Saturday, July 27, 2024

కేజ్రీవాల్‌ను హతమార్చేందుకు బిజెపి కుట్ర: మంత్రి అతిషి

- Advertisement -
- Advertisement -

కేజ్రీవాల్‌ను హతమార్చేందుకు బిజెపి కుట్ర
జైలు అధికారులు ఇన్సులిన్ ఇవ్వడం లేదు
ఆయన సుగర్ లెవల్స్ నిలకడగా లేవు
స్వీట్లు తింటున్నారంటూ కోర్టులో ఇడి అసత్యాలు
మంత్రి అతిషి ఆరోపణ

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను తీహార్ జైలులో హతమార్చడానికి కుట్ర జరుగుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ గురువారం ఆరోపించింది. కేజ్రీవాల్‌ను అంతం చేసేందుకు తీహార్ జైలులో ప్రయత్నం జరుగుతోందని ఢిల్లీ మంత్రి అతిషి ఆరోపించారు. గత కొద్ది రోజులుగా కేజ్రీవాల్ సుగర్ లెవల్స్ నిలకడగా ఉండడం లేదని ఆమె తెలిపారు. ఇన్సులిన్ కోసం అడిగినప్పటికీ తీహార్ జైలు అధికారులు ఆయనకు ఇవ్వడం లేదని విలేకరుల సావేశంలో ఆమె ఆరోపించారు. 30 సంవత్సరాలుగా డయాబెటిస్‌తో బాధపడుతున్న వ్యక్తికి ఇన్సులిన్ ఇవ్వకపోవడం ఎటువంటి కుట్రని, అరివంద్ కేజ్రీవాల్‌ను చంపడానికి ప్రయత్నిస్తున్నారా అని ప్రశ్నించారు. ఎన్నికలలో కేజ్రీవాల్‌ను ఓడించే శక్తి బిజెపికి లేదని ఆమె తెలిపారు. అదే కేజ్రీవాల్‌ను జైలులు బంధించి చంపాలని బిజెపి కుట్ర పన్నిందని ఆమె ఆరోపించారు.

డయాబెటిక్ రోగి అయిన కేజ్రీవాల్ సుగర్ లెవల్స్ అదుపులో ఉంచుకునేందుకు రోజూ 54 యూనిట్ల ఇన్సులిన్ వేసుకుంటారని అతిషి వివరించారు. డయాబెటిక్ రోగి కాబట్టే కేజ్రీవాల్ ఇంటి భోజనం తినేందుకు కోర్టు అనుమతించిందని ఆమె తెలిపారు. సుగర్ లెవల్స్ నలికడగా ఉండేందుకు ఆయనకు ఒక ప్రత్యేకమైన ఆహారం అవసరమని ఆమె చెప్పారు. తన అనుబంధ సంస్థ ఇడి ద్వారా కేజ్రీవాల్ ఆరోగ్యాన్ని దెబ్బతీసేందుకు బిజెపి ఈరోజు ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు. అనారోగ్యం కారణం చెప్పి బెయిల్ పొందే ఉద్దేశంతో తన సుగర్ లెవల్స్ పెంచుకునేందుకు కేజ్రీవాల్ మామిడి పండ్లు, పూరీ, స్వీట్లు, తింటున్నారంటూ పెంచుకునేందుకు కోర్టులో ఇడి చేసిన వాదనను ఆమె ప్రస్తావిస్తూ కోర్టులో ఇడి పదేపదే అబద్ధాలు చెప్పిందని అన్నారు.

కేజ్రవీవాల్ జైలులో చక్కెర కలిపిన టీ తాగుతున్నారని, స్వీట్లు తింటున్నారని కోర్టులో ఇడి చెప్పిందని, ఇది పచ్చి అబద్ధమని ఆమె చెప్పారు. డాక్టర్ సూచించిన స్వీట్నర్‌తో స్వీట్లు, టీ తీసుకోవడానికి కోర్టు అనుమతించిందని ఆమె వివరించారు. తన సుగర్ లెవల్ పెంచుకోవడానికి కేజ్రీవాల్ అరటి పండ్లు తింటున్నారని ఇడి అసత్యాలు చెప్పిందని ఆమె తెలిపారు. అత్యవసర పరిస్థితులు ఎదురైనపుడు చాక్లెట్లు, అరటి పండ్లు అందుబాటులో ఉంచుకోవాలని డయాబెటిక్ రోగులకు డాక్టర్లే సూచిస్తారని ఆమె తెలిపారు. సీరియస్ డయాబెటిస్ ఉన్నవారికి హఠాత్తుగా సుగర్ లెవల్స్ పడిపోతాయని, అటువంటి పరిస్థితిలో ప్రాణానికే ప్రమాదమని ఆమె చెప్పారు.

పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ కేజ్రీవాల్‌కు ఇన్సులిన్‌ను, మందులను జైలు అధికారులు ఇవ్వడం లేదని ఆమె ఆరోపించారు. కేజ్రీవాల్‌కు ఇంటి భోజనం ఆపించేందుకు ఇడి, బిజెపి అసత్యాలను ప్రచారం చేస్తున్నాయని అతిషి ఆరోపించారు. ఇంటి భోజనం ఆగిపోతే తీహార్ జైలులో కేజ్రీవాల్‌కు ఎప్పుడు భోజనం పెడతారో ఎవరికీ తెలియకుండా పోతుందని, కేజ్రీవాల్ ప్రాణాలను తీయడానికే ఈ కుట్ర జరుగుతోందని ఆమె ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో మార్చిలో కేజ్రీవాల్‌ను ఇడి అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆయన తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News