Wednesday, July 9, 2025

యూరియా కోటాను పెంచండి.. నడ్డాకు సిఎం రేవంత్ వినతి

- Advertisement -
- Advertisement -

దేశీయంగా ఉత్పత్తి అయిన యూరియా కోటాను పెంచండి..
రాష్ట్రానికి కేటాయించిన యూరియాను సకాలంలో సరఫరా చేయండి
కేంద్ర మంత్రి నడ్డాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర అవసరాలకు కేటాయించిన యూరియాను సకాలంలో సరఫరా చేయాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జెపి నడ్డాకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్రమంత్రిని ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం కలిశారు. వానాకాలం సీజన్‌కు సంబంధించి ఏప్రిల్, జూన్ నెలల మధ్య 5 లక్షల మెట్రిక్ టన్నులకు గాను కేవలం 3.07 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేశారని కేంద్ర మంత్రి దృష్టికి సిఎం తీసుకెళ్లారు. రాష్ట్రంలో ప్రాజెక్టులకు నీరు రావడం, సాగు పనులు జోరుగా జరుగుతున్నందున యూరియా సరఫరాలో ఆటంకాలు తలెత్తకుండా చూడాలని సిఎం రేవంత్ కోరారు.

జూలై నెలకు సంబంధించి 63 వేల మెట్రిక్ టన్నులు దేశీయంగా ఉత్పత్తి అయిన యూరియా, 97 వేల మెట్రిక్ టన్నుల విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న యూరియా రాష్ట్రానికి సరఫరా చేయాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం 29 వేల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే చేశారని కేంద్ర మంత్రికి సిఎం తెలిపారు. దేశీయంగా ఉత్పత్తి అవుతున్న యూరియా కోటాను తెలంగాణకు పెంచాలని సిఎం కోరారు. యూరియా సరఫరాకు సంబంధించి రైల్వే శాఖ తగిన రేకులు కేటాయించడం లేదని వాటి సంఖ్య పెంచాలని సిఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ క్రీడా సలహాదారు ఎపి జితేందర్ రెడ్డి, ఎంపిలు డాక్టర్ మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, కేంద్ర పథకాల సమన్వయ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News