Saturday, May 4, 2024

నేడు బిసి సింహగర్జన మహాసభ

- Advertisement -
- Advertisement -

హాజరుకానున్న అఖిలపక్ష బిసి నేతలు
బిసిలు లక్షలాదిగా తరలిరావాలి : జాజుల పిలుపు
ఏర్పాట్లను పరిశీలించిన బిసి నేత

మన తెలంగాణ / హైదరాబాద్ : బిసి సింహగర్జన మహాసభ ఆదివారం సరూర్‌నగర్ స్టేడియంలో జరుగనుంది. ఈ సింహగర్జన సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శనివారం ఆయన సరూర్‌నగర్ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. అఖిలపక్ష పార్టీల బిసి నాయకులు పాల్గొంటున్న ఈ గర్జన సభకు లక్షలాదిగా బిసిలు తరలిరావాలని జాజుల పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం, సబ్బండ కులాలకు రాజకీయ అధికారం, కులానికో సీటు బిసిలకే ఓటు, అనే అజెండాతో, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బిసిలకు జనాభా దామాషా ప్రకారం 60 అసెంబ్లీ స్థానాలు,బిసిలకే సిఎం పీఠం దక్కాలనే డిమాండ్ తో బిసి సింహగర్జన మహాసభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సింహగర్జనకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశామని ఈ సింహగర్జన మహాసభకు సర్వం సిద్ధం చేశామని ఆయన తెలిపారు. పార్టీల కతీతంగా, జండాలకు అతీతంగా సరూర్ నగర్ స్టేడియంలోని మైదానంలో ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి సభ ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు.

సింహగర్జన మహాసభకు బిసి ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నాయకులు, మహిళలు, విద్యార్థులు యువజనులు, మేధావులు కళాకారులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు మహాసభకు అతిథులుగా బిఆర్ ఎస్ రాజ్యసభ సభ్యులు కె. కేశవరావు, మాజి మంత్రి బిజేపి నాయకులు ఈటల రాజేందర్, కాంగ్రెస్ నాయకులు వి హనుమంతరావు, మధు యాష్కి గౌడ్, బిఎస్‌పి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్, ఎంఆర్‌పిఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ, డిఎస్‌పి పార్టీ అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహరాజ్, సిపిఎం నాయకులు చెరిపెల్లి సీతారాములు, సిపిఐ నాయకులు ప్రభాకర్, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య, ఎల్ హెచ్ పి ఎస్ అధ్యక్షుడు బెల్లా నాయక్,ప్రజా గాయకురాలు విమలక్క, భహుజన గాయకుడు ఏపూరి సోమన్నలు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు.

చారిత్రాత్మకంగా జరిగే బిసి సింహగర్జనలో బిసిలంతా స్వచ్ఛందంగా పాల్గొని బిసిల రాజకీయ ఐక్యతను, బిసిల రాజకీయ ఆకాంక్షలను ఈ మహాసభ ద్వార తెలియజేస్తామని జాజుల తెలిపారు. సింహగర్జన మహాసభకు తెలంగాణ రాష్ట్రంలోని నలుమూలల నుండి ఇంటికి ఒక మనిషి, ఊరికి ఒక బండి చొప్పున స్వచ్ఛందంగా సద్దిగట్టుకుని తరలి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సభ ద్వారా బిసిలు రాయితీలకు, సంక్షేమ పథకాలకు రాజీ పడకుండా రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా పోరాటడానికి రాజకీయ పోరాటం నిర్వహించడానికి ఒక వేదిక ఏర్పడుతుందని అన్నారు. బిసిల పోరాటం రాయితీల పోరాటం కాదు రాజ్యాధికారం కోసం జరిగే పోరాటమని, ఈ సభ ఒక మార్గదర్శకత్వం నిర్దేశిస్తుందని జాజుల తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News