Thursday, May 30, 2024

బిజెపి ఓట్లు కొంటుంది: మమత బెనర్జీ

- Advertisement -
- Advertisement -

ఓట్లు కొనుగోలు చేసేందుకు ప్రజలకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) డబ్బు చెల్లిస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) చీఫ్ మమతా బెనర్జీ బుధవారం ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి మితాలి బాఘ్‌కు మద్దతుగా ఆరామ్‌బాఘ్‌లో ఒక ఎన్నికల ర్యాలీలో మమతా బెనర్జీ ప్రసంగిస్తూ, వోట్ల కొనుగోలు నిమిత్తం ప్రజలకు కాషాయ పార్టీ రూ. 5000, రూ. 10 వేలు, రూ. 15 వేలు వరకు డబ్బు ఇస్తోందని ఆరోపించారు. ‘ప్రస్తుత బిజెపి నేతలు మాజీ సిపిఐ (ఎం) సంఘ విద్రోహులు. బీభత్స వాతావరణం రాకూడదని మీరు కోరుకుంటే బిజెపికి వోటు వేయకండి’ అని ఆమె అన్నారు. ఢిల్లీలో అధికార సమీకరణం మార్పునకే ఈ ఎన్నికలు అని మమత చెప్పారు. ‘ఢిల్లీలో అధికార సమీకరణాన్ని మార్చవలసి ఉంది. మార్పును తీసుకురావలసి ఉంది’ అని ఆమె సూచించారు. బెంగాల్ ప్రజలను‘అపఖ్యాతి పాల్జేసే’ అలవాటు బిజెపికి ఉందని ఆమె ఆరోపించారు.

‘తప్పుడు అత్యాచార ఆరోపణలు చేసేందుకు డబ్బు చెల్లించడం ద్వారా సందేశ్‌ఖాలి మహిళలను వారు ఏవిధంగా అవమానించారో చూడండి’ అని ఆమె అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో 26 వేల ఉద్యోగాలను బిజెపి లాక్కుందని కూడా మమత ఆరోపించారు. ‘కానీ నిజం నెగ్గింది. మంగళవారం సుప్రీం కోర్టు తీర్పు తరువాత ప్రస్తుతానికి ఆ ఉద్యోగాల పరిరక్షణ జరిగిందనే సంతృప్తి నాకు కలిగింది’ అనిఆమె చెప్పారు. బిజెపిపై మమత విమర్శలు కొనసాగిస్తూ, ప్రధాని నరేంద్ర మోడీ ఉదయంనుంచి రాత్రి వరకు అబద్ధాలు చెబుతూనే ఉంటారని ఆరోపించారు. ‘సిఎఎ, ఎన్‌ఆర్‌సి వినియోగంతో ప్రజలను బిజెపి సాగనంపుతుంది. మోడీ మళ్లీ అధికారంలోకి వచ్చినట్లయితే మైనారిటీలు, ఆదివాసీలు, ఒబిసిల ఉనికి సంక్షోభంలో పడుతుంది’ అని కూడా మమత ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News