Monday, June 17, 2024

నిమ్స్ వైద్య బృందానికి సిఎం రేవంత్ రెడ్డి అభినందనలు

- Advertisement -
- Advertisement -

భవిష్యత్‌లో నిమ్స్ మరింత విస్తృతంగా
వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి సూచన

మనతెలంగాణ/హైదరాబాద్: గిరిజన యువకుడికి ఛాతీభాగంలో దిగిన బాణాన్ని చాకచక్యంగా, అత్యంత నిపుణతతో తొలగించిన నిమ్స్ వైద్య బృందానికి సిఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్‌లో నిమ్స్ మరింత విస్తృతంగా వైద్య సేవలు అందించాలని రేవంత్‌రెడ్డి కోరారు. నిమ్స్ ఆసుపత్రి వైద్యులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ప్రశంసించారు. సామాన్య ప్రజల్లో నిమ్స్ దవాఖానా పట్ల ఉన్న నమ్మకాన్ని మరోమారు రుజువు చేశారని ముఖ్యమంత్రి కితాబిచ్చారు. భవిష్యత్‌లో నిమ్స్ మరింత విస్తృతంగా వైద్య సేవలు అందించాలని, పేదల దేవాలయంగా పేరు తెచ్చుకోవాలని సిఎం రేవంత్ ఆకాంక్షించారు.

ప్రమాదవశాత్తు శరీరంలోకి బాణం….

ప్రమాదవశాత్తు ఛాతీలో దిగిన బాణంతో దాదాపు 24 గంటలు విలవిలలాడుతూ నరకయాతన అనుభవించిన ఆదివాసీ యువకుడికి నిమ్స్ వైద్యులు శస్త్ర చికిత్స చేసి ప్రాణం పోశారు. ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన సోది నంద అనే 17 ఏళ్ల యువకుడికి వారం రోజుల క్రితం ప్రమాదవశాత్తు శరీరంలోకి బాణం దిగింది. ఆ బాణం సరిగ్గా గుండె, ఊపిరితిత్తుల మధ్య దిగటంతో సోది నందను కుటుంబ సభ్యులు భద్రాచలం ఆసుపత్రికి, ఆ తర్వాత వరంగల్ ఎంజీఎంకు తీసుకువెళ్లారు. అయితే పరిస్థితి విషమించటంతో ఎంజీఎం వైద్యులు బాధితుడిని నిమ్స్ ఆసుపత్రికి పంపగా, ఇక్కడి కార్డియోథొరాసిక్ విభాగాధిపతి డాక్టర్ అమరేశ్వరరావు బృందం శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడింది. డాక్టర్లు తొలుత సిటీ స్కాన్ తీశారు. లంగ్స్ పక్క నుంచి గుండెలోని కుడి కర్ణికలోకి బాణం గుచ్చుకున్నట్లు గుర్తించారు. అప్పటికే తీవ్రంగా రక్తస్రావమైంది. దీంతో ఒకవైపు బ్లడ్ ఎక్కిస్తూనే నాలుగు గంటలపాటు సంక్లిష్టమైన శస్త్రచికిత్స చేసి బాణాన్ని తొలగించారు. అది చొచ్చుకుపోయిన చోట రక్తస్రావమై గడ్డకట్టడంతో ప్రాణాపాయం తప్పిందని వైద్యులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News