Friday, April 26, 2024

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

- Advertisement -
- Advertisement -

శాసనసభ ప్రొటెమ్ స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో శాసనసభ ప్రొటెమ్ స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని సిఎం రేవంత్ రెడ్డి నియమించారు. ప్రభుత్వ అభ్యర్థనను అంగీకరించిన అక్బరుద్దీన్ ఓవైసీ నేడు ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. సభలో సీనియర్లుగా ఉన్న ఎమ్మెల్యేలలో ఒకరిని ప్రొటెమ్ స్పీకర్‌గా ఎంపిక చేయడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం ఎన్నికైన సభ్యుల్లో మాజీ సిఎం కెసిఆర్ సభలో అందరి కంటే సీనియర్, కాగా, ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతుండడంతో అక్బరుద్దీన్‌ను ప్రొటెమ్ స్పీకర్‌గా సిఎం రేవంత్ ఎంపిక చేసినట్టుగా తెలిసింది.

నేడు ఉదయం 8.30 గంటలకు ప్రొటెమ్ స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీ రాజ్ భవన్‌లో ప్రమాణ స్వీకారం చేస్తారు. రాజ్‌భవన్‌లో అక్బరుద్దీన్ చేత గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించనున్నారు. కొత్తగా ఎన్నికైన సభ్యులతో మొదటగా ప్రమాణస్వీకారం చేయించి స్పీకర్‌ను ఎన్నుకునేంత వరకు ప్రొటెం స్పీకర్ బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. అక్బరుద్దీన్ ఓవైసీ ఆరుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే ఈ అసెంబ్లీ సమావేశాలు నాలుగు రోజుల పాటు జరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

ఎనిమిది సార్లు గెలిచిన కెసిఆర్
ప్రస్తుతం అత్యధికంగా ఎనిమిది సార్లు ఎన్నికైన శాసన సభ్యుడిగా మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఉన్నారు. కెసిఆర్ తరువాత మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, దానం నాగేందర్ ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ కూడా ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వీరితో పాటు కాంగ్రెస్‌లో ఆరుసార్లు ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావులు ఉన్నారు. కాంగ్రెస్ నేతలు ఇద్దరు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయడంతో సిఎం రేవంత్ రెడ్డి అక్బరుద్దీన్ ఒవైసీ వైపు మొగ్గుచూపారు.

ఏర్పాట్లను పరిశీలించిన సిఎస్
నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన సిఎస్ శాంతి కుమారి, డిజిపి రవిగుప్తా, అసెంబ్లీ సెక్రటరీ, సమాచార. శాఖ కమిషనర్ అశోక్ రెడ్టి తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రతతో పాటు ట్రాఫిక్ తదితర అంశాలపై సిఎస్ అధికారులతో చర్చించారు.

ఎమ్మెల్సీ కసిరెడ్డి రాజీనామాకు ఆమోదం
మహాబూబ్ నగర్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శుక్రవారం కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామాకు ఆమోదం తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News