Saturday, July 27, 2024

బంగ్లాదేశ్‌కు సిరీస్

- Advertisement -
- Advertisement -

శ్రీలంకతో సోమవారం జరిగిన మూడో, చివరి వన్డేలో ఆతిథ్య బంగ్లాదేశ్ 4 వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ఈ విజయంతో బంగ్లాదేశ్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 21తో సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 40.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ తంజీద్ హసన్ అద్భుత బ్యాటింగ్‌తో బంగ్లాదేశ్‌ను ఆదుకున్నాడు. ఆరంభం నుంచే హసన్ దూకుడైన బ్యాటింగ్‌ను కనబరిచాడు. ఓపెనర్ అనముల్ హక్ (12)తో కలిసి తొలి వికెట్‌కు 50 పరుగులు జోడించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటో (1) విఫలమయ్యాడు. ఒకవైపు వికెట్లు పడుతున్న తంజీద్ తన జోరును కొనసాగించాడు.

అద్భుత ఇన్నింగ్స్ ఆడిన తంజీద్ 81 బంతుల్లోనే 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేశాడు. అయితే జోరు మీదున్న తంజీద్ కీలక సమయంలో పెవిలియన్ చేరాడు. దీంతో బంగ్లాదేశ్ 130 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. ఈ దశలో వికెట్ కీపర్ ముష్ఫికుర్ రమీ, మెహదీ హసన్ మీరాజ్, రిశాద్ హుస్సేన్‌లు అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు. రహీం 3ఫోర్లు, ఒక సిక్సర్‌తో 37 పరుగులు చేశాడు. సమన్వయంతో ఆడిన మీరాజ్ 3 ఫోర్లతో 25 పరుగులు సాధించాడు. మరోవైపు విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగిన రిశాద్ హుస్సేన్ 18 బంతుల్లోనే 4 సిక్సర్లు, ఐదు ఫోర్లతో 48 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో బంగ్లా అలవోక విజయం సాధించి సిరీస్‌ను దక్కించుకుంది.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన లంకను జనిత్ లియనాగె ఆదుకున్నాడు. ఒంటరి పోరాటం చేసిన జనిత్ 11 ఫోర్లు, రెండు సిక్సర్లతో 101 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మిగతావారు విఫలం కావడంతో లంక ఇన్నింగ్స్ 235 పరుగుల వద్దే ముగిసింది. బంగ్లా బౌలర్లలో తస్కిన్ మూడు, ముస్తఫిజుర్, మెహదీ హసన్ మీరాజ్ రెండేసి వికెట్లను పడగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News