Tuesday, April 30, 2024

ముడుపుల కేసులో మేఘాపై సిబిఐ ఎఫ్‌ఐఆర్

- Advertisement -
- Advertisement -

ఎలక్టొరల్ బాండ్ల కొనుగోలుదారుల్లో రెండవ పెద్ద సంస్థ ఎంఇఐఎల్
రూ. 966 కోట్ల మేరకు ఎలక్టొరల్ బాండ్లు కొన్న సంస్థ
బిజెపికి రూ. 586 కోట్ల మేరకు సంస్థ విరాళం
బిఆర్‌ఎస్‌కు రూ. 195 కోట్లు విరాళం

న్యూఢిల్లీ : ఒక ముడుపుల కేసులో హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఇఐఎల్)పై సిబిఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఎంఇఐఎల్ రూ. 966 కోట్లు విలువ చేసే ఎలక్టొరల్ బాండ్లు కొనుగోలు చేసిన రెండవ పెద్ద సంస్థ. జగదల్‌పూర్ సమీకృత ఉక్కు ప్లాంట్ పనులకు సంబంధించి రూ. 174 కోట్ల బిల్లులను ఆమోదించేందుకు మేఘా ఇంజనీరింగ్ సంస్థ నుంచి సుమారు రూ. 78 లక్షల మేరకు ముడుపులు అందుకున్నారనే ఆరోపణలపై ఎన్‌ఐఎస్‌పి, ఎన్‌ఎండిసి అధికారులు ఎనిమిది మంది అధికారులు, మెకాన్ అధికారులు ఇద్దరి పేర్లను కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినట్లు అధికారులు శనివారం వెల్లడించారు.

ఎన్నికల కమిషన్ (ఇసి) మార్చి 21న విడుదల చేసిన డేటా ప్రకారం, మేఘా ఇంజనీరింగ్ ఎలక్టొరల్ బాండ్లు కొనుగోలు చేసిన రెండవ పెద్ద సంస్థగా అవతరించింది. సంస్థ బిజెపికి దాదాపు రూ. 586 కోట్ల మేరకు విరాళం ఇచ్చింది. సంస్థ బిఆర్‌ఎస్‌కు రూ. 195 కోట్లు, డిఎంకెకు రూ. 85 కోట్లు, వైసిపికి రూ. 37 కోట్లు కూడా విరాళం ఇచ్చింది. సంస్థ నుంచి టిడిపికి రూ.25 కోట్లు, కాంగ్రెస్‌కు రూ. 17 కోట్లు అందాయి. జెడి (ఎస్), జనసేన పార్టీ, జెడి (యు) రూ. 5 కోట్లు నుంచి రూ. 10 కోట్ల మేరకు స్వల్ప మొత్తాలు అందాయి. శనివారం బహిర్గతం అయిన ఎఫ్‌ఐఆర్ ప్రకారం, సంస్థకు కేటాయించిన జగదల్‌పూర్ సమీకృత ఉక్కు ప్లాంట్‌లో ఇన్‌టేక్ వెల్, పంప్ హౌస్, క్రాస్ కంట్రీ పైప్‌లైన్‌కు సంబంధించిన రూ. 315 కోట్ల ప్రాజెక్టులో ముడుపులు అందుకున్నట్లు వచ్చిన ఆరోపణకు సంబంధించి నిరుడు ఆగస్టు 10న సిబిఐ ఒక ప్రాథమిక విచారణ (పిఇ)ని నమోదు చేసింది.

పిఇ నివేదిక ఆధారంగా ఆ ఆరోపిత ముడుపులపై ఒక రెగ్యులర్ కేసు నమోదు చేయాలని మార్చి 18న సిఫార్సు చేయడమైంది. కేసును మార్చి 31న నమోదు చేశారు. ఎన్‌ఐఎస్‌పి, ఎన్‌ఎండిసి లిమిటెడ్ అధికారులు ఎనిమిది మంది & విశ్రాంత ఇడి ప్రశాంత్ దాస్, డైరెక్టర్(ఉత్పత్తి) డికె మొహంతి, డిజిఎం పికె భూయాన్, డిఎం నరేష్ బాబు, సీనియర్ మేనేజర్ సుబ్రో బెనర్జీ, విశ్రాంత డిజిఎం (ఫైనాన్షియల్) ఎల్ కృష్ణమోహన్, జిఎం (ఫైనాన్స్) కె రాజశేఖర్, మేనేజర్ (ఫైనాన్స్) సోమ్‌నాథ్ ఘోష్ పేర్లను కూడా ఎఫ్‌ఐఆర్‌లో సిబిఐ చేర్చింది.

వారురూ. 73.85 లక్షల మేరకు లంచం తీసుకున్నారని ఆరోపణ. మెకాన్ లిమిటెడ్ అధికారులు ఇద్దరు, ఎజిఎం (కాంట్రాక్ట్) సంజీవ్ సహాయ్, డిజిఎం (కాంట్రాక్ట్) కె ఇళవరసు పేర్లను కూడా ఎఫ్‌ఐఆర్‌లో సిబిఐ చేర్చింది. మేఘా ఇంజనీరింగ్ ఎంఇఐఎల్ జనరల్ మేనేజర్ సుభాష్ చంద్ర సంగ్రాస్, గుర్తు తెలియని ఇతరుల వద్ద నుంచి 73 ఇన్‌వాయిస్‌లపై ఎన్‌ఎండిసి లిమిటెడ్ నుంచి ఎంఇఐఎల్‌కు రూ. 174.41 కోట్ల చెల్లింపునకు సంబంధించి రూ. 5.01 లక్షలను వారు అందుకున్నారని ఆరోపణ. చంద్ర, మేఘా ఇంజనీరింగ్‌లను కూడా ఈ కేసులో నిందితులుగా పేర్కొనడమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News