Saturday, April 20, 2024

రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతన బోనస్

- Advertisement -
- Advertisement -

Centre announces 78 days wages as bonus to railway employees

రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతన బోనస్
పిఎల్‌బి నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం
11 లక్షల మందికి పైగా సిబ్బందికి వర్తింపు
ఒక్కొక్కరికి గరిష్టంగా అందేది రూ 17వేలు
చమురు పిఎస్‌యులకు రూ 22000 కోట్ల ప్యాకేజీ
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 202122 ఆర్థిక సంవత్సరానికి 78 రోజుల వేతనాన్ని ఉత్పాదక బోనస్‌గా ప్రకటించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో సంబంధిత నిర్ణయానికి ఆమోదం తెలిపింది. కేబినెట్ భేటీ వివరాలను తీసుకున్న నిర్ణయాలను ఆ తరువాత కేంద్ర సమాచార ప్రసారాల మంత్రి అనురాగ్ ఠాకూర్ విలేకరులకు తెలిపారు. దీపావళికి ముందు రైల్వే ఉద్యోగులకు అందులోనూ నాన్ గెజిటెడ్ స్థాయి వారికి శుభవార్త అందిస్తున్నట్లు వీరికి ఉత్పాదక ఆధారిత బోనస్ (పిఎల్‌బి)ను ప్రకటిస్తున్నట్లు చెప్పారు. అర్హులైన రైల్వే ఉద్యోగులక ప్రతి ఏటా దసరా లేదా దీవాళి పూజల సెలవులకు ముందు పిఎల్‌బిని ప్రకటించడం ఆనవాయితీ. పిఎల్‌బి అంటే 75 రోజుల వేతన మొత్తంగా ఉంటుంది. ఈ ఏడాది కూడా ఈ మొత్తాన్ని ఉద్యోగులకు అందించనున్నారు. దీని మేరకు 11.27 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు ఈ బోనస్ అందుతుంది, అయితే గరిష్టంగా ఎక్కువలో ఎక్కువగా అందే మొత్తం రూ 17,951గా ఉంటుంది. ఈ మొత్తం వివిధ కేటగిరీల ఉద్యోగులకు చెల్లిస్తారు. ట్రాక్ నిర్వాహకులు, డ్రైవర్లు, గార్డులు, సూపర్‌వైజర్లు, టెక్నిషియన్లు, హెల్పర్లు, కంట్రోలర్లు, స్టేషన్ మాస్టర్లు, పాయింట్స్‌మెన్లు, మినిస్టిరియల్ సిబ్బంది, ఇతర గ్రూప్ సి సిబ్బందికి ఈ బోనస్ వర్తిస్తుంది. ఈ బోనస్ చెల్లింపులతో ప్రభుత్వానికి పడే ఆర్థిక భారం రూ 1,832.09 కోట్లుగా ఉంటుంది. రైల్వే ఉద్యోగులకు బోనస్ నిర్ణయాన్ని పలు ప్రతికూల ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ, కోవిడ్ అనంతర చిక్కులు తలెత్తినప్పటికీ తీసుకున్నట్లు మంత్రి వివరించారు. నిర్ధేశిత విధివిధానాల ప్రాతిపదికన లెక్కకట్టే మొత్తం కన్నా ఇప్పుడు చెల్లింపు జరిగే వాస్తవిక పిఎల్‌బి రోజుల సంఖ్య ఎక్కువ అని తెలిపారు. రైల్వేల పనితీరు మెరుగుదల విషయంలో ఉద్యోగులకు ప్రోత్సాహకంగా ఉత్పాదక ప్రాతిపదిక బోనస్ చెల్లింపుల విధానాన్ని ప్రవేశపెట్టారు.
చమురు రంగ సంస్థల ఊతానికి రూ 22,000 కోట్లు
పలు కారణాలతో ఆర్థిక చిక్కుల్లో పడ్డ ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు కేంద్రసాయం అందనుంది. 3 ప్రధాన పిఎస్‌యు చమురు సంస్థలకు ఒన్ టైం గ్రాంటుగా రూ 22,000 కోట్లను అందించే నిర్ణయానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. గత రెండు సంవత్సరాలుగా చమురు సంస్థలు నష్టాలను చవిచూస్తూ వస్తున్నాయి. వ్యయంతో పోలిస్తే ఈ కాలంలో వంటగ్యాసు ఎల్‌పిజి సిలిండర్లను తక్కువ ధరకు విక్రయించడం వల్ల తలెత్తిన ఆర్థిక నష్టాలను పూడ్చేందుకు చమురు సంస్థల బలోపేతానికి ఈ సాయం ప్రకటించినట్లు కేంద్ర మంత్రి ఠాగూర్ తెలిపారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ( బిపిసిఎల్), హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్) సంస్థలకు ఈ సాయం అందుతుంది. గత రెండేళ్లలో అంతర్జాతీయ స్థాయిలో వంటగ్యాసు ధరలు 300 శాతం పెరిగినా దేశీయ మార్కెట్‌లో ప్రభుత్వం ఖరారు చేసిన ధరలకే వినియోగదారుడికి అందించడం జరిగిందని మంత్రి తెలిపారు. నష్టాల భర్తీకి ఈ మూడు సంస్థలు ఈ మొత్తాన్ని వినియోగించుకోవల్సి ఉంటుంది. 2020 జూన్ నుంచి 2022 జూన్ వరకూ కాలంలో తలెత్తిన నష్టాలను పూడ్చుకోవల్సి ఉంటుంది. అంతర్జాతీయంగా వంటగ్యాసు ధరలు 300 శాతం వరకూ పెరిగినా ఇక్కడ వినియోగదారులపై దశలవారిగా విధించిన భారం మొత్తం 72 శాతంగానే ఉందని మంత్రి లెక్కలు తెలిపారు. సంబంధిత రాయితీల ప్రక్రియలతో ఈ మూడు పిఎస్‌యులు నష్టాలబాట పట్టాయి. ఇప్పుడు అందించేది ఒన్ టైం గ్రాంటుగా మంత్రి తెలిపారు. కేంద్ర మంత్రి మండలి మరికొన్ని నిర్ణయాలకు కూడా ఆమోదం తెలిపింది. గుజరాత్‌లోని టునా టెక్రా, దీన్‌దయాళ్ పోర్టులో రూ 4,243.64 కోట్ల వ్యయంతో కంటైనర్ టర్మినల్ అభివృద్ధి పనులను పిపిపి తరహాలో చేపట్టేందుకు వీలు కల్పించారు. సహకార రంగ వ్యవస్థలో మరింత పారదర్శకతకు ఉద్ధేశించిన మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీల చట్టానికి చేపట్టిన సవరణలకు కేంద్రం ఆమోదం తెలిపింది.

Centre announces 78 days wages as bonus to railway employees

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News