Thursday, April 25, 2024

ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన బిఆర్‌ఎస్ పార్టీ..

- Advertisement -
- Advertisement -

ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన బిఆర్‌ఎస్ పార్టీ
అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్ కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డి పేర్లను ఖరారు చేసిన సిఎం కెసిఆర్
ఈనెల 09వ తేదీన నామినేషన్లను దాఖలు చేయాలని అభ్యర్థులకు ముఖ్యమంత్రి సూచన
హైదరాబాద్: బిఆర్‌ఎస్ పార్టీ తమ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్ కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డి పేర్లను బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. ఈ నెల 9వ తేదీన నామినేషన్లు దాఖలు చేయాలని ఈ ముగ్గురు అభ్యర్థులకు కెసిఆర్ సూచించారు. నామినేషన్ల దాఖలుకు సంబంధించిన ఏర్పాట్లు చూసుకోవాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, బిఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డిని సిఎం కెసిఆర్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు గవర్నర్ ద్వారా నామినేట్ అయ్యే ఇద్దరి పేర్లను కేబినెట్ సమావేశం తర్వాత ప్రకటించనున్నట్టు తెలిసింది.

ఈనెల 23వ తేదీన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక
ఫిబ్రవరి 27వ తేదీన శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయ్యింది. ఈ నెల 29వ తేదీతో రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ మూడు స్థానాలు, ఏపిలోని 7 స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. రాష్ట్రంలో నవీన్ రావు, గంగాధర్ గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి పదవీకాలం ఈ నెల 29వ తేదీతో ముగియనుంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల అయింది. మార్చి 13 వరకు ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల దరఖాస్తుల పరిశీలన 14వ తేదీ వరకు ఉపసంహరణకు ఈ నెల 16వ తేదీ వరకు గడువు ఉంటుంది. మార్చి 23న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ నిర్వహిస్తారు. 23 వతేదీ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు ఓట్ల లెక్కింపు జరుగనుంది.

అభ్యర్థులకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా…
దేశపతి శ్రీనివాస్
తెలంగాణ కవి, గాయకుడైన దేశపతి శ్రీనివాస్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని మునిగడప గ్రామంలో స్వర్గీయ దేశపతి గోపాలకృష్ణ శర్మ, శ్రీమతి బాలసరస్వతి దంపతులకు 1970లో జన్మించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నాటి ఉద్యమ నాయకుడు, నేటి రాష్ట్ర సారథి సిఎం కెసిఆర్ నిర్వహించిన వేలాది సభలు, సమావేశాలు, ర్యాలీలో దేశపతి పాల్గొన్నారు. తెలంగాణా మలిదశ ఉద్యమంలో తన ఆట, పాట, ప్రసంగాలతో భావజాల వ్యాప్తికి కృషి చేశారు. రాష్ట్ర సాధన అనంతరం తన ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామా చేసి, ప్రస్తుతం సిఎం ఓఎస్‌డిగా పనిచేస్తున్నారు. దేశపతి కృషిని గుర్తించిన సిఎం కెసిఆర్ ఆయనకు శాసనమండలి అభ్యర్థిగా అవకాశమిచ్చారు.

కుర్మయ్యగారి నవీన్ కుమార్
హైదరాబాద్ కూకట్ పల్లికి చెందిన కుర్మయ్యగారి నవీన్ కుమార్ 1978 మే 15వ తేదీన జన్మించారు. వారి తల్లిదండ్రులు కొండల్ రావు, తిలోత్తమలు. నవీన్ కుమార్ తాత రామచంద్రరావు గతంలో మంత్రిగా పనిచేశారు. నవీన్ కుమార్ మేనమామ సుదర్శన్ రావు టిఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. విద్యార్థి దశ నుంచే నవీన్ కుమార్ కు రాజకీయాలంటే ఆసక్తి. 2001 నాటి జలదృశ్యం ఆవిర్భావ సభ మొదలుకొని టిఆర్‌ఎస్ నిర్వహించిన అన్ని సమావేశాల్లో నవీన్ క్రియాశీలంగా పనిచేశారు. వ్యాపారం, రాజకీయాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నవీన్ కుమార్ చురుగ్గా పాల్గొంటారు. కూకట్ పల్లి హైదర్ నగర్‌లో సొంత ఖర్చులతో వెంకటేశ్వర ఆలయాన్ని నవీన్ కుమార్ నిర్మించారు. ఆయన 2019 మే నెలలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈనెల 29వ తేదీన ఆయన పదవీకాలం పూర్తవుతుంది. ఈ క్రమంలో ఆయన సేవలను గుర్తించిన సిఎం కెసిఆర్ నవీన్ కుమార్‌కు మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు.

చల్లా వెంకట్రామిరెడ్డి
మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి మనవడు (కూతురి కొడుకు) చల్లా వెంకట్రామిరెడ్డి. తొలుత పుల్లూరు గ్రామ ప్రెసిడెంట్ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం చల్లా వెంకట్రామిరెడ్డి 2004 నుంచి 2009 వరకు అలంపూర్ ఎమ్మెల్యేగా పనిచేశారు. గతేడాది డిసెంబర్‌లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, సిఎం కెసిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలో చల్లా వెంకట్రామిరెడ్డికి సిఎం కెసిఆర్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా అవకాశమిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News