వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం, యానివర్స్ బాస్ క్రిస్ గేల్ (Chris Gayle) గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఐపిఎల్లో ఎన్నో మరిచిపోలేని ఇన్నింగ్స్లు ఆడాడు గేల్. అందుకే అతడికి ఇండియాలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఐపిఎల్లో కోల్కతా నైట్రైడర్స్ తరఫున 2008లో అరంగేట్రం చేసిన గేల్, ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్(అప్పుడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్) జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. అయితే పంజాబ్ జట్టుతో ఉన్న సమయంలో తనను అగౌరవపరిచారని గేల్ వెల్లడించాడు.
ఇటీవల ఓ పాడ్క్యాస్ట్లో గేల్ మాట్లాడుతూ.. పంజాబ్ ఫ్రాంచైజీ కారణంగానే తాను త్వరగా ఐపిఎల్ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని తెలిపాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో తనని అగౌరవపరిచారని.. సీనియర్ ఆటగాడిగా తనకు ఇవ్వాల్సిన గౌరవం, మర్యాద ఇవ్వలేదని వాపోయాడు. ‘‘జట్టుతో పాటు లీగ్కే వన్నె తెచ్చిన నాలాంటి ఆటగాడితో అలా ఎవరూ వ్యవహరించలేదు. నన్ను చిన్నపిల్లాడిలా చూశారు. దీంతో నేను జీవితంలో తొలిసారి డిప్రెషన్లో వెళ్లే పరిస్థితి వచ్చింది. ఈ విషయం కుంబ్లేకి కూడా చెప్పాను. చెబుతూ గట్టిగా ఏడ్చేశాను. అతడు కూడా నన్ను నిరాశపరిచాడు. ఫ్రాంచైజీని యాజమాన్యం నడిపిస్తున్న తీరు నన్ను నిరాశపరిచింది’’ అని గేల్ పాడ్క్యాస్ట్లో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి తెలిపాడు.
ఆ తర్వాత కెప్టెన్గా ఉన్న కెఎల్ రాహుల్ తనక ఫోన్ చేసి తనని తర్వాతి మ్యాచ్కి సిద్ధంగా ఉండాలని చెప్పాడని.. కానీ తను ‘‘మీకు ఆల్ ది బెస్ట్’’ అని చెప్పి బ్యాగ్ సర్దుకున్నానని పేర్కొన్నాడు. అలా తాను ఫ్రాంచైజీ నుంచి బయటకు వచ్చానని వివరించాడు. ప్రస్తుతం గేల్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. గేల్ (Chris Gayle) ఆర్సిబి తరఫున చాలాకాలం ఆడాడు. ఈ ఏడాది ఆర్సిబి కప్పు కొట్టడంతో అతను జట్టు సభ్యులతో పాటు ఆనందంతో మైదానం మొత్తం తిరుగుతూ సందడి చేశాడు.
Also Read : ఆసియాకప్లో భారత్, పాక్ మ్యాచ్.. అంపైర్లగా ఎవరంటే..