Monday, April 29, 2024

నాలుగు లోక్‌సభ స్థానాలకు బిఆర్‌ఎస్ అభ్యర్థులు ఖరారు

- Advertisement -
- Advertisement -

తొలి జాబితా ప్రకటించిన గులాబీ బాస్
కరీంనగర్ నుంచి బి.వినోద్ కుమార్
పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్
ఖమ్మం నుంచి నామ నాగేశ్వర్ రావు
మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత

కాంగ్రెస్ నేతలు వాళ్లల్లో వాళ్లే కొట్టుకుంటున్నారు
సర్కార్ తీరుపై ప్రజల్లో విసుగు ప్రారంభమైంది
రాజకీయాల్లో గెలుపోటములు సహజమే
ఎన్‌టిఆర్‌కు సైతం ఒడిదుడుకులు తప్పలేదు
రాబోయే కాలం బిఆర్‌ఎస్‌దే : కెసిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలలో నాలుగు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను బిఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. కరీంనగర్ నుంచి బి.వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, ఖమ్మం నుంచి నామ నాగేశ్వర్ రావు, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత పేర్లను బిఆర్‌ఎస్ అధినేత ఖరారు చేశారు. లోక్‌సభ ఎన్నికల కార్యాచరణలో భాగంగా రెండు రోజులుగా ఆయా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ముఖ్యనేతలతో కెసిఆర్ సమావేశమయ్యారు. సోమవారం ఖమ్మం, మహబూబాబాద్ నియోజకవర్గాల నేతలతో బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ భేటీ అయ్యారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, సీనియర్ నేత హరీశ్‌రావు, ఎంపీలు కేశవరావు,వద్దిరాజు రవిచంద్ర, నామ నాగేశ్వర రావు, మాలోతు కవిత, మాజీ మంత్రులు, ఎంఎల్‌ఎలు, మాజీ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

నియోజకవర్గాల పరిధిలోని ప్రజాప్రతినిధులు, మాజీలు, సీనియర్ నేతలతో కెసిఆర్ సమావేశమై లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికలకు భారత రాష్ట్ర సమితి మొదటి జాబితాను ప్రకటించారు. ఓటములకు కుంగిపోవాల్సిన అవసరం లేదని, అలా కుంగిపోయి ఉంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేవారమా అని బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమే అని, దివంగత ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్‌కు సైతం రాజకీయాల్లో ఒడిదుడుకులు తప్పలేదని వ్యాఖ్యానించారు.

ప్రభుత్వానికి ప్రతిపక్ష రుచి చూపిద్దాం
కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలనపై అవగాహన రావడం లేదని, సర్కార్ తీరుపై ప్రజల్లో విసుగు ప్రారంభమైందని బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ అన్నారు. కాంగ్రెస్ నేతలు వాళ్లలో వాళ్లే కొట్టుకుంటారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి, ఆరోపణలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. అంశాల కోసం మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదని, ప్రభుత్వమే మనకు ఎజెండా ఇస్తుందని చెప్పారు. ప్రభుత్వానికి ప్రతిపక్ష రుచి చూపుద్ధామని పిలుపునిచ్చారు. రాబోయే కాలం తమదేనని ధీమా వ్యక్తం చేశారు.

ఖమ్మంలో సభ పెట్టుకుందాం
కరీంనగర్ తర్వాత ఖమ్మంలో కూడా సభ పెట్టుకుందామని కెసిఆర్ తెలిపారు. ఖమ్మంలో అద్భుతమైన అభివృద్ధి చేశామని, కరీంనగర్ తర్వాత ఖమ్మంలో కూడా సభ పెట్టుకుందామని చెప్పారు. జిల్లాలో పార్టీ ఓడిపోయిందని ఎవరూ అధైర్యపడొద్దని, పార్టీ వీడి వెళ్లే నేతలతో బిఆర్‌ఎస్‌కు ఎలాంటి నష్టం లేదని పేర్కొన్నారు. నేతలు కలిసికట్టుగా పని చేసి, పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు. ప్రభుత్వానికి పాలనపై అవగాహన రావడం లేదు.ఈ క్రమంలోనే ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ముగ్గురితో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకోవాలని కెసిఆర్ సూచించారు. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, పార్థసారధి రెడ్డితో కలిసి ఎంఎల్‌ఎ పల్లా రాజేశ్వర్ రెడ్డి మహబూబాబాద్, ఖమ్మం నియోజకవర్గాలను సమన్వయం చేసుకోవాలని చెప్పారు. రెండు నియోజకవర్గాల సిట్టింగ్ ఎంపిలపై నేతల నుంచి కెసిఆర్ అభిప్రాయాలు తీసుకున్నారు. నామ నాగేశ్వర రావు, మాలోత్ కవిత అభ్యర్థిత్వాలపై సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News