Monday, April 29, 2024

భారతరాష్ట్ర సమితికే భారీ ఆధిక్యం : కెపి…, హరీశ్ లకు 82 వేలకుపైగా మెజారిటీ !

- Advertisement -
- Advertisement -

268 ఓట్లతో బయటపడ్డ కాలె యాదయ్య

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికలు రికార్డులమీద రికార్డులు సృష్టించాయి. నాలుగు నియోజకవర్గాల్లో సమీప ప్రత్యర్ధులకు దిమ్మెదిరిగిపోయేంతగా మెజారిటీలను అందించిన ఓటర్లు తమ నేతలపై ఎనలేని అభిమానం చాటుకున్నారు. ఈ ఎన్నికల్లో భారతరాష్ట్ర సమితి పార్టీకి లభించినంత మెజారీటి ఓట్లు మరే పార్టీ అందుకోలేపోయింది. ఇతర పార్టీలు కనీసం ఎక్కడా ఆ మెజారిటీ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కెపి వివేకానంద గౌడ్ 85,576 ఓట్ల మెజారీటీతో ఘనవిజయం సాధించారు.

సిద్దిపేటలో హరీష్ రావు కూడా 82,308ఓట్ల మెజారీటీతో రెండవ స్థానంలో నిలిచారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో మాధవరం కృష్ణారావు 70,387 ఓట్ల మెజారీటీతో మూడవ స్థానంలో నిలిచారు. దుబ్బాక నియోజకవర్గం నుంచి కొత్త ప్రభాకర్‌రెడ్డి 53,513 ఓట్ల మెజారీటి సాధించి నాలుగవ స్థానంలో నిలిచారు. ఎన్నికల్లో 50వేలు అంతకు మించి మెజారిటీ సాధించిన వారిలో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందినవారే ఉన్నారు. మొత్తం 12మందికి 50వేలకు పైగా ఓట్ల మెజారీటీ లభించింది. ఇందులో నకిరేకల్ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 68,839 ఓట్ల మెజారీటీతో వేముల వీరేశం ఘనవిజయం సాధించారు. మంచిర్యాల నియోజకవర్గం నుంచి 66,116ఓట్ల మెజారీటీతో ప్రేమసాగర్ విజయం సాధించారు. నాగార్జునసాగర్ నుంచి జై వీర్‌రెడ్డికి 55,849 ఓట్ల మెజారీటీ లభించింది. నల్లగొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి 54,332ఓట్లు, ఇల్లెందులో కోరం కనకయ్యకు 57,309ఓట్లు,భూపాలపల్లిలో గండ్ర సత్యనారాయణకు 52,689ఓట్లు, మహబూబాబాద్‌లో డా.మురళీనాయక్‌కు 50,171ఓట్లు, డోర్నకల్‌లో రాంచంద్రనాయక్‌కు 53,131ఓట్లు,రామగుండంలో రాజ్‌ ఠాకూర్‌కు 56,794ఓట్లు, పెద్దపల్లిలో సిహెచ్. విజయరమణా రావుకు 55,108ఓట్లు, తుంగతుర్తిలో మందుల శ్యామ్యూల్‌కు 51,091ఓట్లు , కోదాడలో పద్మావతి రెడ్డికి 50,655ఓట్లు మెజారీటి లభించింది. నిర్మల్ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్ధి మహేశ్వర్‌ రెడ్డికి 50,703 ఓట్ల మెజారిటీ లభించింది.

వీరు 5వేలలోపు ఓట్ల ఆధిక్యంతో బయటపడ్డారు:
అసెంబ్లీ ఎన్నికల్లో చావు తప్పి కన్నులోట్టబోయిన చందంగా పలు నియోజకవర్గాల్లో కొందరు అభ్యర్దులు 5వేలలోపు ఓట్ల మెజారీటితో బయటపడి విజయం దక్కించుకున్నారు. వీరిలో చేవెళ్ల నియోజకవర్గం నుంచి బిఆర్‌ఎస్ అభ్యర్ది కాలేకు కాలం కలిసివచ్చింది. ఇక్కడ యాదయ్య కేవలం 268 ఓట్ల మెజారిటీతో ఒడ్డున పడ్డారు. రాష్ట్రంలో అతి తక్కువ ఓట్లతో విజేతగా నిలిచి రికార్డు నెలకొల్పారు. తక్కువ మెజారిటీతో విజయాన్ని సొంతం చేసుకున్న కాంగ్రెస్‌పార్టీ అభ్యర్ధుల్లో దేవరఖద్ర నుంచి జి.మధుసూధన్ రెడ్డి 1392ఓట్ల మెజారీటీతో గెలుపొందారు. బోధన్ నుంచి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి 3062ఓట్ల మెజారీటీతో విజేతగా నిలిచారు. జుక్కల్ నుంచి తోట లక్ష్మికాంతరావు 1152ఓట్ల మెజారీటీతో విజయం దక్కించుకున్నారు. ఖానాపూర్ నుంచి వెడ్మబొజ్జు 4702ఓట్ల మెజారీతో గెలుపొందారు. బిఆర్‌ఎస్ పార్టీ నుంచి స్వల్ప మెజారిటీతో గెలుపొందిన వారిలో సూర్యాపేట నుంచి జగదీష్‌రెడ్డి 4206 ఓట్ల మెజారీటీతో బయటపడ్డారు.బాల్కోండ నుంచి వేముల ప్రశాంత్ రెడ్డి 4533ఓట్లతో మెజారీటీతో ఒడ్డున పడ్డారు. సిర్పూర్‌లో బిజేపి నుంచి పాల్వయ్ హరీష్ బాబు 3088 ఓట్ల మెజారీటితో విజయాన్ని దక్కించుకున్నారు.

Vivekananda Goud

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News