Saturday, July 27, 2024

ఆర్టీసి బస్సుపై దాడి చేసి అద్దాలు పగులగొట్టిన

- Advertisement -
- Advertisement -

వారిపై హిస్టరీ షీట్స్ తెరుస్తాం
బస్సుపై దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నాం
ప్రజల ఆస్తిపై దాడులు చేయడం శ్రేయస్కరం కాదు
టిఎస్ ఆర్టీసి ఎండి విసి సజ్జనార్
మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ పరిధిలో బైకులపై వచ్చిన కొందరు దుండగులు ఆర్టీసి బస్సుపై దాడి చేశారని, పోలీస్ వారి సహకారంతో వారిపై హిస్టరీ షీట్స్ తెరుస్తామని టిఎస్ ఆర్టీసి ఎండి విసి సజ్జనార్ పేర్కొన్నారు. బస్సుపై దాడికి సంబందించిన వీడియోను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన ఆయన ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్ శివారులోని రాచలూరు గేట్ వద్ద కల్వకుర్తి డిపోనకు చెందిన టిఎస్ ఆర్టీసి బస్సుపై కొందరు దుండగులు బైక్‌లపై వచ్చి దాడి చేశారని, ఈ ఘటనలో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయని, అదృష్టవశాత్తు బస్సులోని ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని ఆయన తెలిపారు.

ప్రజలను నిత్యం సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్న తమ బస్సులపై ఎలాంటి కారణం లేకుండా దాడులు చేయడాన్ని టిఎస్ ఆర్టీసి యాజమాన్యం ఏమాత్రం సహించదని ఆయన హెచ్చరించారు. ఆర్టీసి బస్సుపై దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నామని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఆర్టీసి బస్సులు ప్రజల ఆస్తి అని, వాటిని సంరక్షించుకోవాల్సింది కూడా ప్రజలేనని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఆస్తిపై దాడులు చేయడం శ్రేయస్కరం కాదని, పోలీస్ శాఖ సహకారంతో నిందితులపై హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తామని, బస్సు డ్యామేజీ ఖర్చులను వారి నుంచి వసూలు చేస్తా మని విసి సజ్జనార్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై మహేశ్వరం పోలీస్‌స్టేషన్‌లో ఆర్టీసి అధికారులు ఫిర్యాదు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News