Wednesday, June 25, 2025

‘పదవులు ఊడుతాయి.. జాగ్రత్త’: పిసిసి నూతన కార్యవర్గానికి సిఎం రేవంత్ వార్నింగ్

- Advertisement -
- Advertisement -

క్రమ శిక్షణతో పని చేయకపోతే … పదవులు ఊడుతాయి
పిసిసి నూతన కార్యవర్గానికి సిఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక
డి-లిమిటేషన్‌తో నియోజకవర్గాలు పెరుగుతాయి
మహిళా రిజర్వేషన్లూ రానున్నాయి
జమిలి ఎన్నికలూ అంటున్నందున అప్రమత్తంగా ఉండాలి

మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః ‘మీరంతా కష్టపడి పని చేయకపోతే…పదవులు ఊడుతాయి’ అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) నూతన కార్యవర్గాన్ని సున్నితంగా హెచ్చరించారు. పిసిసి నూతన కార్యవర్గ సమావేశం మంగళవారం గాంధీ భవన్‌లో జరిగింది. ఈ సమావేశానికి ఏఐసిసి నాయకురాలు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ మీనాక్షి నటరాజన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ ప్రభుత్వానికి-పార్టీకి మధ్య వారధులు మీరేనని నూతన కార్యవర్గాన్ని ఉద్దేశించి అన్నారు. పార్టీ కోసం కష్టపడకుండా పదవులను అలంకారంగా పెట్టుకునే వారిని తప్పించాలని ఆయన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు సూచించారు. పార్టీ కోసం నిరంతరం పనిచేసిన వారికే, బరువు మోసిన వారికే గుర్తింపు ఉంటుందని ఆయన తెలిపారు.

పార్టీ పదవులను చిన్న చూపు చూడరాదని, ఈ పదవే మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుందని ఆయన వారికి సూచించారు. వచ్చే ఎన్నికల్లోనూ పార్టీ విజయం సాధించాలంటే ఇప్పటి నుంచే అందరూ కష్టపడి పని చేయాలని, ప్రభుత్వం చేపట్టిన, చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికీ తెలియజేయడానికి మీరే వారధులు, సారధులు కావాలని ఆయన ఆకాంక్షించారు. వచ్చే ఎన్నికల తర్వాత కూడా భవిష్యత్తుల్లోనూ అధికారంలోకి రావడానికి మీ చేతుల్లోకి తీసుకోవాలని, అప్పటి వరకూ తనదే బాధ్యత అని అన్నారు. కష్టపడినందుకే తనకు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి మొదలుకొని ముఖ్యమంత్రి పదవి వరకూ ప్రమోషన్ లభించిందని అన్నారు.

అదేవిధంగా ఇక్కడ ఉన్న ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, ఇతర మంత్రులు, వివిధ కార్పోరేషన్ల చైర్మన్లూ పార్టీ కోసం నిరంతరం కష్టపడిన వారేనని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన నిర్మలా జగ్గారెడ్డికి పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థకు చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారని ఉదహరించారు. అక్కడే ఉన్న జగ్గారెడ్డి ఏదో సైగ చేస్తుంటే ఇందులో మీ రెకమండేషన్ ఏమీ లేదని ముఖ్యమంత్రి అనడంతో అందరూ నవ్వారు. జమిలి ఎన్నికల గురించి కేంద్రం అంటున్నది కాబట్టి మీరంతా సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. బట్టలు డ్రై-క్లీనిక్ ఇచ్చామనో, ఇస్త్రీ షాపులో ఇచ్చామనో అవి వేసుకుని వస్తామంటే పుణ్యకాలం కాస్త దాటిపోతుందని ఆయన వారిని అప్రమత్తం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని, దీంతో నియోజకవర్గాలు పెరుగుతాయని, మహిళా రిజర్వేషన్లూ వస్తాయి కాబట్టి అపమత్తంగా ఉంటూ, తమ వెంట నడవాలని ముఖ్యమంత్రి నూతన కార్యవర్గానికి సూచించారు.

దళారీల అడ్డాగా సర్వీసు కమిషన్
తాము అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టామని ముఖ్యమంత్రి వివరించారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పిఎస్‌సిను దళారీల అడ్డాగా మార్చారని ఆయన ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నామని, తాజాగా రైతు భరోసా నిధులు విడుదల చేశామని, వ్యవసాయానికి ఉచితంగా నాణ్యమైన ఉచిత విద్యుత్తునిస్తున్నామని, స్పోర్ట్ యూనివర్సిటీని చేపట్టామని ఆయన తెలిపారు.

మోదీకి సవాల్ విసిరాం
సామాజిక, ఆర్థిక కార్యక్రమాల్లో భాగంగా తాము కులగణన చేపట్టి బిసిలకు రిజర్వేషన్లు చేపట్టి ప్రధాని నరేంద్ర మోదీకి సవాల్ విసిరామని ఆయన తెలిపారు. కేంద్రం మెడలు వంచడంతో, ప్రధాని మోదీ కూడా జనగణనతో పాటు కులగణన చేపట్టడానికి సిద్ధమయ్యారని ఆయన వివరించారు. ఎస్‌సి వర్గీకరణ కావాల్సిందేనని అన్నామని, 2047 విజన్ డాక్యుమెంట్‌తో ముందుకు వెళుతున్నామని ఆయన తెలిపారు. ప్రతి రంగంలోనూ దేశానికి ఆదర్శంగా నిలుస్తామని ఆయన అన్నారు. అందరమూ కలిసి పని చేస్తే భవిష్యత్తు మనదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన కార్యవర్గ సభ్యులనుద్ధేశించి తెలిపారు.
నియామక పత్రాలు
ఇదిలాఉండగా ఇటీవల నియమితులైన పిసిసి కార్యవర్గ సభ్యుల్లో సీనియర్ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులైన పలువురికి మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క నియామక పత్రాలు అందజేశారు. సీనియర్ నాయకులైన కుమార్ రావు, విఠల్ ఱావు, రఘవీర్ రెడ్డి, అసదుద్దీన్, ఆత్రం సక్కు, అల్లం భాస్కర్ తదితరులు అతిథుల చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News