Wednesday, May 14, 2025

రాష్ట్రంలో బీర్ల కొరత?

- Advertisement -
- Advertisement -

ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించడానికి ఆబ్కారీ శాఖ కసరత్తు
కింగ్‌పిషర్ బీర్ల కోసం మద్యం షాపుల వత్తిడి
ఈ కంపెనీ బీర్లను ఆచితూచి పంపిణీ చేస్తున్న ఆబ్కారీ శాఖ
మనతెలంగాణ/హైదరాబాద్: వేసవి నేపథ్యంలో రాష్ట్రంలో బీర్ల కొరత ఏర్పడింది. అందులో ముఖ్యంగా కింగ్‌పిషర్ బీర్ల (beer shortage) కొరత ఏర్పడడంతో ఇతర రాష్ట్రాల నుంచి ఈ బీర్లను తెప్పించడానికి ఎక్సైజ్ శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రస్తుతం పలు మద్యం షాపుల్లో కింగ్‌పిషర్ బీర్లు నోస్టాక్ అని దర్శనమిస్తున్నాయి. మాములుగా వేసవికి ముందే బీర్లకు సంబంధించి బఫర్ స్టాక్‌ను ఎక్సైజ్ శాఖ సిద్ధం చేసుకుంటుంది. రాష్ట్రంలోని 17 మద్యం డిపోల్లో వాటి సామర్థ్యాన్ని బట్టి కనీసం రెండు లక్షల బీర్లకు తక్కువ లేకుండా 25 నుంచి 30 లక్షల బీర్లను (beer shortage) బఫర్ స్టాక్ సిద్ధంగా ఉంచుకుంటుంది.

అయితే డిమాండ్‌ను బట్టి అబ్కారీ శాఖ అధికారులు మద్యం షాపులకు బీర్లను సరఫరా చేస్తుంటారు. అయితే, ఇందులో కింగ్‌పిషర్ బీర్లనే ఎక్కువ కావాలని మద్యం, బార్, పబ్ యజమానులు ఇండెంట్ పంపిస్తుండడంతో బ్రేవరేజేస్ కార్పొరేషన్ మాత్రం ఆచితూచి వాటిని ఆయా షాపులకు పంపిణీ చేస్తోంది. మాములు రోజుల్లో ప్రతిరోజు 20 లక్షలకు పైగా బీర్లు అమ్ముడుపోతుండగా, వేసవికాలంలో మాత్రం 30 నుంచి 40 లక్షల బీర్లు ప్రతిరోజు అమ్ముడవుతుంటాయని ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

ఏప్రిల్‌లో బీర్ల విక్రయాల ద్వారా రూ.944.54 కోట్లు

ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో 46.46 లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరగ్గా, సుమారుగా రూ.944.54 కోట్ల ఆదాయం ఆబ్కారీ శాఖకు వచ్చింది. దీంతోపాటు మే నెలలో (ఈ నెల 12వ తేదీ వరకు) సుమారుగా 20 లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరగ్గా సుమారుగా రూ.485 కోట్ల ఆదాయం వచ్చిందని ఆబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. ఇక ఏప్రిల్ నెలలో 31.17 లక్షల కేసుల మద్యం విక్రయాలు జరగ్గా, రూ.2,327.79 కోట్ల ఆదాయం ఈ శాఖకు వచ్చింది.

గతేడాది బీర్ల విక్రయం ద్వారా ఏప్రిల్ రూ.902 కోట్ల ఆదాయం

గతేడాది ఏప్రిల్ నెలలో 50.14 లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరగ్గా రూ.902.28 కోట్ల ఆదాయం ఆబ్కారీ శాఖకు వచ్చింది. దీంతోపాటు 30.6 లక్షల మద్యం కేసుల విక్రయం ద్వారా రూ.2,302.98 కోట్ల ఆదాయం ఆ శాఖకు సమకూరింది. ఇక గతేడాది మే నెలలో 49.19 లక్షల కేసుల బీర్లను విక్రయం ద్వారా రూ.873.87 కోట్ల ఆదాయం రాగా, 34.16 లక్షల మద్య కేసుల విక్రయం ద్వారా రూ.2,548.87 కోట్ల ఆదాయం వచ్చిందని ఆ శాఖ గణాంకాలు పేర్కొంటున్నాయి.

కర్ణాటక, గోవా, తమిళనాడు రాష్ట్రాల నుంచి…

రాష్ట్రంలో డిమాండ్‌కు తగ్గట్టుగా బీర్లు దొరక్కపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలను ఎక్సైజ్ శాఖ అన్వేషిస్తోంది. అయితే బ్రీవరీలకు మూడో షిప్ట్‌కు అనుమతి ఇచ్చి ఉత్పత్తిని పెంచడం లేదా డిమాండ్ అధికంగా ఉండే బ్రాండ్లను కర్ణాటక, గోవా, తమిళనాడు రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవడం లాంటి చర్యలను ఎక్సైజ్ శాఖ చేపడుతోంది.

ముందస్తు చర్యలకు ఆబ్కారీ శాఖ కసరత్తు

బీరు ప్రియులు ఎక్కువగా ఇష్టపడే బ్రాండ్‌లలో ప్రధానంగా బడ్‌వైజర్, నాక్‌ఔట్, రాయల్ ఛాలెంజ్, కింగ్‌ఫిషర్, కార్లస్బెర్గ్, హైవార్డ్, టుబర్గ్, కరోనా తదితర రకాలు ఎక్కువ అమ్ముడు పోతుంటాయి. రాష్ట్రంలో ఆరు బ్రీవరీ కంపెనీలు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు రెండు లక్షలు మేర బీర్లు ఉత్పత్తి చేసేందుకు అవకాశం ఉంది.

గ్రేటర్ హైదరాబాద్ జిల్లాల వాటా ఎక్కువ….

ప్రతి సంవత్సరం బీర్ల విక్రయింలో గ్రేటర్ హైదరాబాద్‌లోని షాపులే ముందంజలో ఉన్నాయి. 2018, 19 ఆర్థిక సంవత్సరంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 498.69 లక్షల కేసుల బీర్లు అమ్ముడవ్వగా, 2019, 20 సంవత్సరంలో 492.26 లక్షల కేసులు, 2020, 21 సంవత్సరంలో 273.28 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. 2021-,22 సంవత్సరం ఒక్క ఏప్రిల్ నెలలో బీర్లు 26,12,694 కేసులు అమ్ముడుపోయాయని ఎక్సైజ్ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 2022-,23 సంవత్సరం జనవరి టు మార్చి నెల మధ్య 1,01,03,633 బీరు కేసులు అమ్ముడు కాగా, ఇక, ఏప్రిల్ టు జూన్ నెలలో 1,54,76,602 బీరు కేసులు, జూలై టు సెప్టెంబర్‌ల మధ్య 99,03,949 కేసులు, అక్టోబర్ టు డిసెంబర్ నెలాఖరు నాటికి 1,03,45,925 బీరు కేసులు అమ్ముడయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News