Monday, April 29, 2024

మానవ, సిగ్నల్ ఇంటెలిజన్స్‌ను సేకరించిన కెనడా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, భారత్‌ల మధ్య ఉద్రిక్తతలకు కారణమైన విషయం తెలిసిందే. అయితే నిజ్జన్ హత్య కేసులో కెనడా మానవ, సిగ్నల్ ఇంటెలిజన్స్ సమాచారాన్ని సేకరించిందని అక్కడి దిన పత్రిక సిబిసి న్యూస్ కథనం ప్రచురించింది. ప్రభుత్వ వర్గాలనుంచి వచ్చిన సమాచారం ఆధారంగానే ఈ కథనం వెలువరించినట్లు ఆ పత్రిక చెబుతోంది. తమ ప్రభుత్వం వద్ద ఉన్న ఇంటెలిజన్స్‌లో కెనడాలోని భారత దౌత్య అధికారులు స్వయంగా పాల్గొన్న సంభాషణలున్నాయని ఆ కథనం పేర్కొంది.ఈ ఇంటెలిజన్స్ సమాచారం ఫైవ్ ఐస్ బృందం(ఈ బృందంలో కెనడా కాకుండా అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఉన్నాయి)లోని ఓ సభ్య దేశంనుంచి కెనడాకు వచ్చినట్లు ఆ పత్రిక తెలిపింది.ఆ తర్వాత కెనడా అధికారులు పలుమార్లు భారత్‌కు వచ్చి నిజ్జర్ హత్యకేసు దర్యాప్తులో సహకరించాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని కోరినట్లు వెల్లడించింది.

మరో వైపు ప్రైవేటు సంభాషణల్లో భారత దౌత్య అధికారులు ఎవరు కూడా ఈ ఆరోపణలను బలంగా ఖండించకపోవడం కూడా న్యూఢిల్లీ హస్తాన్ని సూచిస్తోందని సిబిసి కథనంలో పేర్కొంది. ముఖ్యంగా భారత దౌత్య అధికారులపై నిఘా వేసి ఈ ఇంటెలిజన్స్‌ను సేకరించినట్లు కెనడా దౌత్య అధికారి వెల్లడించారని అసోసియేటెడ్ ప్రెస్‌వార్తాసంస్థ (ఎపి) కథనంలో వెల్లడించింది. అయితే నిజ్జర్ హత్యకు సంబంధించి తన వద్ద ఉన్న సాక్షాధారాలేమిటో కెనడా ప్రభుత్వం ఇప్పటివరకు బైటపెట్టలేదు. దర్యాప్తు ప్రక్రియలో భాగంగా ఇవి బైటికి వస్తాయని మాత్రమే చెబుతోంది. మరోవైపు నిజ్జర్ హత్య కేసులో భారత్ హస్తంపందనడానికి బలమైన సాక్షాధారాలున్నాయని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గురువారం అన్నారు. ఐరాసలోని కెనడా దౌత్యబృందంతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కెనడా వ్యక్తిని కెనడా గడ్డపై చంపడంలో భారత్ పాత్ర ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News