Saturday, April 20, 2024

జర్నలిస్టులకు బిఆర్‌ఎస్ అండ

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ : రాష్ట్రంలోని ప్రతి జర్నలిస్టు కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉండేది బిఆర్‌ఎస్ ప్రభుత్వమేనని రాష్ట్ర అబ్కారీ, క్రీడలు,పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికీ కట్టుబడి ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ జర్నలిస్టులకు అన్ని విధాలా అండగా ఉండాలన్న లక్షంతో దేశంలో ఎక్కడా లేని విధంగా రూ. 100 కోట్లతో సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారన్నారు. శనివారం మంత్రి క్యాంపు కార్యాలయంలో 155 మంది జర్నలిస్టుల కుటుంబాలకు రెండు పడకల బెడ్ రూం పట్టాలను మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గతంలో జర్నలిస్టులకు ఇచ్చిన హామీ మేరకు ఇంత పెద్ద మొత్తంలో డబుల్ బెడ్ రూంల పట్టాలు పంపిణీ చేశామని తెలిపారు.

సమాజంలో జర్నలిస్టులు అంటే ఒక గౌరవం ఉందని, ఆ విలువను కాపాడుకోవాలని సూచించారు. ప్రభుత్వం చేసే మంచి పనులను ప్రజలు దృష్టికి తీసుకెళ్తూ, ఎక్కడైనా లోపాలు ఉంటే ప్రభుత్వ అధికారుల దృష్టికికాని, తన దృష్టికి కాని తీసుకురావాలని చెప్పారు అలా కాకుండా కేవలం నెగిటివ్ దృష్టితోనూ, దురుద్దేశ్యంతో వార్తలు రాస్తే వాటికి ప్రజల్లో ఆదరణ ఉండదని సూచించారు. తాను కూడా జర్నలిస్టుగా చదువుకున్నానని, తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల బాధలు తనకు తెలుసన్నారు. ఎంతో మంది జర్నలిస్టులు ఉదయం నుంచి రాత్రి దాక కష్టపడినా పూటగడవని ఎంతో మంది పేద జర్నలిస్టులు ఉన్నారన్నారు. కేవలం కలంనే నమ్ముకొని జీవిస్తున్న వాళ్లు ఉన్నారన్నారు. అలాంటి వారికి ఒక గూడు కల్పించాలన్న సంకల్పంతోనే జర్నలిస్టులకు డబుల్‌బెడ్ రూంలు పట్టాలు ఇస్తున్నామన్నారు.

ఎస్‌విఎస్ గుట్టపై ఉన్న వారికి డబుల్ బెడ్ రూంలకోసం రూ. 5 లక్షలు ప్రభుత్వం సహాయం చేస్తుందని వాటితో పాటు జర్నలిస్టులు కూడా కొంత నగదు వేసుకుంటే అద్భుతమైన ఇళ్లు నిర్మాణం అవుతాయన్నారు. ఈ ఇళ్లు పిల్లల భవిష్యత్‌కు అండగా ఉంటాయని మంత్రి తెలిపారు. పట్టాలు రాని వారు అధైర్య పడొద్దని వారికి మోనప్ప గుట్టలో ఇచ్చేందుకు ప్రతి పాదనలు సిద్ధ్దం చేయాలని ఎంఆర్‌ఒలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. జర్నలిస్టులు అందరూ తనకు సమానమేనని గుర్తు చేశారు. ఎంతో మందికి ఆరోగ్యం బాగా లేక పోతే వారికి తాను అండగా ఉండి ఆదుకున్నానని గుర్తు చేశారు. ప్రభుత్వం కూడా జర్నలిస్టులను కాపాడుకుంటుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కార్పోరేట్ ఆసుప్రతుల్లో కూడా జర్నలిస్టుల హెల్త్‌కార్డులు అమలు జరిగేలా త్వరలో ఉత్వర్వులు జారి చేసే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఉందన్నారు. అదే జరిగితే కార్పొరేట్ ఆసుపత్రుల్లో జర్నలిస్టులకు ఉచిత వైద్యం అందుతుందన్నారు.

పాలమూరు అభివృద్ధ్ది గురించి మీరే చూడండిగతంలో ఉన్న పాలమూరును, ఇప్పుడున్న పాలమూరును చూడండి.. మీకు అన్ని తెలుసు, మేధావులు.. ఇంత అభివృద్ధి ఎప్పుడైనా జరిగిందా మీరే ఆలోచించి ప్రజలకు చెప్పాలని మంత్రి కోరారు.నాకు మొదట్లో సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ నీకు హైదరాబాద్‌లో టికెట్ ఇస్తామని, మహబూబ్‌నగర్ వద్దని సూచించారన్నారు. అయితే నేను పట్టబట్టి తాను పుట్టిన నేలతల్లి పాలమూరు జిల్లా కోసం ఏదైనా చేయాలని తలంపుతో పట్టుబట్టి టికెట్ తెచ్చుకున్నాన్నారు. మొదటి ఎన్నికల్లో సిఎం చెప్పినట్లు 2500 మెజార్టీతోనే గెలిచానని, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడాలేని విధంగా ఇక్కడి ప్రజలు తనకు భారీ మెజార్టీతో గెలిపించారన్నారు. ఇదంతా ప్రజలకు తాను చేసిన సేవలే భాగమన్నారు. ప్రజలకు సేవ చేయడంలో తాను ఆ 24 గంటలు కృషి చేస్తానని ఇందులో ఎలాంటి దాపరికం లేదన్నారు. కానీ కొంత మంది కావాలని ,దురుద్దేశ్యంతో చెప్పుడు మాటలు విని తనపై చెడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారిపై దేవుడే చూసుకుంటారని ఆయన వాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పార్దసారధి,ఆర్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.

మంత్రికి ధన్యవాదాలు తెలిపిన యూనియన్లు
డబుల్ బెడ్ రూంల పట్టాలు పంపిణీ చేయడంపై టియుడబ్లుజె (ఐజెయు ) జిల్లా అధ్యక్షులు దండు దత్తేందర్, కార్యదర్శి బిజి.రామాంజనేయులు, టియుడబ్లుజె 143 జిల్లా అద్యక్షులు గోవర్దన్ గౌడ్, శేఖర్, శివ, టిజెఎఫ్ రాష్ట్ర నాయకులు బండి విజయ్‌కుమార్, అశోక్‌కుమార్, గోపాల్, సీనియర్ జర్నలిస్టులు బస్వారాజ్, సాంబశివారెడ్డి,వెంకటేష్,షమి,నరేందర్, ఎన్‌టివి బాషా,బాస్కర్, జక్కి,యాదగిరి తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News