Saturday, April 27, 2024

నేడు జనగామకు సిఎం

- Advertisement -
- Advertisement -
CM KCR Jangaon Tour
సమీకృత కలెక్టరేట్ భవనం, టిఆర్‌ఎస్ కార్యాలయం ప్రారంభించి భారీ బహిరంగ సభలో మాట్లాడనున్న ముఖ్యమంత్రి
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్
ఒకప్పటి కరవు సీమ జనగామలో కెసిఆర్ అద్భుత పాలన వల్ల
రెండు పంటలు పండుతున్నాయి, కేంద్రం హామీ ఒక్కటీ
నెరవేరలేదు, రాష్ట్రంపై దానికున్న అక్కసు ప్రధాని మోడీ మాటల్లో
వెల్లడైంది : మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతిరాథోడ్
రేపు యాదాద్రి జిల్లాలో సిఎం కెసిఆర్ పర్యటన

మన తెలంగాణ/హన్మకొండహైదరాబాద్: నేటి నుంచి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు జిల్లా పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం జనగామ జిల్లాతో తన పర్యటనలను ప్రారంభించనున్నారు. సిఎం స్వయంగా క్షేత్రస్థాయి పర్యటనలకు వస్తున్న నేపథ్యంలో అవసరమైన కసరత్తు కూడా పూర్తి అయింది. గత రెండు రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు, శాసనసభ్యులు, ఎంఎల్‌సిలు, స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు జిల్లా అధికార యంత్రాగమంతా సిఎం పర్యటనపై దృష్టి కేంద్రకరించింది. ఈ సందర్భంగా సిఎం చేపట్టనున్న అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇప్పటికే పలు జాగ్రత్తలు తీసుకున్నారు.

జిల్లా పర్యటన సందర్భంగా సిఎం కెసిఆర్ ముందుగా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం నూతనంగా నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొనే అవకాశముందని తెలుస్తోంది. తదనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభను ఉద్దేశించి సిఎం కెసిఆర్ ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో లక్షమందికి తగ్గకుండా జనసేకరణ చేసే పనిలో ఇప్పటికే ఉమ్మడి జిల్లా మంత్రులు నిమగ్నయయ్యారు. ఈ అంశాన్ని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌లు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సిఎం కెసిఆర్ ముందు తమ పరపతిని మరింతగా పెంచుకునేందుకు భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. ఇందులో భాగంగా మండలాలు, గ్రామాలు, పట్టణాల వారిగా జనాలను తరలించాల్సిన సంఖ్యపై ఇప్పటికే పార్టీ నేతలకు వారి దిశానిర్ధేశం చేశారు. కాగా బహిరంగ సభకు పెద్దఎత్తున జనసమీకరణ జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు సైతం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం టిఆర్‌ఎస్, బిజెపి పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో జిల్లాల్లో బిజెపి నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు.

మొట్ట మొదటి జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం

రాష్ట్రంలోని ముప్పైమూడు జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మితం అవుతున్నాయి. ఇందులో ఇప్పటికే దాదాపు ముప్పై జిల్లాలో ఈ నిర్మాణ పనులు కూడా పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో మొట్టమొదటి జిల్లా కార్యాలయం ప్రారంభోత్సం సిఎం కెసిఆర్ చేతుల మీదుగా జనగామలో జరుగుతుండడం విశేషం. కాగా ఈ కార్యక్రమానికి వస్తున్న సిఎం కెసిఆర్‌ను జిల్లా ప్రజల ప్రక్షాన ఘనంగా స్వాగతం పలుకనున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. గతంలో చెరువులు,బావులు ఎండి పోయాయి… కరువు జిల్లాగా ఉండేదన్నారు. కానీ మిషన్ భగీరథ, దేవాదుల ద్వారా తాగునీరు, సాగునీరు పుష్కలంగా వస్తోందన్నారు. ఇదంతా కెసిఆర్ పుణ్యమేనని అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాక సందర్భంగా పెద్దఎత్తున స్వాగత ఏర్పాట్లు చేశామన్నారు.

రేపు యాదాద్రి జిల్లాలో పర్యటన

జిల్లాల పర్యటనలో భాగంగా శనివారం సిఎం కెసిఆర్ యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ ఏర్పాట్లను మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ జిల్లాలో కూడా పలు అభివృద్ధి పనులను సిఎం కెసిఆర్ ప్రారంభించనున్నారు.

రాష్ట్రంలో అప్పడే మొదలైన రాజకీయ వేడి

సిఎం కెసిఆర్ జిల్లాల పర్యటనలపై రాష్ట్ర రాజకీయాల్లో అప్పుడే వేడి మొదలైంది. ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. సాధారణ ఎన్నికలకు దాదాపు రెండు సంవత్సరాల వ్యవధి ఉంది. ఈ సమయంలో సిఎం కెసిఆర్ అప్పుడే జిల్లా పర్యటనలకు శ్రీకారం చుట్టడంలో ఉన్న మర్మం ఏమిటన్న? అన్న అంశంపై విపక్షాలు అప్పుడే ఆరా తీసే పనిలో నిమగ్నమయ్యాయి. కెసిఆర్ రాజకీయ వ్యూహాలు…తీసుకునే నిర్ణయాలు ఒక పట్టాన ఎవరికి అంతుచిక్కవు. ఆ స్థాయిలో వ్యూహాలను రచించడంలో కెసిఆర్‌కు మించిన నాయకుడు మరోకరు లేరు. అందుకే కెసిఆర్ జిల్లా పర్యటనలపై విపక్షాలన్నీ డేగాకన్నుతో పహారా కాస్తున్నట్లుగా తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News