Wednesday, April 24, 2024

ఢిల్లీలో ఆప్ ప్రభుత్వానికి మరో చిక్కు!

- Advertisement -
- Advertisement -

CBI investigation in purchase of low floor buses

లోఫ్లోర్ బస్సుల కొనుగోలులో అవినీతిపై సిబిఐ విచారణ

న్యూఢిల్లీ : ఇప్పటికే మద్యం విధానంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ లోని ఆప్ ప్రభుత్వానికి మరో కొత్త చిక్కు వచ్చిపడింది. ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ కొనుగోలు చేసిన “లోఫ్లోర్ బస్సుల ” వ్యవహారంలో అవినీతి జరిగిందంటూ వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా ఆమోదం తెలిపినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. 2019 జులైలో 1000 లోఫ్లోర్ బస్సుల కొనుగోలుకు ఢిల్లీ ప్రభుత్వం బిడ్లు ఆహ్వానించింది. వాటి వార్షిక నిర్వహణకు సంబంధించిన ఒప్పందం కోసం 2020 మార్చిలో మరోసారి బిడ్ల దాఖలుకు అనుమతించింది. ఈ రెండు వ్యవహారాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఎల్‌జీకీ ఫిర్యాదు అందింది. బస్సుల కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించేందుకు వేసిన కమిటీకి ఛైర్మన్‌గా ఢిల్లీ రవాణా శాఖ మంత్రిని నియమించడం కూడా ఈ కుట్రలో భాగమేనని అందులో పేర్కొన్నారు.

అలాగే అవకతవకలకు సహకరిస్తారనే ఉద్దేశం తోనే డీఐఎంటీఎస్‌ను బిడ్ మేనేజ్‌మెంట్ కన్సల్టంట్‌గానూ నియమించినట్టు ఆరోపించారు. దీనిపై సంబంధిత ఢిల్లీ ప్రభుత్వ విభాగాల స్పందనను కోరుతూ జులై 22న ఫిర్యాదును ఎల్‌జీ కార్యాలయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపింది. దీనిపై రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఓపి అగర్వాల్ నేతృత్వంలో సీఎస్ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. వీరి విచారణ ఆధారం గానే లెఫ్టినెంట్ గవర్నర్ కు ప్రధాన కార్యదర్శి ఆగస్టు 22న నివేదిక పంపినట్టు పేర్కొన్నారు. ఆ తర్వాతే ఫిర్యాదును లెఫ్టినెంట్ గవర్నర్ సీబీఐకి పంపినట్టు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై ఇప్పటికే దర్యాప్తు సంస్థ ప్రాథమిక విచారణ జరుపుతున్నట్టు తెలిపాయి. దీంతో రెండింటినీ కలిపి దర్యాప్తు చేయాలని సక్సేనా సూచించినట్టు వెల్లడించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News