ఈ నవల చదవడం ఒక గొప్ప అనుభవం. యాత్రానుభవం. సౌందర్య భరితమైన బాహ్య నైసర్గికతలోకి, సంక్షుభితమైన మ నోవల్మీకంలోకి చేసే హైకింగ్. ఏటవాలుగా, జా రుడుగా, ఎగుడుదిగుడుగా, అగాధాల అంచున, ప్రవాహాల మీదుగా, ఊపిరాడకుండా, గడ్డకట్టుకుపోతూ పాఠకులు ఇందులోని ప్రధాన పాత్రతో పాటు ప్రయాణం చేస్తారు. వణికిపోతారు, జ్వరపడతారు, ముగ్ధులవుతారు, మంచుకొండలకేన్వాసు మీద రంగురంగుల దృశ్యాలను, ఆశ్చర్యాలను అనుభవిస్తారు. కలవరపడతారు. ప్రకృతిని, మానవవికృతులను జమిలిగా మనముందు ఆవిష్కరించి రచయిత సతీష్ చప్పరికె బాగా కలవరపరుస్తారు. ‘ఘాంద్రుక్’ నేపాల్లోని అన్నపూర్ణ యాత్రా మార్గంలోని ఒకచిన్న ఊరు.
కానీ, పర్యాటకులకు, ఆరోహకులకు ప్రమా ద, సౌందర్య భరితమైన తమ సాహాసవలయం ముగింపునకు వచ్చే ముందు చేరుకునే మజిలీ. ప్రయాణాన్ని సమీక్షించుకునే చోటు, కొత్త స్థైర్యంతో అడుగు ముందుకు వేసే మెట్టు. కథానాయకుడు సిద్ధార్థ హోస్మనే విరక్తి, అనురక్తి నడుమ కొట్టుమిట్టాడుతూ, బయటి- లోపలి ఆరోహణ అవరోహణలను సాగిస్తూ, నిర్ణయం అనివార్యమైన పతాక సన్నివేశంలో ఘాంద్రుక్ను చేరతాడు. హైకింగ్ ఇక ముగుస్తుంది. మథనం ముగిసిందా, లేదా మనసు విప్పారి సంబుద్ధుడయ్యా డా అన్న ప్రశ్న సిద్ధార్థకు మాత్రమే సంబంధించింది కాదు. పాఠకులు కూడా ఆ కొండకొమ్ము మీద నిలిచి, ధవళగిరి కాంతుల నుంచి ఏ స్పష్టతను అందుకుంటారన్నది ఒక శేష పశ్న.
కె.శ్రీనివాస్