Sunday, April 28, 2024

ముగిసిన బండి సంజయ్ ప్రజాహిత యాత్ర

- Advertisement -
- Advertisement -

ఎంపి నియోజకవర్గ పరిధిలోని 44 మండలాలు
211 గ్రామాల్లో 753 కి.మీల మేరకు కొనసాగిన యాత్ర
బిఆర్‌ఎస్ అవినీతి, అక్రమాలతోపాటు కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలు వైఫల్యాలపై విరుచుకుపడ్డ బండి సంజయ్

మన తెలంగాణ / హైదరాబాద్: బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజాహిత యాత్ర ముగిసింది. ప్రజాహిత యాత్ర చివరి రోజైన శనివారం నాడు తిమ్మాపూర్, బెజ్జంకి మండలాల్లో పలు అభివ్రుద్ది కార్యక్రమాలకు బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. బెజ్జంకి మండలంలో 5, తిమ్మాపూర్ మండలంలో 3 అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. బెజ్జంకి మండలంలోని గుండారం, బేగంపేట, లక్ష్మీపూర్ గ్రామాల్లో కమ్యూనిటీ హాళ్ల కంపౌండ్ వాల్ నిర్మాణానికి, బెజ్జంకిలో యాదవ కమ్యూనిటీ హాలు, దాచారంలో కామన్ వర్క్ షెడ్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. అట్లాగే తిమ్మాపూర్ మండంలోని రేణిగుంటలో యాదవ కమ్యూనిటీ హాలు ప్రహారిగోడ, మహాత్మానగర్, కొత్తపల్లి గ్రామాల్లో కమ్యూనిటీ హాలు, రాఘవాపూర్ లో బోర్ వెల్ నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు… ఎన్నికల షెడ్యూల్ వెలువడటానికి కొద్ది నిమిషాల ముందే ఆయా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతోపాటు ప్రజాహిత యాత్రను ముగించారు.

ఈ రోజు బండి సంజయ్ కుమార్ ఆయా మండలాల్లోని పలు గ్రామాల్లో పలు శంకుస్థాపనలు చేశారు. పార్టీ నేతల కోసం బెజ్జంకి, తిమ్మాపూర్ తొలిదశలో సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 15 మండలాలు (2 మున్సిపాలిటీలు)లతోపాటు మొత్తం 81 గ్రామాల్లో 215 కి.మీల మేరకు ప్రజాహిత యాత్ర సాగింది. జగిత్యాల జిల్లాకు సంబంధించి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే మండలాల్లోనూ ప్రజాహిత యాత్రను పూర్తి చేశారు. ప్రతి గ్రామంలో, మండల కేంద్రాల్లో, మున్సిపాలిటీల్లో బండి సంజయ్ పాదయాత్ర చేసి ప్రజలతో మమేకమయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఆయా గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాలు, జిల్లాకు చేసిన అభివృద్ధిని వెచ్చించిన నిధులను పూర్తి వివరాలతో సహా ప్రజలకు వివరించారు. ఆయా గ్రామాల్లోనూ వీటికి సంబంధించి నిధుల వివరాలతో పోస్టర్లను అంటించారు. మలిదశ యాత్రలో భాగంగా హుస్నాబాద్, హుజూరాబాద్, చొప్పదండి, మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 29 మండలాల్లోని 131 గ్రామాల్లో బండి సంజయ్ యాత్ర కొనసాగింది. మొత్తం 538 కిలోమీటర్ల మేరకు యాత్ర చేశారు. సిద్దిపేట, హన్మకొండ జిల్లాలకు సంబంధించి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే మండలాల్లోనూ ప్రజాహిత యాత్రను పూర్తి చేశారు. తొలి, మలి విడత కలిపి మొత్తం 44 మండలాల్లోని 211 గ్రామాల్లో 753 కి.మీల మేరకు యాత్ర కొనసాగింది.

మొత్తంగా ప్రజాహిత యాత్రకు ప్రజల నుండి మంచి స్పందన లభించింది. ఏ గ్రామానికి వెళ్లినా స్థానికులు తరలివచ్చి స్వాగతం పలికారు. ప్రజాహిత యాత్ర ఆద్యంతం కాషాయ సైన్యంలో జోష్ నింపింది. బండి సంజయ్ అడుగులో అడుగు వేస్తూ పార్టీ శ్రేణులు వెంట కదిలాయి. యాత్రలో భాగంగా బండి సంజయ్ గ్రామగ్రామాన తిరుగుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం గ్రామాల వారీగా వెచ్చించిన నిధులను లెక్కలతో సహా ప్రజలకు అర్థమయ్యే రీతిలో తెలియజేశారు. ప్రజల కష్టాలను స్వయంగా అడిగితెలుసుకున్నారు. వివిధ గ్రామాల ప్రజలు తమ సమస్యలను వినతి పత్రం ద్వారా సంజయ్‌కు తెలియజేశారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని..మరోసారి ఎంపిగా తనను గెలిపించాలని సంజయ్ అభ్యర్ధించారు. పువ్వుకు ఓటేస్తే రాముడికి వేసినట్లే..500 ఏళ్ల నాటి కల నెరవేర్చిన మోదీని మళ్లీ ప్రధానిని చేద్దామని సంజయ్ పిలుపునిచ్చారు.ఇక రాజకీయ అంశాల విషయానికొస్తే ప్రజాహిత యాత్రలో భాగంగా సంజయ్.. కాంగ్రెస్ , బిఆర్‌ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. తొలివిడత యాత్రలో కాళేశ్వరం, క్రిష్ణా నీటి వాటాల విషయంలో రెండు పార్టీలు డ్రామాలాడుతున్నాయని అడుగడుగునా ఎండగట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రూ.లక్ష కోట్ల ప్రజాధనాన్ని వృథా చేసిన కెసిఆర్ సహా బాధ్యులను ఎందుకు అరెస్ట్ చేయలేదని, వారి ఆస్తులను ఎందుకు జప్తు చేయలేదో అడుగడుగునా నిలదీశారు. బిఆర్‌ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ వైఫల్యాలను సైతం పదేపదే ఎండగట్టారు. మలి విడత యాత్రలో 6 గ్యారంటీల హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను అడుగడుగునా ఎండగట్టారు. వంద రోజుల గడువు ముగిసినందున 6 గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ పిలుపునిచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News