పంజాబ్పై కేజ్రీవాల్ చురక
చండీగఢ్ : పంజాబ్లో కాంగ్రెస్ ప్రభుత్వం తమాషాగా దిగజారిందని ఆప్ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ వెంటనే కళంకిత మంత్రులను కేబినెట్ నుంచి తొలిగించాలని డిమాండ్ చేశారు. పంజాబ్ పిసిసి పదవికి నవ్జోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేయడంతో పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షోభం తలెత్తింది. ఈ దశలో కేజ్రీవాల్ ఇక్కడికి వచ్చిన కేజ్రీవాల్ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. ఇక్కడ జరుగుతున్న పరిణామాలు గందరగోళంగా, తమాషాగా కన్పిస్తున్నాయని కేజ్రీవాల్ చెప్పారు.
ఇంతకు ముందటి పంజాబ్ సిఎం చేసిన వాగ్దానాలను ఇప్పటి సిఎం చన్నీ వెంటనే కార్యరూపంలోకి తీసుకురావల్సి ఉందని స్పష్టం చేశారు. బర్గారి అపవిత్ర చర్య ఉదంతంతో పాటు పలు అంశాలపై కొత్త ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవల్సి ఉందన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు రాజకీయ అస్థిరతను తెలియచేస్తున్నాయి. ఈ వాతావరణం ఉండటం దురదృష్టకరం అన్నారు. వచ్చే ఏడాది మధ్యలోపే అసెంబ్లీ ఎన్నికలు జరిగే పంజాబ్లో రెండు రోజుల పర్యటనకు కేజ్రీవాల్ బుధవారం ఇక్కడికి వచ్చారు. ఇక్కడ తమ పార్టీ రాజకీయ ఉనికిని మరింత బలోపేతం చేసుకునే దిశలో పలు కీలక కార్యక్రమాలలో పాల్గొననున్నారు.