Saturday, July 27, 2024

మూడు జోన్లుగా అభివృద్ధి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజిస్తున్నామని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మొదటిది ఔటర్ రింగ్ రో డ్డు పరిధిలో ఉన్న అర్బన్ తెలంగాణ ప్రాంతం. రెండోది ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ప్రాంతం సబ్ అర్బన్ తెలంగాణ. మూడోది రీజనల్ రింగ్ రో డ్డు నుంచి తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల వరకు ఉన్నది గ్రామీ ణ తెలంగాణగా నిర్ధారించామని సిఎం రేవంత్ తెలిపారు. మూడు జోన్‌లలో ఎక్కడ ఎలాంటి అభివృద్ధి జరగాలన్నది, ఎక్కడ ఏ రకమైన మౌలిక సదుపాయాల కల్పన జరగాలన్నది ఈ మెగా ప్రణాళికలో స్పష్టంగా ప్రకటిస్తామన్నారు. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి పట్టాభిషే కం జరిగి దశాబ్ద కాలం పూర్తయ్యిందని, రాష్ట్ర సాధన కో సం ప్రాణాలు అర్పించిన అమరులకు ప్రతి ఒక్కరూ ఘన నివాళి అర్పించాలని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆరు దశాబ్దాల మన కలను నిజం చేసిన నాటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, నాటి యూపిఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీలకు తెలంగాణ సమాజం తరపున ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేశారు.

ఆదివారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన వేడుకల్లో సిఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తొ లుత పోలీసుల గౌరవ వందనాన్ని సిఎం అందుకున్నారు. తర్వాత ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని ‘జై తెలంగాణ’ అంటూ ప్రారంభించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్స వం సందర్భంగా ఉదయం తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పించారు. అక్కడి నుంచి పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగిన వేడుకల్లో పాల్గొని ఆయన మాట్లాడుతూ నాలుగు కోట్ల ప్రజల హృదయాలు ఆనందంతో ఉప్పొంగే పర్వదినం ఇది అ న్నారు. తెలంగాణ చరిత్ర పుటల్లో ముగ్గురు మహిళలకు ప్రత్యేక స్థా నం ఉందన్నారు. అందులో మొట్ట మొదటి త్యాగం, సాహసం సోనియాగాంధీదని ఆయన అన్నారు. ఆనాడు యూపిఏ చైర్ పర్సన్‌గా ఉక్కు సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ఆమె ముందుకు తీసుకెళ్లారన్నారు. బాబు జగ్జీవన్ రామ్ కూతురు మీరాకుమారి అప్పుడు లోక్‌సభ స్పీకర్ కాగా, ఒక మహిళగా కన్న తల్లిగా పిలల్లను కోల్పోతే ఒక ఆవేదన ఎట్లుందో తెలిసిన అమ్మగా మీరా కుమారి ఆరోజు సంపూర్ణమైన సహకారాన్ని అందించారన్నారు.

తెలంగాణ బిల్లును లోక్ సభలో ఆమోదించడంలో అత్యంత కీలకమైన బాధ్యతను ఆమె పోషించారన్నారు. ఆ నాడు భారతీయ జనతాపార్టీ నాయకురాలు సుష్మాస్వరాజ్ లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలిగా సంపూర్ణ సహకారం అందించారని సిఎం రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణ బిల్లు ఆమోదించటంలో రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో తన సంపూర్ణ సహకారాన్ని అందించారని ఆయన తెలిపారు. ఈ ముగ్గురు మహిళా నేతలు చేసిన త్యాగాలు, అందించిన సహకారం తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరిచిపోదన్నారు. తెలంగాణ నలుమూలల నుంచి తరలివచ్చిన వేలాదిమంది అడబిడ్డల సాక్షిగా సోనియాగాంధీకి, మీరా కుమారి, సుష్మాస్వరాజ్‌కు, తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆయన తెలిపారు. తెలంగాణ చరిత్ర పుటల్లో మీ త్యాగానికి, మీరు తీసుకున్న గొప్ప నిర్ణయాలకు ప్రత్యేక స్థానం ఉంటుందని సిఎం రేవంత్ పేర్కొన్నారు.

అన్యాయం జరిగితే తిరగబడే నైజం మనది
బానిసత్వాన్ని తెలంగాణ భరించదన్నారు. ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడం మన తత్వమన్నారు. ఆకలినైనా భరిస్తాం కానీ, స్వేచ్ఛను హరిస్తే సహించమన్నారు. దాశరథి చెప్పినట్టు తెలంగాణ అమాయకపు నెరజాణే కానీ, అన్యాయం జరిగితే తిరగబడే నైజం కూడా మనకు ఉందన్నారు. సంక్షేమం ముసుగులో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టాలని చూస్తే తెలంగాణ భరించదన్నారు. డిసెంబర్ 7, 2023వ తేదీ న ప్రారంభమైన ప్రజా పాలనలో స్వేచ్ఛ పునరుద్ధరణకు మొదటి ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ముళ్ల కంచెలు, ఇనుప గోడలు తొలగించామని, పాలకులు, పాలితుల మధ్య గోడలు బద్ధలు కొట్టామన్నారు.

మున్సిపల్ కౌన్సిలర్ నుంచి ముఖ్యమంత్రి వరకు…
మున్సిపల్ కౌన్సిలర్ నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రజలకు అందుబాటులో ఉండే పాలన తెచ్చామని సిఎం రేవంత్ తెలిపారు. మేం సేవకులం తప్ప పాలకులం కాదన్న నిజాన్ని నిరూపించామన్నారు. ప్రగతి భవన్‌ను మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌గా పేరు మార్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. అక్కడ ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. సచివాలయంలోకి ఈ రోజు సామాన్యుడు కూడా రాగలిగే పరిస్థితి తెచ్చామన్నారు. ఇందిరాపార్కులో ధర్నాచౌక్ కు అనుమతి ఇచ్చామన్నారు. మీడియాకు స్వేచ్ఛను ఇచ్చామని ప్రతిపక్షానికి గౌరవం ఇచ్చామన్నారు. మా నిర్ణయాల్లో లోటుపాట్ల సమీక్షకు అవకాశం ఇస్తున్నామన్నారు. తప్పులు జరిగితే సరిదిద్దుకోవ డానికి సిద్ధంగా ఉన్నామన్నారు. మేమే సర్వజ్ఞానులం అన్న భ్రమలు లేవని, అందరి సలహాలను, సూచనలను స్వీకరించి, చర్చించి ముందుకు వెళుతున్నామన్నారు.

అమరుల ఆశయాలు సాధించినప్పుడే తెలంగాణకు సార్థకత
ప్రజలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు ఇవ్వాలన్నది తమ ప్రభుత్వ ప్రాధాన్యతగా సిఎం రేవంత్ అభివర్ణించారు. జూన్ 2, 2014 నాడు తెలంగాణ భౌగోళిక ఆకాంక్ష నెరవేరిందని, అంతటితో మనం లక్ష్యాన్ని చేరినట్టు కాదన్నారు. ఉద్యమ లక్ష్యాలు, అమరుల ఆశయాలు సాధించిన నాడే తెలంగాణ సాధనకు సార్థకత వస్తుందన్నారు. దశాబ్ద కాలం అన్నది ఒక మైలురాయిగా ఆయన పేర్కొన్నారు. ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేర్చడంలో మనం ఎక్కడ ఉన్నాం అన్నది సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

పదేళ్ల పాలనలో తెలంగాణ వందేళ్ల విధ్వంసం
నేను రాజకీయ విమర్శల జోలికి పోను కానీ, చరిత్రను సమీక్షించుకున్నప్పుడే భవిష్యత్‌కు పునాదులు వేసుకోగలమన్నారు.
తప్పొప్పులను గుర్తించి, దిద్దుబాటు చేసుకోవడం విజ్ఞుల లక్షణమన్నారు. పదేళ్ల పాలనలో తెలంగాణ వందేళ్ల విధ్వంసానికి గురయ్యిందన్నారు. భౌతిక విధ్వసం మాత్రమే కాదు. తెలంగాణ మూల స్వభావమైన స్వేచ్ఛపై దాడి జరిగిందన్నారు. సామాజిక న్యాయం మేడిపండు చందంగా మారిందన్నారు. ప్రజలకు చెందాల్సిన రాష్ట్ర సంపద గుప్పెడు మంది చేతుల్లోకి చేరిందన్నారు. తెలంగాణ సంస్కృతి – సంప్రదాయాలు విధ్వంసానికి గురయ్యాయన్నారు. ఆర్థిక విధ్వంసం సంగతి చెప్పనక్కర్లేదని, ఇది గతమని, ప్రజలే, ప్రజల కోసం, ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వం ఇప్పుడు తెంగాణలో ఉందన్నారు. ప్రజా ప్రభుత్వంలో జరుపుకుంటున్న మొదటి ఆవిర్భావ దినోత్సవం ఇదన్నారు. అందుకే ఈ ఆవిర్భావ దినోత్సవానికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు.

మాతృ సమానురాలైన సోనియాను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించాం…
తెలంగాణ ప్రధాత, మనకు మాతృ సమానురాలైన సోనియాగాంధీని ఈ పండుగకు ప్రత్యేక అతిథిగా ఆహ్వానించామన్నారు. ఏ హోదాలో సోనియాగాంధీని ఆహ్వానించారని అడుగుతున్నారన్నారు. బిడ్డ ఇంట్లో శుభకార్యానికి తల్లికి హోదా కావాలా, తల్లిని ఆహ్వానించడానికి బిడ్డకు ఒకరి అనుమతి అవసరమా?! అని సిఎం రేవంత్ ప్రశ్నించారు. ఏ హోదా ఉందని, ఏ పదవిలో ఉన్నారని మహాత్మా గాంధీని మనం జాతిపితగా గుర్తించుకున్నాం?! తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు సోనియాగాంధీని ఈ సమాజం తల్లిగా గుర్తించి, గౌరవిస్తుందన్నారు. ఈ గడ్డతో ఆ తల్లి బంధం రాజకీయాలకు అతీతమన్నారు.

సాంస్కృతిక పునరుజ్జీవనం, ఆర్థిక పునరుజ్జీవనం
దశాబ్ది ఉత్సవాల శుభ సందర్భంలో అమరుల ఆశయాలు, ప్రజల కలలు నెరవేర్చే దిశగా ప్రజా ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుందని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సాంస్కృతిక పునరుజ్జీవనం, ఆర్థిక పునరుజ్జీవనం ఈ రెండు ఇప్పుడు తెలంగాణ భవిష్యత్ నిర్మాణానికి కీలకాంశాలుగా మారాయన్నారు. అందులో భాగంగా మన ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. ఏ జాతికైనా తన సంస్కృతే తన అస్థిత్వమన్నారు. ఆ సంస్కృతిని కాపాడటం ప్రభుత్వాల బాధ్యత అని ఆయన తెలిపారు. బోనం నుంచి బతుకమ్మ వరకు సాయుధ పోరాటం నుంచి స్వరాష్ట్ర ఉద్యమం వరకు మన సంస్కృతీ, మన చరిత్ర గొప్పవన్నారు. సమ్మక్క సారలమ్మ నుంచి జోగులాంబ వరకు భద్రాద్రి రాముడు నుంచి కొమురం భీం వరకు, అమరుల త్యాగాలు, హక్కుల ఉద్యమాల వంటి వాటితో తెలంగాణ గొప్ప చారిత్రక వారసత్వాన్ని కలిగి ఉందన్నారు. సంస్కృతికి, చరిత్రకు పునరుజ్జీవనం జరగాలని ఆయన సూచించారు.

పదేళ్లైనా ఇప్పటికీ మనకు రాష్ట్ర గీతం లేదు…
తెలంగాణ వచ్చి పదేళ్లైనా ఇప్పటికీ మనకు రాష్ట్ర గీతం లేదన్నారు. ఉద్యమ కాలంలో ఉవ్వెత్తున స్ఫూర్తిని రగిలించిన జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం గేయమే మన రాష్ట్ర అధికార గీతం కావాలని ఆనాడు ఆశించామని సిఎం రేవంత్ తెలిపారు. సహజ కవి అందెశ్రీ రచించిన ఈ గేయం మన రాష్ట్ర గేయంగా ఉంటుందని విశ్వసించామన్నారు.
ప్రజల ఆకాంక్షల మేరకు ఈ పర్వదినాన జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా సగర్వంగా ప్రకటిస్తున్నామని ఆయన తెలిపారు. చిహ్నం ఒక జాతి చరిత్రకు అద్దంపడుతుందని సిఎం రేవంత్ తెలిపారు. జాతి చరిత్ర మొత్తం నిక్షిప్తమై ఉండేది చిహ్నంలో మాత్రమేనని, తెలంగాణ అంటే ధిక్కారం, పోరాటమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర అధికారిక చిహ్నంలో అది ప్రతిబింబించాలని, ఆ దిశగా ప్రజా ప్రభుత్వం నూతన చిహ్నాన్ని రూపొందించే పనిలో ఉందన్నారు.

సూచనలు, సలహాలు పరిగణనలోకి తీసుకొని నూతన చిహ్నాం
వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలు, సలహాలు పరిగణనలోకి తీసుకొని నూతన చిహ్నాన్ని రూపొందించే పనిలో ఉన్నామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఉద్యమ సమయంలో ప్రజలు టిజి అనే ఇంగ్లీషు అక్షరాలను తెలంగాణకు సంక్షిప్త అక్షరాలుగా నిర్ధారించామన్నారు. యువత తమ గుండెలపై టిజిని పచ్చబొట్లుగా పొడిపించుకున్నారని సిఎం రేవంత్ తెలిపారు. వారి ఆకాంక్షల మేరకు టిఎస్ స్థానంలో టిజి ని పునరుద్ధరిస్తు ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. తెలంగాణ తల్లి నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షల ప్రతిరూపంగా ఉండాలని సిఎం రేవంత్ తెలిపారు. ఆ తల్లిని చూస్తే మన కన్నతల్లి యాదిలోకి రావాలన్నారు.

తెలంగాణ తల్లి కష్టజీవి, కరుణామూర్తి
సగటు తెలంగాణ గ్రామీణ మహిళ రూపమేనని, తెలంగాణ తల్లి ప్రతిరూపంగా ఉండాలని సిఎం రేవంత్ అన్నారు. తెలంగాణ తల్లి కష్టజీవి, కరుణామూర్తి అని, ఈ రూపురేఖలతో తెలంగాణ తల్లి రూపానికి పునరుజ్జీవనం జరగాలన్నారు. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి త్వరలో రూపుదిద్దుకుంటుందని సిఎం రేవంత్ పేర్కొన్నారు. ఈ నిర్ణయాలు ఎవరికీ వ్యతిరేకం కాదని, ఒక జాతి ఆకాంక్షలకు ప్రతిరూపం మాత్రమేనని ఆయన తెలిపారు. మేం అధికారం చేపట్టేనాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విధ్వంసమయ్యిందన్నారు. 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో తెలంగాణ ఉందని, శాసనసభలో శ్వేతపత్రం పెట్టి వాస్తవాలు ప్రజల ముందు ఉంచామన్నారు.

గ్రీన్ తెలంగాణ 2050 మాస్టర్ ప్లాన్ తయారు…
రాష్ట్ర సంపద పెంచి, పేదలకు పంచడానికి ఆర్థిక పునరుజ్జీవనం జరగాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. కఠినమైన ఆర్థిక క్రమ శిక్షణ పాటిస్తూనే సంక్షేమం, అభివృద్ధిలో రాజీ పడటం లేదని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మొదటి తేదీనే వేతనాలు చెల్లిస్తున్నామని ఆయన తెలిపారు. స్వల్పకాలిక ఆలోచనలు కాదు దీర్ఘ కాలిక ప్రణాళికలతో భవిష్యత్ కు పునాదులు వేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మొత్తం తెలంగాణకు గ్రీన్ తెలంగాణ 2050 మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నామన్నారు.

ఉపాధి కల్పన జోన్‌గా మూసీ సుందరీకరణ
మూసీ సుందరీకరణ పథకం ద్వారా పరీవాహక ప్రాంతాన్ని ఉపాధి కల్పన జోన్‌గా తీర్చిదిద్దబోతున్నామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ పథకానికి ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించామని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను ఈ పథకం మరోస్థాయికి తీసుకువెళ్లుతుందనడంలో సందేహం లేదని ఆయన తెలిపారు. పర్యాటకం, ఆర్థికం, పర్యావరణం ఈ మూడు కోణాలు ఇందులో ఉన్నాయి. ఎగువన ఉన్న ఉమ్మడి రంగారెడ్డి, దిగువన ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలలో సాగునీటి వనరుగా కూడా మూసీ ఉపయోగపడుతుందన్నారు.

ఆర్‌ఆర్‌ఆర్ త్వరితగతిన పూర్తి
ప్రజల అవసరాలకు తగ్గట్టు మెట్రో విస్తరణ ప్రణాళికను ప్రకటించామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డు త్వరితగతిన పూర్తికి ప్రయత్నిస్తామన్నారు. తక్కువ ఖర్చుతో, ఎక్కువ నీరు ఇవ్వగలిగే సాగునీటి ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రాష్ట్ర ఆర్థిక పునరుజ్జీవనానికి అవసరమైన అన్నీ నిర్ణయాలు తీసుకుంటామన్నారు.
డ్రగ్స్ విషయంలో ఎంతటి వారు ఉన్నా వదిలే సమస్య లేదు
తెలంగాణలో డ్రగ్స్ అన్న మాట వినిపించడానికి వీలు లేదని తాము సంకల్పం తీసుకున్నామన్నారు. డ్రగ్స్, గంజాయి విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహారిస్తోందన్నారు. టి న్యాబ్ కు పూర్తి సహకారం, స్వేచ్ఛ ఇస్తున్నాం. అవసరమైన నిధులు ఇస్తున్నామని, డ్రగ్స్ విషయంలో ఎంతటి వారు ఉన్నా వదిలే సమస్య లేదన్నారు. ఈ విషయంలో వ్యక్తిగతంగా తాను చాలా పట్టుదలతో ఉన్నానని సిఎం రేవంత్ తెలిపారు. ఇది మన యువత భవిష్యత్ కు సంబంధించిన అంశమని, అందుకే ఉక్కుపాదంతో అణచివేయాలని సంకల్పించామని సిఎం రేవంత్ తెలిపారు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణకు ప్రభుత్వ పరంగానే కాదు, వ్యక్తిగతంగా తాను ప్రాధాన్యత ఇస్తున్నాననన్నారు.

పలు పథకాల కోసం కోటి 28 లక్షల దరఖాస్తులు
పాలన ప్రజల వద్దకు చేర్చాలన్నది తమ ఆలోచన అని సిఎం రేవంత్ తెలిపారు. ఇందిరమ్మ గ్రామ సభల ద్వారా 2023 డిసెంబర్ 28 నుంచి 2024 జనవరి 6 వరకు అభయ హస్తం గ్యారంటీల అమలుకు దరఖాస్తులు స్వీకరించామన్నారు. మహాలక్ష్మీ, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, చేయూత, రైతు భరోసా పథకాల కోసం ఒక కోటి 28 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని ఆయన తెలిపారు. డూప్లికేట్ దరఖాస్తులు మినహాయించగా కోటి తొమ్మది వేల దరఖాస్తులు మిగిలాయన్నారు. ఈ దరఖాస్తులు కంప్యూటరీకరించి, పరిష్కరించే ప్రక్రియ నడుస్తోందన్నారు.
రద్దీని బట్టి ఆర్టీసి బస్సుల సంఖ్య పెంపు
అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే రెండు గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా వెళ్లే అవకాశం మహిళలకు ఈ పథకం ద్వారా లభించిందన్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసి బస్సుల సంఖ్యను పెంచామన్నారు.

రాజీవ్ ఆరోగ్య శ్రీ కాంగ్రెస్ పేటెంట్ స్కీం…
రాజీవ్ ఆరోగ్య శ్రీ కాంగ్రెస్ పేటెంట్ స్కీం అని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ పథకం ద్వారా తొలి సారి పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ పథకం లక్షలాది మంది ప్రాణాలు కాపాడిందన్నారు. ఈ పథకాన్ని మరింత సమర్ధంగా అమలు చేయడానికి ఐదు లక్షలు ఉన్న పరిధిని డిసెంబర్ 9, 2023 నుంచి పది లక్షల రూపాయలకు పెంచి అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకిక రణకు కట్టుబడి ఉందన్నారు. యువత ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షల నిర్వహణ పారదర్శకంగా నిర్వహించడానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేశామన్నారు.

11,062 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహణ
70 రోజుల్లోనే 30 వేల మంది యువతకు ఎల్బీ స్టేడియంలో ఉద్యోగ నియామక పత్రాలు అందించామని సిఎం రేవంత్ తెలిపారు. గ్రూప్ – 1 నోటిఫికేషన్ ఇచ్చామని, ఈ నెల 09వ తేదీన ప్రాథమిక పరీక్ష జరగబోతోందన్నారు. 11,062 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహణకు నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. వయో పరిమితిని 44 నుంచి 46 ఏళ్లకు పెంచామని, ప్రభుత్వంలో ఖాళీలను భర్తీ చేస్తామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో లక్షల మంది ప్రజలు సొంత ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారని, వారి కలలు నెరవేర్చేందుకు భద్రాద్రి రాముడి సాక్షిగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించామని సిఎం రేవంత్ పేర్కొన్నారు.

పేదల కోసం ఈ ఏడాది 4,50,000 ఇళ్లు
పేదల కోసం ఈ ఏడాది 4,50,000 ఇళ్లు నిర్మించబోతున్నామని, ఇందు కోసం 22,500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణను ఎడ్యూకేషన్ హబ్‌గా తీర్చిదిద్దాలని సంకల్పించామని ఆయన పేర్కొన్నారు. ప్రతి మండల కేంద్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేయబోతున్నామని ఆయన తెలిపారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. దీనిపై అధికారుల బృందం ఇప్పటికే ఢిల్లీ, ఒడిస్సా, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటించి, అధ్యయనం చేసిందన్నారు.

అమ్మ ఆదర్శ పాఠశాలల కింద 26,825 పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు….
అమ్మ ఆదర్శ పాఠశాలల కింద 26,825 పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, బాలికల కోసం ప్రత్యేక టాయ్‌లెట్ల నిర్మాణం, మంచినీరు, విద్యుత్ సదుపాయం కల్పిస్తున్నామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. దీని కోసం 1135 కోట్ల రూపాయలు కేటాయించామని రాష్ట్రంలోని 50 ఐటీఐల్లో సాంకేతిక నైపుణ్య శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు టాటా గ్రూప్‌తో ఒప్పందం చేసుకున్నామని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రైతు బాగుంటే రాష్ట్రం పచ్చగా ఉంటుందని విశ్వసించే ప్రభుత్వం తమదన్నారు. గతంలో రైతుకు ఉచిత విద్యుత్, రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్‌దన్నారు. ఆ ట్రాక్ రికార్డును ప్రజా ప్రభుత్వం కొనసాగిస్తోందని, రైతుకు ఆర్థిక సాయం పథకంలో భాగంగా 69 లక్షల మందికి చెప్పిన మాట ప్రకారం 7,500 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. ఇటీవల అకాల వర్షాలతో పంట నష్టం జరిగితే ఎకరాకు 10 వేల రూపాయలు పరిహారం ఇచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు.

మార్చి 6వ తేదీన అత్యధికంగా 298 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా
ధాన్యం సేకరణ కోసం 7,245 కేంద్రాలు తెరిచాం. ఎలాంటి షరతులు లేకుండా తడిచిన ధాన్యం కొంటున్నామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తరుగు పేరుతో రైతును దోపిడీ చేసే విధానాన్ని అరికట్టామని ఆయన పేర్కొన్నారు. నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపుతున్నామని వ్యవసాయానికి 24 గంటల నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామని ఆయన తెలిపారు. ధరణిపై స్పెషల్ డ్రైవ్ తో సమస్యలు పరిష్కరిస్తున్నామని, రాష్ట్రంలో విద్యుత్ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోందని, ఈ విషయంలో ఎవరికీ సందేహాలు అవసరం లేదని ఆయన తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మార్చి 6వ తేదీన అత్యధికంగా 298 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేసి, రికార్డు సృష్టించామన్నారు. పేదల గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నామని సిఎం రేవంత్ పేర్కొన్నారు.

దావోస్ పర్యటనలో రూ.40 వేల కోట్ల పెట్టుబడులు
దావోస్ పర్యటనలో భాగంగా 40 వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇది పెట్టుబడుల ఆకర్షణలో ఒక రికార్డు అని, ఈ ఒప్పందాలు కార్యరూపం దాల్చే కార్యచరణ మొదలుపెట్టామన్నారు. తద్వారా మన యువత ఉపాధి, ఉద్యోగ కల్పనకు ఈ ప్రభుత్వం కంకణబద్ధమై ఉందని సిఎం రేవంత్ తెలిపారు. మహాలక్ష్మీ పథకం ద్వారా కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్నది తమ సంకల్పం అన్నారు. మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తామని, విద్యార్థుల యూనిఫారం కుట్టే ఆర్డర్ మహిళా సంఘాలకే అప్పగించామన్నారు. గ్యాస్ బండను కేవలం 500 రూపాయలకే ఇచ్చే పథకాన్ని ప్రారంభించామని సిఎం రేవంత్ పేర్కొన్నారు.

తెలంగాణ ముందు పలు సవాళ్లు
తెలంగాణ ముందు పలు సవాళ్లు కూడా ఉన్నాయని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటా లెక్క తేల్చాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. పదేళ్లైనా నీటి పంపకాలు జరగలేదన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి త్వరగా నీటి వాటాలు సాధించుకొని, సాగునీటి ప్రణాళికలు సమర్ధవంతంగా అమలు చేసుకోవాలన్నది ప్రజా ప్రభుత్వ ఆలోచన అని ఆయన తెలిపారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి ఈ రోజుతో కాలం చెల్లిందని, ఆంధ్రప్రదేశ్ తో ఆస్తుల విభజనకు సంబంధించి సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకుంటామన్నారు. తెలంగాణ ప్రపంచానికి ఒక దిక్సూచి కావాలన్నారు.

ప్రపంచ నెంబర్‌వన్ బ్రాండ్‌గా హైదరాబాద్ ఎదగాలి
ప్రపంచానికి మన సత్తా చాటే శక్తిగా మారాలని, తెలంగాణ ఇతర రాష్ట్రాలతో కాదు ప్రపంచంతో పోటీ పడుతుందని నిరూపించాలన్నారు. మనకు శక్తి ఉంది, సత్తుఉంది, తెలివి ఉంది, తెగింపు ఉంది త్యాగల చరిత్ర ఉందని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రపంచ నెంబర్‌వన్ బ్రాండ్‌గా హైదరాబాద్ ఎదగాలని ఆయన ఆక్షాంక్షించారు. తెలంగాణను ప్రపంచానికి డెస్టినేషన్‌గా మార్చాలన్న తపన ఉందని, దీనికి నాలుగు కోట్ల ప్రజల ఆశీస్సులతో పాటు రాజకీయ, పరిపాలన, పత్రికా, న్యాయ, సామాజిక వ్యవస్థల సహకరం కావాలన్నారు. ఆ దిశగా ప్రతి ఒక్కరూ, ప్రతిక్షణం ఆలోచన చేయాలని ప్రజా ప్రభుత్వానికి మీ సంపూర్ణ సహకారం అందించాలని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News