Friday, May 3, 2024

కాంగ్రెస్ నుంచి సిఎంగా సిద్ధరామయ్య ?

- Advertisement -
- Advertisement -

బెంగళూరు :  పార్టీ తరఫున ఎవరు ముఖ్యమంత్రి కానున్నారు? అనే విషయం ప్రధాన చర్చకు దారితీసింది. సీనియర్ నేత , మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పార్టీ తరఫున ముఖ్యమంత్రి పదవికి ప్రధాన పోటీదారు అవుతారని భావిస్తున్నారు. ఇక పిసిసి నేత , పలు దశల్లో రాష్ట్రంలో పార్టీకి ఆత్మస్థయిర్యం కల్పించాడనే పేరు తెచ్చుకున్న డికె శివకుమార్ కూడా సిఎం పదవి సరైన రీతిలో అభ్యర్థి అవుతారని ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో కాంగ్రెస్‌లో అంతర్గతంగా డికె, సిద్ధరామయ్య మధ్య వర్గపోరు ఉందనే ప్రచారం బలంగా నాటుకుపోయింది. దీని ప్రభావం ఖచ్చితంగా ఎన్నికలపై పడుతుందని భావించారు. అయితే దీనిని పెద్దగా పట్టించుకోకుండా ఎఐసిసి అధ్యక్షులు, కర్నాటకలో కాంగ్రెస్ బలాలు బలాలు గురించి ఏళ్ల తరబడి తెలిసిన వ్యక్తిగా ప్రత్యేకించి సోనియాకు విధేయుడిగా మల్లిఖార్జున ఖర్గే బలీయ ప్రచారం సాగించడం,

ఇదే దశలో సిద్ధరామయ్య , డికెలు కూడా పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలనే తపనతో ప్రజల వద్దకు వెళ్లడంతో పార్టీ అనూహ్య విజయానికి దారితీసింది. ప్రచారం ముగింపు దశలోనే డికె విలేకరులతో మాట్లాడుతూ తనకు సిద్ధరామయ్యకు ఎటువంటి విభేదాలు లేవని స్పష్ఠం చేస్తూ తాను ఈ సీనియర్‌ను కలిసిన ఫోటోలను వెలువరించారు. సిద్ధరామయ్య మార్గదర్శకత్వంలోనే సాగుతామని ప్రకటించారు. దీనితో పార్టీలో గ్రూప్ తగాదాలు లేవని స్పష్టం అయింది. ఇప్పుడు కాంగ్రెస్ తరఫున ప్రధానంగా పేరు మార్మోగుతున్న సిద్ధరామయ్య 75 ఏళ్ల జీవితంలో పలు రాజకీయ ఎత్తుపల్లాలను చవిచూశారు. జనతాపరివార్ నుంచి వచ్చిన ఈ నేత తొలుత పాతిక సంవత్సరాలు కాంగ్రెస్ అంటే పడని వ్యక్తిగానే నిలిచారు. అయితే మాజీ ప్రధాని దేవెగౌడకు చెందిన జెడిఎస్ నుంచి 2006లో బర్తరఫ్ తరువాత సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీని ఎంచుకుని, పార్టీలో ముందుకు సాగారు. ఎన్నికల ఫలితం సిద్ధరామయ్యలో మరింత శక్తినికల్పించినట్లు అయింది.

మైసూరులో జరిగిన విలేకరుల సమావేశంలో శనివారం ఆయన మాట్లాడారు. ఇక్కడి విజయం 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి సంకేతం అన్నారు. ఎన్నికలకు ముందు ఆయన ఇది తన చివరి ఎన్నికల ఘట్టం అని తెలిపారు. తరువాత ఎన్నికల రాజకీయాలనుంచి వైదొలుగుతానని తెలిపారు. ఇప్పుడు పార్టీ తిరగులేని స్థాయిలోనే విజయం సాధించడంతో ఇక తన వంతు పాత్ర ఉందని ఆయన తెలిపి, తాను సిఎం పదవిని ఆశిస్తున్నట్లు చెప్పకనే తెలిపారు. కర్నాటకలో సిద్ధరామయ్య 2013 నుంచి 2018 వరకూ సిఎంగా ఉన్నారు. ఇప్పుడు పార్టీలో సిఎం పదవికి ఆయనకు డికెకు పోటీ ఉంటుందని ప్రచారం జోరందుకుంది. అయితే ఖర్గే పార్టీ సిఎల్‌పి నేత ఎవరనేది పార్టీ అధిష్టానం తేలుస్తుందన్నారు. సీనియర్ నేతలు , పదవులకు సాధ్యమైనంత దూరంగానే ఉండే వీరప్ప మొయిలీ, ఖర్గే వంటి వారి సామరస్య ధోరణితో కాంగ్రెస్ తరఫున సిఎం పదవికి ఎవరు ఎంపికవుతారు? అనేది పెద్దగా వివాదాస్పదం కాదనే ఆశిస్తున్నారు.

రాహుల్, సోనియాల ఆదేశాల మేరకు సిఎల్‌పి నేత ఎంపికకు రంగం సిద్ధం అవుతుందని వెల్లడైంది. అయితే ఇదంతా కూడా వాస్తవిక ప్రాతిపదికన కేవలం పార్టీ అధ్యక్షులు ఖర్గే ఇతర నేతల ప్రజాస్వామిక నిర్ణయం ద్వారా జరుగుతుందనే అభిప్రాయాన్ని ముందుగా తెలియపర్చడం జరుగుతుంది. ఇంతకు ముందు ఖర్గేకు , సిద్ధరామయ్యకు పార్టీ నాయకత్వం తరువాత సిఎం పదవి విషయాలలో విభేదాలు తలెత్తాయి. అయితే ఖర్గే పార్టీ ప్రయోజనాల దిశలో పోటీనుంచి విరమించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఢిల్లీ రాజకీయాలపైనే ఖర్గే కేంద్రీకృతం అయ్యారు. తాను డాక్టర్ రామ్ మనోహర్ లోహియా సోషలిజం సిద్ధాంతాలతో స్ఫూర్తి పొందానని తన రాజకీయ ప్రస్థానం ఈ నేపథ్యంలోనే సాగుతుందని సిద్ధరామయ్య పలు సందర్భాలలో తెలిపారు. 2004లో కర్నాటకలో విస్పష్ట మెజార్టీ రాని స్థితిలో కాంగ్రెస్ జెడిఎస్‌ల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అయింది. అప్పట్లో ఎన్ ధరమ్‌సింగ్ సిఎం అయ్యారు. జెడిఎస్ తరఫున సిద్ధూ ఉపముఖ్యమంత్రి అయ్యారు.

కుర్బా కులానికి చెందిన బిసి అయిన సిద్ధరామయ్య 2005లో సిఎం పీఠం కోసం ఆశించారు. ఈ దశలోనే ఆయన జెడిఎస్ నుంచి బర్తరఫ్ అయ్యారు. అడ్వకేట్ కూడా అయిన ఆయన ఈ తరుణంలో తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని తెలిపారు. లాయర్ వృత్తికి పరిమితం అవుతానని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలను పెట్టే ధన బలం లేదని తెలిపారు. ఈ దశలో బిజెపి ఆయనను పార్టీలోకి లాగేందుకు యత్నించింది. కానీ తనకు బిజెపి సిద్ధాంతాలంటే పడదని తెలిపిన సిద్ధూ కాంగ్రెస్‌లో చేరారు. ప్రజల మనిషిగా పేరొందిన ఆయన ఇప్పుడు డికె వర్గం సమ్మతి సానుకూలం అయితే తిరిగి మరోసారి సిఎం అయ్యేందుకు రంగంసిద్ధం అయింది. ఆర్థిక మంత్రిగా ఆయన కర్నాటక అసెంబ్లీలో 13 సార్లు బడ్జెట్‌నుప్రవేశపెట్టిన ఘనత ఉంది. 1983లో ఆయన తొలిసారిగా అసెంబ్లీలోకి లోక్‌దళ్‌పార్టీ టికెట్‌పై గెలిచి ప్రవేశించారు. చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి ఆయన ఐదుసార్లు గెలిచారు. అక్కడనే మూడుసార్లు ఓడారు.

లాయర్‌గానే కాకుండా ఆయన కన్నడ భాష పటిష్టతకు పాటుపడ్డో వ్యక్తిగా నిలిచారు. కన్నడ కవుల సమితి అధ్యక్షులుగా తొలిసారి వ్యవహరించారు. రామకృష్ణ హెగ్డే సిఎంగా ఉన్నప్పుడు ఈ పదవిని తీసుకుని రాష్ట్రంలో కన్నడను అధికార భాషగా అమలు చేయడంలో సరైన విధంగా బాధ్యత నిర్వర్తించారు. తరువాత పట్టుపరిశ్రమల మంత్రిగా ఉన్నారు. పట్టుదల పరిశ్రమకు పెట్టింది పేరుగా నిలిచారు. మైసూరు ప్రాంతంలోని సిద్ధరామనహుండీ గ్రామంలో ఆయన 1948 ఆగస్టు 12న జన్మించారు. మైసూరు వర్శిటీ నుంచి బిఎస్‌సి చేసి తరువాత లా పట్టా తీసుకున్నారు. ఈ వృత్తిలో ఉండి తరువాత రాజకీయాల్లోకి వచ్చారు. రాష్ట్రంలో ఐదేళ్లు సిఎంగా పదవీ బాధ్యతలను నిర్వర్తించిన ఘనత కూడా దక్కించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News