Friday, April 19, 2024

సాయం పేరుతో ఛీటింగ్

- Advertisement -
- Advertisement -

 

మనతెలంగాణ, హైదరాబాద్ : ఎటిఎం సెంటర్లకు వస్తున్న వారి దృష్టిమరల్చి కార్డులు కొట్టేసి డబ్బులు డ్రా చేస్తున్న యువకుడిని చిలకలగూడ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.31,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. నార్త్‌జోన్ ఎడిసిపి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. చిలకలగూడకు చెందిన బైక్ మెకానిక్ ఎండి సిద్దిఖ్ గత నెల 25వ తేదీన యూనియన్ బ్యాంక్ ఎటిఎంలో నుంచి డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లాడు. కార్డుతో డబ్బులు డ్రా చేసేందుకు యత్నించగా సర్వర్ డౌన్ అని వచ్చింది. దీంతో అక్కడే ఉన్న ఓ యువకుడు సాయం చేస్తానని చెప్పి బాధితుడి నుంచి కార్డు తీసుకుని వేరే కార్డును ఇచ్చాడు. దానిని తీసుకుని బాధితుడు ఇంటికి వచ్చాడు. గత నెల 27వ తేదీన బాధితుడి భార్య ఆసియా తబ్సుసం బ్యాంక్ పాస్‌బుక్ తీసుకుని బ్యాంక్‌కు వెళ్లింది.

తమ లావాదేవీలకు సంబంధించిన ప్రింట్ తీసుకోగా అందులో నుంచి రూ.5,000, రూ,10,000, రూ.10,000, రూ.6,000 డ్రా చేసినట్లు ఉంది. మొత్తం రూ.31,000 ఎటిఎం నుంచి తీసినట్లు ఉంది. వెంటనే చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేశారు. మహబూబాబాద్ జిల్లా, శ్రీరామభద్రన్న కాలనీకి చెందిన బానోతు రాజు అలియాస్ రాజుగా గుర్తించారు. రాజు కూలీ పనిచేస్తుంటాడు. వ్యసనాలకు బానిసగా మారిని రాజు ఎటిఎం కార్డులతో వచ్చిన వారిని మోసం చేసి డబ్బులు డ్రా చేస్తున్నాడు. ఇలాగే మోసాలు చేయడంతో వరంగల్, మహబూబాబాద్, చిలకలగూడలో పోలీసులు కేసులు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ నరేష్, ఎస్సై సాయికృష్ణ, తదితరలు పట్టుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News