచే అవకాశం ఉంటుంది. మజ్లీస్ పార్టీ శుక్రవారం మధ్యాహ్నం నుంచే ఆయా నియోజకవర్గాల్లో తన ప్రచారాన్ని ఆరంభించనుంది. అసదుద్దీన్ కు బిజెపి అభ్యర్థి కె. మాధవీ లత పోటీ ఇవ్వబోతున్నారు. ఆమె తొలిసారిగా రాజకీయ రంగంలో పోటీపడుతున్నారు.

మజ్లీస్ పార్టీ ఎంఎల్ఏలు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయనున్నారు. ఓటేయమని ఓటర్లను అభ్యర్థించనున్నారు. ముస్లింల పక్షాన పార్లమెంటులో గట్టిగా గళం వినిపించగల ఎంపీ అసదుద్దీన్. కానీ ఈసారి ఆయన ఓటమి పొందితే మాత్రం ముస్లింల పక్షాన గొంతు వినిపించడానికి ఎవరూ ఉండరు. కనుక అతడిని పాత బస్తీ ముస్లింలు గెలిపించుకుంటారా, లేదా అన్నది కీలకం. ఎందుకంటే బిజెపి అభ్యర్థి మాధవీ లత గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తానే గెలుస్తానంటూ బల్ల గుద్ది చెబుతున్నారు. ఆమెకు బిజెపి, కాషాయ దండు మద్దతు పూర్తిగా ఉంది. పైగా ఇదివరలో మజ్లీస్ పార్టీ అంతంత మాత్రం ఆధిక్యతతో గెలుపొందింది. యాకుత్ పురాలో ఎంబిటి అభ్యర్థి అజ్మతుల్లా ఖాన్ పై కేవలం 878 ఓట్ల తేడాతోనే గెలుపొందిందన్నది ఇక్కడ గమనార్హం. అదే విధంగా నాంపల్లి సీటును కూడా కేవలం ఐదు వేల ఓట్ల తేడాతో గెలిచింది. మజ్లీస్ పార్టీ ఏ మాత్రం ఏమరుపాటు లేకుండా ప్రచారం చేసి ఓటర్లకు దగ్గర కాకపోతే మటుకు విజయావకాశాలు తల్లకిందులు(టర్నరౌండ్ ఆపిల్ కార్ట్) అయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా పోటీ మజ్లీస్, బిజెపిల మధ్యే ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News