Saturday, July 27, 2024

అమ్మ ఒడిలా… ప్రభుత్వ బడి

- Advertisement -
- Advertisement -

ఇక నుంచి ప్రభుత్వ బడి అమ్మ ఒడిలా…
ప్రతి విద్యార్థి ఆలనా పాలన చూసుకునేలా ప్రభుత్వ పాఠశాలల మార్పు
ఈ సరికొత్త ప్రణాళికకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం
ఈ విద్యా సంవత్సరం నుంచే అన్ని గ్రామాల్లో అమలు
ప్రతి ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఏర్పాటు

మనతెలంగాణ/హైదరాబాద్: ఇక నుంచి ప్రభుత్వ బడి అమ్మ ఒడిలా మారనుంది. ప్రభుత్వ పాఠశాలలో ప్రతి విద్యార్థి ఆలనా పాలన చూసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ సరికొత్త ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. ఈ విద్యా సంవత్సరం నుంచే అన్ని గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల బాగోగులను పట్టించుకునే బాధ్యతను అక్కడి స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలో ఆయా గ్రామాల మహిళా సంఘం అధ్యక్షురాలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ప్రతి తరగతిలో చదువుతున్న ముగ్గురు విద్యార్థుల తల్లులు ఈ కమిటీలో ఉంటారు. ఇకపై పాఠశాలల్లో జరిగే ప్రతి సివిల్ వర్క్ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ తీర్మానంతోనే చేపడుతారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ కార్యాచరణ మొదలు పెట్టనున్నారు.

ఇప్పటికే రూ.600 కోట్లు విడుదల
ఈ పాఠశాలల్లో అవసరమయ్యే తక్షణ పనులను గుర్తించి జూన్10వ తేదీలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రూ.25 వేల లోపు ఖర్చు అయ్యే పనులను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు చేపట్టనుండగా అంతకు మించి రూ.లక్ష వరకు చేసే పనులకు ఎంపీడిఓ, రూ.లక్ష దాటిన పనులకు జిల్లా కలెక్టర్లు అనుమతి ఇస్తారు. పాఠశాలల్లో కిటికీలు, తలుపులు, ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డులు, ఫ్యాన్లు, మరుగుదొడ్ల తాత్కాలిక మరమ్మతులు ఈ కమిటీలు చేపట్టనున్నాయి. వీటికి అవసరమైన దాదాపు రూ.600 కోట్లు ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. సంఘాల మహిళలపై భారం లేకుండా ఆదర్శ కమిటీలు చేపట్టే పనులకు రూ.25 వేలు అడ్వాన్సుగా అందించారు. వీటితో పాటు పాఠశాల విద్యార్థుల యూనిఫాం కుట్టే పనులను ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకే అప్పగించింది. దీంతో సంఘాలకు స్థానికంగా ఉపాధి దొరుకుతుందని, అంతమేరకు ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం నిర్ణయించింది.

తల్లుల కమిటీ అధ్వర్యంలో ఈసారి బడిబాట
ఈసారి బడిబాట కార్యక్రమం కూడా తల్లుల కమిటీ అధ్వర్యంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతం పెరుగుతుందని, తల్లుల పర్యవేక్షణ పెంచటం ద్వారా బడిలో చేరే ఆడ పిల్లల సంఖ్య కూడా పెరుగుతుందని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రైవేటు బడి మోజును తగ్గించి నాణ్యమైన విద్యను అందించే ఉపాధ్యాయులున్న ప్రభుత్వ పాఠశాలల వైపు పిల్లలను చేర్పించేందుకు స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News