Friday, March 29, 2024

బావమరిదిని హతమార్చిన బావ

- Advertisement -
- Advertisement -

Mother Murder By Son In Nizamabad

 

మన తెలంగాణ/జగిత్యాల : జగిత్యాల అర్బన్ మండలం అంబారిపేటలో బుధవారం రాత్రి తన స్వంత బావమరిదిపై బావ గొడ్డలితో దాడి చేసి హతమార్చాడు. అడ్డుకోబోయిన మరో ఇద్దరిపై కూడా దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలు కాగా, వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు, గ్రామస్థుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. అంబారిపేటకు చెందిన ఆది వెంకటేశ్‌కు జగిత్యాల రూరల్ మండలం పొలాసకు చెందిన గంగును ఇచ్చి వివాహం చేశారు. వారికి ఇద్దరు కుమార్తెలు పుట్టిన కొద్ది కాలం తర్వాత భార్య, భర్తల మధ్య మనస్పర్థలు రాగా, వెంకటేష్ మరో మహిళను రెండో వివాహం చేసుకున్నాడు.
ఈ విషయంలో పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరగ్గా మొదటి భార్య, ఇద్దరు కూతుళ్లకు తనకున్న ఏడెకరాల భూమిలో మూడున్నర ఎకరాలు ఇచ్చేందుకు వెంకటేష్ అంగీకరించి కూతుళ్ల పేరిట భూమిని పట్టా చేశాడు. అయితే పెళ్లీడుకొచ్చిన కూతురుకు వివాహం చేసేందుకు గంగు తన కూతురు పేరిట ఉన్న భూమిని విక్రయించింది.

తాను ఇచ్చిన భూమిని ఎలా విక్రయిస్తావంటూ.. రెండేళ్లుగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా.. గంగు తన పెద్ద కుమార్తె ప్రవళ్లికను పొలాసకు చెందిన రెంటం శంకర్‌కు ఇచ్చి వివాహం చేసేందుకు నిశ్చయించారు. గురువారం జగిత్యాల పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో వివాహం జరగాల్సి ఉండగా బుధవారం అంబారిపేటలో పెళ్లికి ముందు జరగాల్సిన కార్యక్రమాలను నిర్వహించేందుకు గంగుతో సహా బంధువులంతా అంబారిపేటకు చేరుకున్నారు. బుధవారం రాత్రి దుంపుడు గుంజ తీసుకొచ్చేందుకు బంధువులంతా కలిసి వెళ్తుండగా.. కాపుకాచిన గంగు భర్త వెంకటేశ్ గొడ్డలితో తన బావ మరిది, పొలాస పౌలస్తేశ్వర స్వామి ఆలయ చైర్మన్ శంకరయ్యపై గొడ్డలితో దాడికి దిగాడు. అడ్డుకోబోయిన శంకరయ్య తల్లి చిన్నక్కపైనా.. గ్రామానికి చెందిన గుగ్గిల్ల మల్లయ్యపై కూడా దాడి చేయడంతో వారు గాయపడ్డారు.

తీవ్ర గాయాల పాలైన ఆ ముగ్గురిని చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే శంకర్ మృతి చెందాడు. చిన్నక్క, మల్లయ్యల తలకు తీవ్ర గాయాలయ్యాయని, పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. హత్య సంఘటనతో తెల్లవారితే పెళ్లి జరగాల్సిన ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న జగిత్యాల టౌన్ సిఐ కిశోర్ ఆస్పత్రికి చేరుకుని సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు సిఐ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News