మాజీ సిఎం, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. “నేేను అసెంబ్లీకి రాను.. పిల్లల్ని పంపిస్తా” అని కెసిఆర్ అంటున్నారని.. మరి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం ఎందుకు? అని ప్రశ్నించారు. ఫౌంహౌస్లో పడుకుని ఏం సందేశం ఇస్తున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉంటే చెలాయిస్తాం.. లేదంటే అసెంబ్లీకే రాను అంటే ఎట్లా? అని దుయ్యబట్టారు. బిఆర్ఎస్ 25 ఏళ్ల విజయోత్సవ సభ చేసుకుంటామంటే సహకరించామని..కానీ, కెసిఆర్ తన విద్వేషపూరిత ప్రసంగంతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నాడని ఫైరయ్యారు.
“మీ పార్టీకి వందల కోట్ల డబ్బు, ఫాంహౌస్లు ఉన్నాయన్నమాట నిజం. ప్రభుత్వ జీతభత్యాలు తీసుకుంటూ విధులు నిర్వర్తించకపోవడం ఎలా సమర్థించుకుంటారు?. జీతాలు తీసుకుని పనిచేయకపోవడం ఏ చట్టంలో ఉంది?. ప్రతిపక్ష బాధ్యత నిర్వర్తించకుండా ఫాంహౌస్లో ఎందుకు పడుకుంటున్నారు?. పదేళ్లు మేమే అధికారంలో ఉంటాం.. పదేళ్లు నువ్వు ఫాంహౌస్లోనే ఉంటావు” అని సీఎం రేవంత్ అన్నారు.