Monday, June 9, 2025

మాకు కొబ్బరి బోర్డు ప్రాంతీయ కార్యాలయం కావాలి

- Advertisement -
- Advertisement -

ఆయిల్ పామ్ దిగుమతి సుంకం తగ్గింపును పునఃసమీక్షించాలి
కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు మంత్రి తుమ్మల విజ్ఞప్తి

మన తెలంగాణ / హైదరాబాద్: రాష్ట్రంలో కొబ్బరి అభివృద్ధి బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని(Coconut Board regional office) భద్రాద్రి ఏర్పాటు చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర సహాయమంత్రి భగీరథ్ చౌదరిలు రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా మంత్రి తుమ్మల వారిని కలుసుకుని ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనకు తెలంగాణ ప్రభుత్వం తరపున తాము విజ్ఞప్తి చేసే ఐదు అంశాలు అత్యంత కీలకమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ‘రైతు సంక్షేమానికి మద్దతు ఇవ్వడం, వ్యవసాయ రంగం అభివృద్ధికి కేంద్ర సహకారం తప్పనిసరి‘ అని ఆయన కేంద్ర మంత్రిని కోరారు.

కొబ్బరి బోర్డు ప్రాంతీయ కార్యాలయం

తెలంగాణలో ప్రస్తుతం 3,300 ఎకరాల మేరకు కొబ్బరి సాగు జరుగుతుందని, అందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,757 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 696 ఎకరాలు కలిపి సుమారు 75 శాతం కొబ్బరి సాగును చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలోని మిగతా జిల్లాలలో కూడా కొబ్బరిసాగును విస్తరించేందుకు విరివిగాఅవకాశాలు ఉన్నాయని వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా కొబ్బరిబోర్డు కార్యాలయం ఉండేదని, రాష్ట్ర విభజనలో అది విజయవాడకు తరలిపోయిందని వివరించారు. ప్రస్తుతం రాష్ట్ర కొబ్బరి రైతులు (Coconut Board regional office) సకాలంలో సేవలు అందుకోలేక పడుతున్న ఇబ్బందులను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ కొబ్బరి రైతుల సంక్షేమం దృష్ట్యా ఆశ్వారావుపేట లేదా దమ్మపేటలో పూర్తిస్థాయిలో కొబ్బరి అభివృద్ధి బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మల కోరారు.

ఆయిల్ పామ్ సుంకం తగ్గింపు సరికాదు

ఆయిల్ పామ్ దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం పునఃసమీక్షించాలి – మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రులను కోరారు. ఆయిల్ పామ్ విత్తనాల సరఫరాదారుల ఎంప్యానెల్‌మెంట్ కోసం కేంద్రం తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. ఆయిల్ పామ్ సాగు కోసం కేంద్రం చేపట్టిన ‘నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ – ఆయిల్ పామ్‘ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1.25 లక్షల హెక్టార్లకు లక్ష్యంగా పెట్టుకొని, ఇప్పటివరకు 75వేల హెక్టార్లలో సాగు చేపట్టి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని మంత్రి వివరించారు. దేశీయంగా సరిపడా విత్తనాలు అందుబాటులో లేనందున, ఆయిల్ పామ్ కంపెనీలు విదేశాలనుంచి విత్తనాలను దిగుమతి చేసుకుంటున్నాయన్నారు.

40 శాతం దేశీయ నూనె ఉత్పత్తి

దేశంలో ఉపయోగించే నూనె ఉత్పత్తులలో కేవలం 40 శాతం మాత్రమే దేశీయంగా ఉత్పత్తి చేస్తున్నాయని, మిగతా 60 శాతం ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతుందని, అందులో 54 శాతం కేవలం ఇండోనేషియా, మలేషియా దేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నట్లు మంత్రి తుమ్మల వివరించారు.

హార్టికల్చరల్ వర్సిటీ రూ.100కోట్లు ఇవ్వండి

ఆచార్య కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీకి రూ.100 కోట్లు మంజూరు చేయాలని మంత్రి తుమ్మల కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం (2014)లోని 13వ షెడ్యూల్ ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి హార్టికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఈ సందర్భంగా మంత్రి తుమ్మల గుర్తుచేశారు. దీనికోసం రూ.1,823.20 కోట్ల బడ్జెట్‌తో ప్రాజెక్ట్ రిపోర్టు సమర్పించామని, అయితే ఇప్పటివరకు కేవలం రూ.135 కోట్లు మాత్రమే విడుదలయ్యాయని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఈ విశ్వవిద్యాలయం కనీస వసతులతో కొనసాగుతోందని, పూర్తిస్థాయిలో విద్యా, పరిశోధన, విస్తరణ సేవలు అందించేందుకు మిగతా నిధుల విడుదల అత్యవసరం అని కేంద్ర మంత్రికి తుమ్మల వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News