Saturday, July 27, 2024

దేశాన్ని లూటీ చేసిన కాంగ్రెస్: అమిత్ షా

- Advertisement -
- Advertisement -

దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ ప్రజలను లూటీ చేసిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. శుక్రవారం ఉత్తర్ ప్రదేశ్‌లోని రాయబరేలి(దినేష్ ప్రతాప్ సింగ్), అమేథీ(స్మృతి ఇరానీ) లోక్‌సభ నియోజకవర్గాలలో బిజెపి అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం నిర్వహిస్తూ బిజెపి బభ్యర్థులు ఇద్దరూ చాలా కష్టపడుతున్నారని, ఈ రెండు నియోజకవర్గాలలో వారి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చాలా కాలం నిరీక్షణ తర్వాత అయోధ్యలో రామ మందిరం మనకు లభించిందని, అయితే కాంగ్రెస్ మాత్రం సరైన పద్ధతిలో ప్రాణ ప్రతిష్ట జరగలేదని కాంగ్రెస్ నిందిస్తోందని ఆయన చెప్పారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అయోధ్య రామాలయానికి బాబ్రీ తాళం పడుతుందని ఆయన ఆరోపించారు. ఇండియా కూటమి పార్టీలు వారసత్వ రాజకీయాలు చేస్తున్నాయి. తన కుమారుడు ముఖ్యమంత్రి కావాలని లాలూ ప్రసాద్ కోరుకుంటున్నారు. తన మేనల్లుడు సిఎం కావాలని మమతా బెనర్జీ భావిస్తున్నారు. తన కుమారుడు ప్రధాని కావాలని సోనియా గాంధీ ఆశిస్తున్నారు. రాయబరేలి, అమేథీ సీట్లు తమవేనని ఆ కుటుంబం చెప్పుకుంటోంది. దీన్ని నిర్ణయించేంది ప్రజలేనని నేను భావిస్తున్నాను.

ఏ ఒక్క కుటుంబానికి ఏ సీటు రిజర్వ్ చేయలేదు అని అమిత్ షా వ్యాఖ్యానించారు. 370వ అధికరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఏనాడూ చర్యలు తీసుకోలేదని, కాని ప్రధాని మోడీ ఆ అధికరణను రదుచేసి దేశంలో తీవ్రవాదాన్ని కట్టడి చేశారని ఆయన చెప్పారు. పాక్ ఆక్రమిత కశ్మీరుకు భారత్‌కే చెందుతుందని, ఈ విషయంలో తాము భయపడే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ను అవినీతి పార్టీగా ఆయన అభివర్ణిస్తూ అనేక సంవత్సరాలపాటు ఆ పార్టీ దేశాన్ని లూటీ చేసిందని, అవినీతికి పాల్పడిన నాయకులందరినీ మోడీ ప్రభుత్వం జైలుకు పంపుతుందని అమిత్ షా ప్రకటించారు. ఉత్తర్ ప్రదేశ్‌లో సాగుతున్న డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఆయన కీర్తిస్తూ ప్రధాని మోడీ నాయకత్వంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని ఆయన చెప్పారు. యుపికి 14 ఎక్స్‌ప్రెస్‌వేలు, ఒక మెట్రో వ్యవస్థ, మెడికల్ కాలేజీలు, ఫిల్మ్ సిటీ, టాయ్ పార్కు వంటివి అనేకం వచ్చాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలో గూండాలను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తరిమికొట్టారని ఆయన చెప్పారు.

కాగా..గాంధీ కుటుంబానికి కంచుకోటలుగా ఉన్న రాయబరేలి, అమేథీ నియోజకవర్గాలపై ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించిన రాయబరేలి నుంచి ఈసారి రాహుల్ గాంధీ పోటీ చేస్తుండగా గత ఎన్నికల్లో రాహుల్ ఓటమి చెందిన అమేథీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గాంధీ కుటుంబానికి విధేయుడైన కిషోరీ లాల్ శర్మ పోటీ చేస్తున్నారు. అమేథీలో బిజెపి అభ్యర్థిగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పోటీ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News