Saturday, July 27, 2024

కాంగ్రెస్ 55 ఏళ్ల పాలనలో ఏనాడు పూజలను అడ్డుకోలేదు

- Advertisement -
- Advertisement -

ఇండియా కూటమి అధికారాల్లోకి రాగానే ఇంటి పెద్ద ఖాతాలో లక్ష రూపాయలు జమ చేస్తాం
దేశవ్యాప్తంగా ఉచిత ఆరోగ్య బీమా అమలు చేస్తాం
దేశంలో హరిత విప్లవం తెచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే
జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు, దేశ సంపద ఈ దేశ ప్రజలకే చెందాలి
పంజాబ్ ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ తన 55 ఏళ్ల పరిపాలనలో ఏనాడు పూజా కార్యక్రమాలను అడ్డుకోలేదని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మంగళవారం పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్ కోట్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని కొట్కపుర అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. సభకు ముందు ప్రధాన అతిథిగా విచ్చేసిన ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కు డిప్యూటీ సిఎం స్వాగతం పలికారు. గత వారం రోజులుగా ఫరీద్‌కోట్ లోక్ సభ నియోజకవర్గంలో డిప్యూటీ సిఎం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంగళవారం కోటక్ పుర ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభను ఆయన స్థానికంగా మకాం వేసి సమన్వయం చేశారు.

కాంగ్రెస్ పేదల కోసం పనిచేస్తుంటే బిజెపి మాత్రం కొద్ది మంది పెద్దల కోసం పనిచేస్తుందన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా ఇంటి పెద్ద బ్యాంకు ఖాతాలో లక్ష రూపాయల నగదు జమ చేస్తామన్నారు. తాము మహిళలను మహారాణులుగా చూస్తామన్నారు. కాంగ్రెస్ సర్కారు ఎప్పుడు పేదల గురించే ఆలోచన చేస్తుందని, బిజెపి పేదలకు రూపాయి కూడా ఇవ్వలేదు, అదానీ, అంబానీ వంటి కొద్ది మంది పెద్దలకు మాత్రం 16 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేసి, మోడీ 10 ఏళ్ల పాలనలో 100 లక్షల కోట్ల అప్పులు చేసి దేశాన్ని అప్పులకుప్పగా మార్చారని విమర్శించారు. జనాభా దామాషా ప్రకారం దేశ సంపద పంపిణీ జరగాలి, తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి అదే విధంగా అన్ని చోట్ల రిజర్వేషన్లు పెంచుతామని ఇండియా కూటమి స్పష్టం చేసిందన్నారు.

మేం పేదల కోసం ఎప్పుడు పథకాలు ప్రకటించిన బిజెపి వారు మమ్ములను విమర్శిస్తూనే ఉంటారని తెలిపారు. యుపిఎ హయాంలో ఉపాధి హామీ పథకం, ఆహార భద్రత, రూరల్ హెల్త్ మిషన్, భూ సంస్కరణలు, బ్యాంకుల జాతీయకరణ చేసినప్పుడు సైతం వారు విమర్శించారని గుర్తు చేశారు. ప్రాణాలు లెక్కచేయకుండా సరిహద్దుల్లో కాపలాకాస్తున్న వీర జవాన్ల స్థాయిని మోడీ ప్రభుత్వం కార్మికుల స్థాయికి దిగజార్చిందని విమర్శించారు. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే అగ్నివీర్ పథకాన్ని రద్దు చేస్తుందని ప్రకటించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదల ఆరోగ్య భీమాకు సంబంధించిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచాలని, ఇండియా కూటమి అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా ఉచిత ఆరోగ్య భీమా పథకాన్ని అమలు చేస్తుందని తెలిపారు.

మద్దతు ధర, రుణమాఫీ కోసం ఢిల్లీలో రైతులు నెలల తరబడి ఆందోళన చేస్తే మోడీ 10 నిమిషాలు కూడా వారికోసం కేటాయించలేదని ఆ పోరాటంలో వందలాది మంది రైతులు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని గుర్తు చేశారు. జై జవాన్ జై కిసాన్ కాంగ్రెస్ నినాదం అన్నారు. నెహ్రూ కాలం నుంచి మొన్నటి మన్మోహన్ సింగ్ కాలం వరకు వారి సంక్షేమమే ధ్యేయంగా పనిచేశామని గుర్తు చేశారు. ఈ దేశంలో హరిత విప్లవం తీసుకువచ్చి వ్యవసాయ ఉత్పత్తులను మూడింతలు పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలదే అన్నారు. రైతు, శ్రామికుల రుణమాఫీకి ఇండియా కూటమి కట్టుబడి ఉందన్నారు. తెలంగాణలో రైతు రుణమాఫీ చేయబోతున్న విషయాన్ని వివరించారు.

ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతిరోజు 400 రూపాయల కూలి భద్రతను ఇండియా కూటమి కల్పిస్తుందన్నారు. ఈ దేశం కోసం దేహాలను ముక్కలు చేసుకున్న చరిత్ర దివంగత ప్రధానులు ఇందిరా, రాజీవ్ గాంధీ లది వారి వారసత్వాన్ని యువనేత రాహుల్ గాంధీ కొనసాగిస్తున్నట్టు వివరించారు. జనాభా దామాషా ప్రకారం ఈ దేశ సంపద, వనరులు పంపిణీ చేయడమే లక్ష్యంగా ఆయన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర, మణిపూర్ నుంచి ముంబై వరకు బస్సు యాత్ర చేసిన విషయాన్ని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క స్థానిక ప్రజలకు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News