13 బృందాలను విచారించిన బిసి కమిషన్
మన తెలంగాణ / హైదరాబాద్ : బిసి జాబితా నుండి తొలగించబడిన 26 కులాలను తిరిగి చేర్చుకోవడంపై రాష్ట్ర బిసి కమిషన్ బహిరంగ విచారణ ప్రారంభించింది. తొలిరోజు సోమవారం బిసి కమిషన్ కార్యాలయంలో 13ప్రతినిధుల బృందాలను బిసి కమిషన్ విచారించింది. మంగళ, బుధ వారాల్లో కూడా విచారణ కొనసాగుతుందని బిసి కమిషన్ పేర్కొంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ బిసి కులాల జాబితా నుండి తొలగించబడిన 26 కులాలను తిరిగి చేర్చుకోవాలని వచ్చిన విజ్ఞప్తులపై బిసి కమిషన్ విచారణ చేపట్టింది.
బిసి కమిషన్ ఛైర్మన్ జి. నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి రంగు, మెంబర్ సెక్రెటరీ బాల మాయా దేవి , డిప్యూటి డైరెక్టర్ యు. శ్రీనివాసరావు, స్పెషల్ ఆఫీసర్ జి. సతీష్ కుమార్, రీసెర్చ్ ఆఫీసర్ జి. లక్ష్మీనారాయణ తదితరులు తొలిరోజు విచారణలో పాల్గొన్నారు. సోమవారం జరిగిన బహిరంగ విచారణలో 13 ప్రతినిధుల బృందాలను కమిషన్ విచారించింది. కళింగ, తూర్పుకాపు కుల సంఘాల ప్రతినిధులు కమిషన్ ముందు హాజరై తమ కులాలను తెలంగాణ బిసి జాబితాలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ బిసి ఏ కులాల పరిరక్షణ సమితి, తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర సంఘం, కొందరు తెలంగాణ మేధావులు తొలగించబడిన 26 కులాలను తిరిగి చేర్చుకోవద్దని కమిషన్కు విజ్ఞప్తి చేశారు.