కుత్బుల్లాపూర్: మానవాళి మనుగడకు మొక్కలే జీవనాధారమని, ప్రతి ఒక్కరు మూడు మొక్కలను నాటి భావితరాలకు స్వచ్చమైన గాలిని అందించాలని బాలానగర్ జోన్ డిసిపి పి.వి.పద్మజ అన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం షాపూర్నగర్లోని బాలానగర్ జోన్ డిసిపి కార్యాలయం అవరణంలో ఆమె పాల్గొని మొక్కలు నాటి నీళ్ళు పోశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఈ ఛాలెంజ్లో మొక్కలు నాటడమే కాకుండ వాటిని సంరక్షించే బాధ్యత ఛాలెంజ్గా తీసుకోవాలన్నారు. తమ కార్యాలయం అవరణంలో సుమారు 1800 మొక్కలను నాటామని తెలిపారు.
ప్రతి ఒక్కరు తమ ప్రాంతాలలో మూడు మొక్కలను నాటి గ్రీన్ తెలంగాణగా మార్చాలన్నారు. తమ తమ పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఉన్న ఖాళీ స్థలాలలో మొక్కలను నాటాలని సిబ్బందికి ఆదేశించారు. గతంలో తెలంగాణలో 25 శాతం అటవీ ప్రాంతం ఉండేదని, ప్రస్తుతం 4.5 శాతం పెరిగిందన్నారు. తెలంగాణ అటవీ ప్రాంతం దేశంలోనే ఐదవ స్థానంలో ఉందని, త్వరలో ప్రథమ స్థానంలోకి రావాలన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్లో పోలీసులను భాగస్వాములను చేయడం సంతోషంగా ఉందన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతీ, సైబరాబాద్ డిసిపి క్రైమ్ రోహిణిలకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటాలని ఛాలెంజ్ విసిరారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.