Saturday, April 20, 2024

రాజయ్య ‘రాజీ’

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : ఎమ్మెల్యే రాజయ్య, జానకీపురం సర్పంచ్ నవ్యల మధ్య సయోధ్య కుదిరింది. ఈ క్రమంలోనే సర్పంచ్ ఇంటికి ఎమ్మెల్యే రాజయ్య వెళ్లారు. ఈ సందర్భంగా వారిద్దరు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎమ్మెల్యే రాజయ్యపై జానకీపురం సర్పంచ్ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం సృష్టించి విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే రాజయ్య వరంగల్ జిల్లాలోని ధర్మసాగర్ మండలం జానకీపురం గ్రామ సర్పంచ్ నవ్య ఇంటికి వెళ్లారు. అధిష్టానం ఆదేశం, నవ్య భర్త ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చానని ఆయన తెలిపారు. పార్టీ అధిష్టానం తనకు పలు సూచనలు చేసిందని, అందరూ కలిసి పనిచేయాలని చెప్పిందని రాజయ్య పేర్కొన్నారు.

క్షమాపణలు కోరుతున్నా….

తన వల్ల ఎవరికైనా బాధ కలిగితే క్షమాపణలు కోరుతున్నానని ఆయన తెలిపారు. జరిగిన పరిణామాలకు తాను చింతిస్తున్నానని ఆయన తెలిపారు. తాను ఏ ఊరి పట్ల వివక్ష చూపలేదన్నారు. మహిళలు వారి హక్కులు సాధించుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఊపిరి ఉన్నంత వరకు మహిళల ఆత్మగౌరవం కోసం కృషి చేస్తానని ఆయన వివరించారు. ఎవరైనా మానసిక క్షోభకు గురైతే క్షమాపణలు చెబుతున్నానని ఎమ్మెల్యే రాజయ్య తెలిపారు. గతంలో పార్టీ ఆదేశానుసారం ఉపముఖ్యమంత్రి పదవి వదులుకున్నానని రాజయ్య గుర్తు చేశారు. మహిళల హక్కుల కోసం పోరాటంలో తాను ఉంటానని వివరించారు. జానకీపురం గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే గ్రామానికి రూ.25 లక్షలు మంజూరు చేస్తానని రాజయ్య వెల్లడించారు.

రాజకీయాల్లో అణచివేతలు, వేధింపులు ఉండొద్దు

ఈ సందర్భంగా జానకీపురం సర్పంచ్ నవ్య మాట్లాడుతూ చెడును తాను కచ్చితంగా ఖండిస్తానని నవ్య తెలిపారు. ఎవరికైనా పార్టీలో విలువ ముఖ్యమన్నారు. ఎమ్మెల్యే రాజయ్య వల్లే తాను సర్పంచ్ అయ్యాయని ఆమె గుర్తు చేశారు. రాజకీయాల్లో అణచివేతలు, వేధింపులు ఉండొద్దని ఆమె వివరించారు. మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడితే సహించేది లేదని ఆమె వెల్లడించారు. పార్టీలో ఏ స్థాయిలో ఉన్న మహిళలకైనా గౌరవం ముఖ్యమన్నారు. తమకు దక్కాల్సిన గౌరవం దక్కకుంటే సహించేది లేదన్నారు. మహిళలపై అరాచకాలు జరిగితే ఊరుకోనన్నారు. మహిళలను వేధిస్తే కిరోసిన్ పోసి నిప్పంటించేం దుకు సిద్ధమని, పార్టీలో తప్పులు జరిగితే ఖండిస్తూనే ఉంటానని ఆమె పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News